Begin typing your search above and press return to search.

టీడీపీ, క‌మ్యూనిస్టులు క‌లిసిపోతున్నార‌ట‌

By:  Tupaki Desk   |   28 Oct 2016 2:28 PM GMT
టీడీపీ, క‌మ్యూనిస్టులు క‌లిసిపోతున్నార‌ట‌
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ కు వ్య‌తిరేకంగా ప్ర‌తిప‌క్షాలు ఐక్యం అవుతున్నాయి. చిత్రంగా పొరుగు రాష్ట్రంలో అధికార‌- విప‌క్షాలుగా ఉన్న క‌మ్యూనిస్టులు - తెలుగుదేశం తెలంగాణ స‌ర్కారుపై పోరాటం చేసే క్ర‌మంలో ఏకం అవుతున్నాయి. 31వ తేదిన మహబూబ్ న‌గర్లో జరిగే సీపీఎం రాష్ట్ర కార్య‌ద‌ర్శి తమ్మినేని వీరభద్రం పాదయాత్రలో తెలుగుదేశం పార్టీ పాల్గొని సంఘీభావం తెలియజేయ‌నుంది. తాజాగా జ‌రిగిన తెలంగాణ టీడీపీ స‌మావేశంలో ఈ మేర‌కు నిర్ణ‌యించారు.

పార్టీ స‌మావేశ‌ నిర్ణ‌యాల‌ను టీడీపీ మాజీ ఎమ్మెల్సీ న‌ర్సారెడ్డి మీడియాకు వివ‌రించారు. తెలంగాణలో తెరాస సర్కారుకు రెండున్నరేళ్లు పూర్తయినప్పటికీ ఎన్నికల హామీల అమలులో జరుగుతున్న ఘోర వైఫల్యాన్ని తెలుగుదేశం తొలి నుంచి ఎండగడుతోంద‌ని తెలిపారు. రుణమాఫీలో ప్రభుత్వానికి స్పష్టత కొరవడడం - రుణమాఫీ అమలుపై దుప్రభావాలను ముందుగానే తెలుగుదేశం పసిగట్టి హెచ్చరించినప్పటికీ పెడచెవినపెట్టిన ఘనత కేసీఆర్ స‌ర్కార్‌ద‌ని ఎద్దేవా చేశారు. 50 వేల లోపు రుణాల మాఫీకి అర్హులుగా 35 లక్షల మంది రైతులు ఉంటే 50 వేల కోట్లతో వారికి ఏక మొత్తంలో రుణమాఫీ జరుగుతుందని ఆశించాం. కానీ ఆ మాత్రం కూడా లేకుండా కేవలం 17,500 కోట్లు మాత్రమే విడతలవారీగా రుణమాఫీకి కేటాయించి రైతులను వంచించారని మండిప‌డ్డారు. విద్యార్ధులలో చైతన్యమే లక్ష్యంగా ఆనాటి సీఎం చంద్రబాబు నాయుడు హైదరాబాద్ చుట్టుపక్కల పెద్దఎత్తున విద్యాసంస్థలను ఏర్పాటు చేస్తే నేటి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కాకుండా రాజుగా భావించుకుంటున్న కేసీఆర్ తమ కుటుంబం తప్ప ఇంకెవరూ బాగుపడకూడదని విధానాలతో పాలన సాగిస్తున్నారని న‌ర్సారెడ్డి మండిప‌డ్డారు. అవసరం లేనిచోట్ల లక్షల కోట్ల ఖర్చు చేస్తున్న ఈ కేసీఆర్ సర్కార్ ఫీజు రీయింబర్స్ మెంట్ కు మాత్రం కనీసం రెండు మూడు వేల కోట్లు కూడా ఇవ్వడం లేదు. విద్యార్థులను ఈ విధంగా అణచివేస్తే ఇక ప్రశ్నించేవారుండరనే దురుద్దేశ్యంతోనే ఈ వైఖరిని ఎంచుకున్నారని న‌ర్సారెడ్డి విమ‌ర్శించారు.

జిల్లాల పునర్విభజనతోసహా ఏ ప్రక్రియను చూసినా ప్రశ్నించే గొంతులను అణచివేసే నియంతృత్వ విధానాలే కేసీఆర్ సర్కార్‌లో కన్పిస్తున్నాయని దుయ్య‌బ‌ట్టారు. 350 కోట్లతో సచివాలయం కొట్టి కట్టాలని చేస్తున్న ప్రయత్నం ఫీజు రీయింబర్స్ మెంట్‌ని లక్షలాది మంది విద్యార్థులలో అసంతృప్తి రేకెత్తిస్తోందని తెలిపారు. ఉద్యోగాల కోసం ఒక్క నోటిఫికేషన్ కూడా లేకపోగా కనీసం హోంగార్డుల రెగ్యులరైజేషన్‌ కూడా తెరాస పాలకులకు మనసురావడం లేదు. ఇలా వివిధ స‌మ‌స్య‌లు నెల‌కొన్న స‌మ‌స్య‌ల‌పై ఆందోళ‌న చేస్తున్న సీపీఎం యాత్ర‌కు సంఘీభావంగా తాము క‌ల‌వ‌నున్న‌ట్లు న‌ర్సారెడ్డి వివ‌రించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/