Begin typing your search above and press return to search.

గులాబీలో టీటీడీపీ విలీనం సాధ్యమా?

By:  Tupaki Desk   |   11 Feb 2016 5:30 PM GMT
గులాబీలో టీటీడీపీ విలీనం సాధ్యమా?
X
తెలంగాణాలోని తెలుగుదేశం శాసనసభా పక్షం (టిడిఎల్‌ పి)గులాబీ పార్టీలో విలీనం దిశగా సాగుతున్నదా? టీడీపీ తరపున గెలిచిన 15 మంది ఎంఎల్ఏల్లో మెజారిటీ సభ్యులు ఇప్పటికే టిఆర్ ఎస్ లో చేరడంతో విలీనం దిశగా యోచన జరుగుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మెజారిటీ ఎంఎల్ ఏలు టిఆర్ ఎస్‌ లో చేరిపోవటంతో తమదే అసలైన తెలుగుదేశం పార్టీ అని వారితోనే స్పీకర్‌ కు లేఖ ఇప్పించేందుకు టిఆర్ ఎస్ సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం.

గత ఎన్నికల్లో టిడిపి తనపున 15 మంది శాసనసభ్యులు గెలిచారు. వారిలో ఇప్పటికి తొమ్మిదిమంది టిఆర్ ఎస్‌ లో చేరారు. ఎల్‌ బి నగర్ నుండి విజయం సాధించిన ఆర్. కృష్ణయ్య గెలిచిన దగ్గర నుండీ పార్టీతో అంటీ ముట్టనట్లుగానే ఉంటున్నారు. ఇక మిగిలింది ఐదుగురే. వీరిలో కూడా మరో ఇద్దరు వీలైనంత తొందరగా పార్టీని వీడేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నట్లు సమాచారం. అదేగనుక జరిగితే టిడిపి నుండి టిఆర్ ఎస్‌ లోకి వెళ్ళిన సభ్యుల సంఖ్య 11కు చేరుకుంటుంది. అప్పుడు టిడిపిలో మిగిలేది నలుగురు ఎంఎల్ ఏలు మాత్రమే. అంటే, మొత్తం గెలిచిన శాసనసభ్యులతో చూసుకుంటే టిడిపిలో ఉండబోయేది మైనారిటీ సంఖ్యే. ఈ లెక్కల ప్రాతిపదికగానే అధికార పార్టీ అవకాశంగా మార్చుకుంటోంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం తొమ్మిది(త్వరలో మరో ఇద్దరు) ఎమ్మెల్యేలు కలిసి గ్రూపుగా ఏర్పాటై తమదే అసలైన టిడిపి అని క్లైం చేసుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఎర్రబెల్లి స్పీకర్ కు లేఖ రాస్తారని సమాచారం. టిఆర్ ఎస్‌ లో చేరిన టిడిపి ఎంఎల్ ఏలతో విలీనం లేఖ రాయించేందుకు ఎంత అవకాశం ఉందన్న విషయమై న్యాయసలహాను కూడా కోరుతున్నట్లు తెలిసింది. అయితే... టీఆరెస్ లో చేరిన వారంతా టీడీపీకి తాము రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించినవారు కావడంతో వారు ఇప్పుడు తమదే అసలైన టీడీపీ అంటే ఆ మాట చెల్లుతుందా అన్న ప్రశ్న తలెత్తుతోంది. దీంతోనే న్యాయ సలహాకు వెళ్తున్నట్లుగా సమాచారం.

అయిత.. న్యాయం, చట్టాలు ఎలా ఉన్నా శాసనసభ్యులు ఏమి క్లైం చేసినా సాంకేతికంగా వారు చేసింది తప్పా ఒప్పా అని తేల్చాల్సింది అసెంబ్లీ స్పీకరేనన్న విషయం అందరికీ తెలిసిందే. ఏడాది క్రితం టిడిపి వీడి అధికారపార్టీలో చేరిన వారిపై అనర్హత వేటు వేయాలంటూ టిడిపి ఎంఎల్ ఏలు స్పీకర్ వద్ద ఎంత మొరపెట్టుకున్నా ఎటువంటి ఫలితమూ ఇప్పటి వరకూ కనబడలేదు. మరో మూడేళ్ల వరకూ స్పీకర్ ఈ విషయమై సాచివేత ధోరణిని ప్రదర్శించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే, కొంత కాలం క్రితం టిడిపి తరపున శాసనమండలికి ఎన్నికైన సభ్యుల్లో కొందరు తమదే అసలైన టిడిపి అని శాసనమండలి ఛైర్మన్ స్వామి గౌడ్‌ కు లేఖ రాసారు. టిడిపి తరపున సభలో ఉన్న ఆరుగురు ఎంఎల్‌ సీల్లో ఐదుగురు టిఆర్ ఎస్‌ లో చేరారు. అప్పడు కూడా ఎంఎల్‌ సీలు ఇదే విధంగా క్లైం చేసుకున్నారు. అయితే, ఛైర్మన్ ఇప్పటి వరకూ సదరు లేఖపై ఎటువంటి నిర్ణయ మూ తీసుకోలేదు. అప్పట్లో ఛైర్మన్‌ కు లేఖ రాసిన ఎంఎల్‌ సీల పదవీ కాలం పూర్తయిపోవటం, వారిలో కొందరు తిరిగి గెలవటం కూడా అయింది. అప్పుడు రాసిన లేఖ ఇంకా ఛైర్మన్ పరిశీలనలోనే ఉంది. అదే విధంగా, ఇపుడు కూడా జరిగే అవకాశాలే ఎక్కువని భావిస్తున్నారు.

ఎంఎల్ ఏలపై స్పీకర్ చర్యలు తీసుకోవాలని ఆదేశిం చాలంటూ టిడిపి న్యాయస్ధానాన్ని ఆశ్రయించింది గతం లో. అయితే, ఈ విషయమై జోక్యం చేసుకోవటానికి న్యా యస్ధానం కూడా సుముఖత చూపలేదు. ఈ వెసులుబాటే అధికార పార్టీలకు కలిసివస్తోంది. గతంలో టిఆర్ ఎస్ శాసనసభ్యులను పార్టీలోకి చేర్చుకున్నపుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఇటువంటి వెసులుబాటునే ఉపయోగించుకున్నది. కాబట్టి అదే మార్గంలో ఇపుడు టిఆర్ ఎస్ కూడా ప్రయాణిస్తున్నది.