Begin typing your search above and press return to search.

కేసీఆర్ గుత్తాధిపత్యానికి గొడ్డలిపెట్టు!

By:  Tupaki Desk   |   12 Jan 2018 5:30 PM GMT
కేసీఆర్ గుత్తాధిపత్యానికి గొడ్డలిపెట్టు!
X
కేసీఆర్ అంటే.. తెరాస పార్టీకి తిరుగులేని అధినేత. ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సరే.. దానికి ఎదురు మాటాడ్డానికి ఎవ్వరికీ ధైర్యం చాలదు. ఆయన పదవి ఇస్తే తీసుకోవడమూ.. ఇవ్వకుంటే మిన్నకుండిపోవడమే తప్ప.. ధిక్కరించగల సాహసం ఆ పార్టీలో ఎవ్వరికీ లేదు. ఎందుకంటే.. తెరాస పార్టీ మనుగడ అనేదే.. కేవలం కేసీఆర్ కు ప్రజల్లో ఉన్న ఇమేజి మీదనే ఆధారపడి నడుస్తున్నదనే అభిప్రాయంలో వారంతా ఉన్నారు. అలా అనడం కంటె.. అలాంటి ప్రచారం తొలినుంచి ఎక్కువగా జరుగుతూ వచ్చింది. కేసీఆర్ కు నాయకుడి గా ఉన్న వ్యక్తిగత ఇమేజి పార్టీకి రక్షణ కవచం అనే ప్రచారం విస్తృతంగా జరిగిన కారణంగా.. ఆయనను ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా అందరూ నెత్తిన పెట్టుకున్నారు.

అయితే ఈ పరిస్థితుల్లో మార్పు వస్తున్నదా? ఎన్నికల సంవత్సరంలో పార్టీ ఇమేజిని మరింతగా ప్రజల్లో పెంచాలని అధినేత తపన పడేవేళ ఆయన పట్ల వినిపిస్తున్న ధిక్కార స్వరాలు వింటే అలాగే అనిపిస్తుంది. సూటిగా కేసీఆర్ నాయకత్వం మీద కాకపోయినప్పటికీ.. తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని వారికి అప్పట్లో పోరాటంలో లేని వారికి కేబినెట్ లో కీలక మంత్రి పదవులు కట్టబెట్టడం ద్వారా తెలంగాణకు ద్రోహం జరిగింది అనే వ్యాఖ్యలు నాయని నర్సింహారెడ్డి వంటి సీనియర్ నుంచి వినిపించడం చిన్న సంగతి కాదు. పైగా ఆయన గళానికి పార్టీలో మద్దతు పెరుగుతోంది. అంటే కేసీఆర్ పట్ల ధిక్కార స్వరాలు ఏకీకృతం అవుతున్నాయన్నమాట. ఈ పోకడలు అన్నిటినీ స్థూలంగా గమనించినప్పుడు.. ఇదంతా కూడా కేసీఆర్ గుత్తాధిపత్యానికి గొడ్డలిపెట్టు అనే అభిప్రాయం విశ్లేషకుల్లో కనిపిస్తోంది.

తెలంగాణ ఉద్యమ సమయంలో పోరాటంలో కీలకంగా ఉండకపోగా.. ఆతర్వాత కేవలం ఫిరాయింపుల రూపేణా తెలుగుదేశంలోకి వచ్చి అగ్రపూజలు అందుకుంటున్న నాయకులు పలువురు ఉన్నారు. తలసాని శ్రీనివాస యాదవ్ - తుమ్మల నాగేశ్వరరావు - కడియం శ్రీహరి ఇంకా మహేందర్ రెడ్డి వంటి వారున్నారు. వారంతా ప్రభుత్వంలో కీలకంగానే ఉన్నారు. వీరి మీద కన్ను కుట్టిందో - లేదా కేసీఆర్ వైఖరి మీదే కినుక పుట్టిందో తెలియదు గానీ.. సీనియర్ నాయకుడు నాయని నర్సింహారెడ్డి.. అలాంటి వాళ్లకు కేబినెట్ లో చోటా? అంటూ పెద్ద విమర్శే చేసేశారు. దానికి మద్దతుగా ఉద్యోగ సంఘాల నుంచి ఎమ్మెల్యే అయిన శ్రీనివాస గౌడ్ ఇవాళ పెదవి విప్పారు. గళం కలిపారు. అలాంటి ఫిరాయింపు మంత్రుల్ని చూస్తోంటే.. కళ్లమ్మట నీళ్లువస్తున్నాయని ఆయన కాస్త ఎమోషన్ జోడించారు. అప్పట్లో అనేక త్యాగాలు చేసిన ఉద్యోగులు అంతా ఇలాంటి నిర్ణయాలు చూసి బాధపడుతున్నారంటూ.. ఉద్యోగుల ఓటు బ్యాంక్ పరంగా కేసీఆర్ కు ఒక హెచ్చరిక కూడా చేశారు. మరి ఈ పరిణామాలు పార్టీలో ఎలాంటి పర్యవసానాలకు దారితీస్తాయో వేచిచూడాలి.