Begin typing your search above and press return to search.

దేవుడి సాక్షిగా కారెక్కుతాం.....

By:  Tupaki Desk   |   25 Sep 2018 4:02 PM GMT
దేవుడి సాక్షిగా కారెక్కుతాం.....
X
దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పుతాం మేమంతా మీ వెనుకే.
జీసస్ మీద ఒట్టు.......మా మద్దతు మీకే. అల్లా మీద ఆన మేం హమ్

ఆప్ కే సాత్ హే.....ఇదంతా కోర్టులోనో - పోలిసు స్టేషన్లలోనో ప్రమాణాలు కావు. అలాగే వ్యక్తిగతంగానో కుటుంబ పరంగానో వేస్తున్న ఒట్లు కావు....సాక్షాత్తు అధికార తెలంగాణ రాష్ట్ర సమితికి ఓటర్లు వేస్తున్న - చేస్తున్న ప్రమాణాలు. ముందస్తు ప్రకటనకు ముందు - శాసనసభను రద్దు చేయడానికి ముందు ఉన్న పరిస్థితి తెలంగాణలో ఇప్పుడు లేదు. అధికార తెలంగాణ రా‌ష్ట్ర సమితీ నాయకులలో విజయం దక్కదనే గుబులు ప్రారంభమయ్యిందట. తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కుటుంబంలో వచ్చిన...వస్తున్న వివాదాల కారణంగా కూడా అభ్యర్ధుల్లో నిరాశ నానాటికీ పెరుగుతోందని అంటున్నారు. దీంతో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రకటించిన 105 మంది అభ్యర్ధుల్లో సగానికి సగం మందికి విజయంపై అనుమానాలు వస్తున్నాయంటున్నారు. దీంతో వారంతా దేవుడా...నీవే దిక్కు అంటూ దేవుడ్ని వేడుకుంటున్నట్లు పార్టీలో జోరుగా ప్రచారం జోరుగా సాగుతోంది. నిజానికి పార్టీ నిర్వహించిన ప్రగతి నివేదన సభలోనే తాము ఇబ్బందుల్లో ఉన్నామనే విషయాన్ని పార్టీ సీనియర్లు గుర్తించారని చెబుతున్నారు. అధినేత కె.చంద్రశేఖర రావు ప్రగతి నివేదన సభలో ప్రసంగించిన తీరు... ఆ తర్వాత పార్టీలో జరుగుతున్న ప్రచారం కూడా అభ్యర్ధుల విజయంపై నీలి నీడలతు కమ్ముకునేలా చేస్తున్నాయంటున్నారు.

దీంతో ఈ గెలవాలంటే ఓటర్లే దిక్కు అనుకుంటున్న తెలంగాణ రాష్ట్ర అభ్యర్ధులు తమ నియోజకవర్గాల్లో ఓటర్లను ఆయా మతాలకు చెందిన గుళ్లు - మందిరాలు - ప్రార్ధనా స్థలాలకు తీసుకువెళ్లి వారి చేత తమకే ఓటు వేస్తామని ప్రమాణం చేయించుకుంటున్నారని తెలంగాణ భవన్‌ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు కె.చంద్రశేఖర రావు వారసుడిగా ఆయన తనయుడు తారక రామారావు వస్తున్నారనే ప్రచారం కూడా కొందరు నాయకులకు గిట్టడం లేదంటున్నారు. ఆయన వ్యవహార శైలిపై జిల్లాల్లో కొందరు పెదవి విరుస్తున్నారని చెబుతున్నారు. ఇవన్నీ ద్రష్టిలో ఉంచుకున్న అభ్యర్ధులు ఓటర్లను వారి సమీప గణేష్ మండపాలకు - మసీదులకు - చర్చిలకు తీసుకువెళ్లి దేవుళ్ల మీద ప్రమాణాలు చేయించుకుంటున్నారని అంటున్నారు. మత్స్యకార కులానికి చెందిన ఓ ఉపాధ్యాయుడు టీఆర్ ఎస్ అభ్యర్ధి జీవన్ రెడ్డికే ఓటు వేస్తామంటూ ప్రమాణం చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇక ఓ మంత్రి కొందరు ముస్లీములను తన నియోజకవర్గంలోని ఓ మసీదుకు తీసుకువెళ్లి ప్రమాణం చేయించుకున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితి ముందస్తుకు ముందు ఉన్న పరిస్థితి ఇప్పుడు లేదని, ఆ పార్టీ నాయకులు చెబుతున్నట్లుగా వారి గెలుపు నల్లేరు మీద నడక కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.