Begin typing your search above and press return to search.

కేసీఆర్ దూకుడు.. ఆ నలుగురు ఔట్

By:  Tupaki Desk   |   13 Dec 2018 6:56 AM GMT
కేసీఆర్ దూకుడు.. ఆ నలుగురు ఔట్
X
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ బంపర్ మెజార్టీతో తిరిగి అధికారంలో వచ్చింది. దీంతో కేసీఆర్ కూడా తన నిర్ణయాల్లో దూకుడు పెంచుతున్నారు. తెలంగాణ ఎన్నికల సమయంలో తనకు హ్యాండిచ్చి కాంగ్రెస్ లో చేరిన వారిపై వేటు వేసే పనిలో కేసీఆర్ ఉన్నారు. ఈ మేరకు శాసన మండలి చైర్మన్ కు ఫిర్యాదు చేశారు.

టీఆర్ ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పార్టీ పదవులు పొంది తీరా ఎన్నికలు వచ్చే సమయంలో పార్టీ జంప్ చేసిన నేతలపై కేసీఆర్ గుస్సాగా ఉన్నారు. ఎమ్మెల్సీ భూపతిరెడ్డి - యాదవరెడ్డి - రాములు నాయక్ లపై వేటు వేయడం లాంఛనమే.

ఎమ్మెల్సీ భూపతిరెడ్డి ఉద్యమకాలం నుంచి టీఆర్ ఎస్ లో ఉన్నారు. అయితే 2014లో వైసీపీ నుంచి టీఆర్ ఎస్ లో చేరిన బాజిరెడ్డి గోవర్ధన్ కోసం సీటు త్యాగం చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత బాజిరెడ్డి ఆధిపత్యాన్ని తట్టుకోలేక డీఎస్ తో సన్నిహితంగా ఉండటంతో మెల్లగా పార్టీకి దూరం చేశారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ లో చేరి నిజామాబాద్ రూరల్ నుంచి పోటీ చేసినా చివరకు బాజిరెడ్డి చేతిలోనే ఓటమి చెందారు. అలాగే ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి సన్నిహితుడు యాదవరెడ్డి మేడ్చల్లో సోనియా సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఇక రాములు నాయక్ నారాయణఖేడ్ టికెట్ ఆశించారు. టికెట్ రాకపోవడంతో కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేసి కాంగ్రెస్ లో చేరారు. వీరి ముగ్గురిపై ఇప్పుడు వేటు వేయబోతున్నారు.

ఎన్నికలకు కొద్దిరోజుల మందు టీఆర్ ఎస్ పార్టీ టికెట్ల కేటాయింపులు - కేసీఆర్ - కేటీఆర్ వైఖరి నచ్చక పార్టీ మారిన చేవెళ్ల టీఆర్ ఎస్ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డికి ఈ ఫలితాలు పీడకలను మిగిల్చాయి. టీఆర్ ఎస్ చిత్తుగా ఓడుతుందని పొరబడి కాంగ్రెస్ లో చేరిన చేవెళ్ల ఎంపీ ఇప్పుడు నిండా మునిగాడు. టీఆర్ ఎస్ ఘనవిజయం సాధించింది. ఈ నేపథ్యంలోనే అటూ ఇటూ కాకుండా పోయాడు. ఇప్పుడు కేసీఆర్ గద్దెనెక్కాక ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డిపై అనర్హత వేటుకు లోక్ సభ స్పీకర్ ను పార్టీ ఎంపీలు కోరే అవకాశం ఉంది. ఇలా ఎంపీ పదవి కోల్పోవడంతోపాటు వచ్చే ఎన్నికల్లో టీఆర్ ఎస్ ప్రభంజనంలో ఆయన ఓడిపోయే అవకాశాలు కూడా ఉంటాయి.

కాగా తెలంగాణ శాసన సభ మండలిలో మరో ఇద్దరు ఎమ్మెల్సీలు కూడా రాజీనామా చేయనున్నారు. కొడంగల్ నుంచి గెలిచిన పట్నం నరేందర్ రెడ్డి - మల్కాజిగిరి నుంచి గెలిచిన మైనంపల్లి హనుమంతరావులు తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయనున్నారు. అంటే మొత్తంగా శాసన మండలిలో ఐదు ఖాళీలు ఏర్పడతాయి. వీటీలో ఎన్నికల్లో ఓడిన సీనియర్లకు అవకాశం కల్పించాలని భావిస్తున్నారు. వీరిలో తుమ్మల నాగేశ్వర్ రావు - జూపల్లి కృష్ణారావు - మహేందర్ రెడ్డి - మధుసూదనాచారి లాంటి వాళ్లకు అవకాశం ఇవ్వనున్నారనే చర్చ జరుగుతోంది.