Begin typing your search above and press return to search.

టీటీడీపీ నేత‌ల‌కు ప్ర‌మోష‌న్లు

By:  Tupaki Desk   |   11 Feb 2016 10:30 PM GMT
టీటీడీపీ నేత‌ల‌కు ప్ర‌మోష‌న్లు
X
తెలంగాణ‌లో వ‌రుస‌గా ఎమ్మెల్యేలు - సీనియ‌ర్ నేత‌లు గుడ్‌ బై చెప్తున్న నేప‌థ్యంలో పార్టీ బలోపేతంపై తెలుగుదేశం అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించింది. పార్టీ బ‌లోపేతంతో పాటు ఎమ్మెల్యేలు - సీనియ‌ర్ నేత‌ల‌ను త‌గిన స్థాయిలో గుర్తించేందుకు రాష్ట్ర, జాతీయ నామినేటెడ్ ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టాల‌ని నిర్ణ‌యించింది. ఈ క్ర‌మంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలుగుదేశం అధినేత‌ - ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించారు.

పార్టీకి రాజీనామాచేసి టీఆర్ ఎస్‌ లో చేరిన శాసనసభ పక్ష నేత ఎర్రబెల్లి దయాకరరావు - రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ప్రకాశ్‌ గౌడ్‌ - కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే వివేకానంద వ్యవహానాల‌పే ప్ర‌ముఖంగా చ‌ర్చించారు. దీంతో పాటు కొద్దికాలం క్రితం పార్టీ వీడిన కంటోన్ మెంట్ ఎమ్మెల్యే సాయ‌న్న అంశం కూడా కూడా ఈ సంద‌ర్భంగా ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చింది. ఈ నేత‌లు టీడీపికి గుడ్‌ బై చెప్ప‌డం వ‌ల్ల ఏర్ప‌డిన ఖాళీల‌ను భ‌ర్తీ చేసేందుకు వేగంగా క‌స‌ర‌త్తు చేయాల‌ని నిర్ణ‌యించారు. పార్టీ ఫ్లోర్‌ లీడ‌ర్‌ గా రేవంత్ రెడ్డి, ఖ‌మ్మం జిల్లా స‌త్తుప‌ల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట‌ వీరయ్య, మ‌హ‌బూబ్‌ న‌గ‌ర్ జిల్లా నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌ రెడ్డి పేర్లు ప్ర‌తిపాద‌న‌లోకి వ‌చ్చాయి. ఇప్పటికే రేవంత్‌ రెడ్డి తెలంగాణ రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షునిగా ఉన్నందున ఫ్లోర్‌ లీడ‌ర్ కోసం ఇత‌ర ఎమ్మెల్యేల పేర్ల‌ను పరిశీలించారు. అయితే శాసనసభపక్షనేతగా స‌మ‌ర్థుడైన వ్యక్తి ఉండాల‌ని భావించి రేవంత్ రెడ్డిని ఎంపికచేశారు. ఈ మేర‌కు స్పీక‌ర్‌ కు లేఖ రాశారు.

రాజేంద్ర‌న‌గ‌ర్ ఎమ్మెల్యే ప్ర‌కాశ్‌ గౌడ్ రాజీనామాతో ఖాళీ అయిన రంగారెడ్డి జిల్లా అధ్యక్ష పదవిని కూడా భ‌ర్తీ చేయాల‌ని లోకేష్ ప్ర‌తిపాదించారు. ఈ ప‌ద‌వికి యువకుడైన నేత స‌మ‌ర్థంగా ప‌నిచేయ‌గ‌ల‌ర‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే సాయన్న తెరాస తీర్ధం పుచ్చుకోవడంతో ఖాళీ అయిన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబ‌ర్ ఖాళీని తెలంగాణ ప్రాంతానికి చెందిన మరో ఎమ్మెల్యే లేదా సీనియర్‌ నేతను ఎంపిక చేయాలని ప్రతిపాదించారు. రాజ్యసభ సభ్యుడు దేవేందర్‌గౌడ్‌ తనయుడు వీరేందర్‌ను ఈ పదవిలో నియమిస్తే బాగుంటుందని, యువతకు అవకాశమిచ్చినట్లవుతుందని లోకేష్‌ అభిప్రాయపడ్డట్టు సమాచారం.

వీట‌న్నింటితో పాటు పార్టీ కమిటీలను నియమించి 2019 ఎన్నికలకు పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలని అగ్ర‌నేత‌లు నిర్ణ‌యించారు. తెలంగాణలో గ్రామ కమిటీల మొదలు మండల, రెవిన్యూ డివిజన్‌, జిల్లా స్థాయి కమిటీల ఎంపికపై కసరత్తు ప్రారంభించాలని, అసెంబ్లీ నియోజకవర్గాలకు వెనువెంటనే బాధ్యులను ఎంపికచేసి పార్టీ బలోపేతంపై దృష్టి సారించాలని నిర్ణయించారు. వచ్చే ఏడాదంతా తెలంగాణలో పార్టీకి పూర్వవైభవం తెచ్చేలా చర్యలు తీసుకోవాలని గతంలో జిల్లా స్థాయిలో నిర్వహించిన బహిరంగసభలను కొనసాగించాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్లు తెలిసింది.