Begin typing your search above and press return to search.

క్రైంకు కేరాఫ్ అడ్ర‌స్ గా గులాబీ దండు?

By:  Tupaki Desk   |   20 Nov 2017 1:30 AM GMT
క్రైంకు కేరాఫ్ అడ్ర‌స్ గా గులాబీ దండు?
X
మంది ఎక్కువైతే మ‌జ్జిగ ప‌లుచ‌న అవుతుందంటారు. ఇప్పుడు తెలంగాణ అధికార‌పక్షంలో ఇలాంటి ప‌రిస్థితే క‌నిపిస్తోంది. సుదీర్ఘ‌కాలంగా ఉద్య‌మ రాజ‌కీయాల్ని చేసిన పార్టీలో క‌నిపించ‌ని కొత్త కొత్త వికారాలు.. తెలంగాణ అధికార ప‌క్షంగా మారిన నాటి నుంచి రోజురోజుకీ పెరుగుతుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

ఇటీవ‌ల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప‌లువురు టీఆర్ ఎస్ నాయ‌కుల‌పై వివిధ నేరారోప‌ణ‌ల‌పై కేసులు న‌మోదు అవుతున్నాయి.

క్రైం రేట్ లో టీఆర్ ఎస్ నేత‌ల పేర్లు ఎక్కువ‌గా వినిపిస్తోంద‌న్న విమ‌ర్శలు ఎక్కువ అవుతున్నాయి. హైద‌రాబాద్ న‌గ‌రంలోనే చూస్తే.. కార్పొరేట‌ర్ల భ‌ర్త‌లు.. కొడుకులు.. కార్పొరేట్ల దందాతో పాటు.. ప‌లు వివాదాల‌కు సంబంధించి టీఆర్ఎస్ నేత‌ల పేర్లు త‌ర‌చూ వినిపిస్తున్నాయి.

ఇలాంటి ట్రెండ్ ఏ మాత్రం మంచిది కాద‌ని చెబుతున్నారు. ప‌లు వివాదాల‌కు సంబంధించి టీఆర్ఎస్ నేత‌ల (బ‌డా నేత‌లు కాదు చోటా నేత‌లు) పేర్లు వినిపిస్తున్నాయి. ఉద్య‌మ కాలంలో లేని ఈ చిక్కుల‌న్నీ ఇప్పుడే ఎందుకుంటే అధికారంలోకి రావ‌ట‌మే. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత‌.. తెలంగాణ రాష్ట్రంలో తాము తిరుగులేని రాజ‌కీయ శ‌క్తిగా మారాల‌న్న భావ‌న తెలంగాణ అధికార‌ప‌క్షంలో వ్య‌క్త‌మైంది. ఇందులో భాగంగా టీఆర్ ఎస్ అధినాయ‌క‌త్వం వివిద రాజ‌కీయ పార్టీల‌కు చెందిన నేత‌ల్ని త‌మ పార్టీలోకి ఆహ్వానించ‌టం తెలిసిందే.

ఈ క్ర‌మంలో త‌మ‌తో పాటు.. త‌మ కార్య‌క‌ర్త‌ల్ని పార్టీలో చేర్చేస్తున్నారు. నియంత్ర‌ణ లేక‌పోవ‌టంతో అంద‌రూ గులాబీ దండులోకి వెళ్లిపోయారు.

దీంతో బాధ్మ‌త‌గా వ్య‌వ‌హ‌రించాల్సింది పోయి చిల్ల‌ర‌రాజ‌కీయాల‌కు తెర తీస్తున్నారు. అదేమంటే.. తాము ప‌వ‌ర్లో ఉన్నామ‌ని..ఎవ‌రేం అడిగినా సాయం చేయాల‌న్న‌ట్లుగా అధినాయ‌క‌త్వంలో ఉండే యువ నేత‌ల అభ‌య‌హ‌స్తం సైతం పార్టీకి ఇబ్బందిక‌రంగా మారుతోంద‌ని చెప్పాలి.

ఏం చేసినా.. కాపాడే వాళ్లు ఎవ‌రో ఒక‌ళ్లు ఉంటార‌న్న భ‌రోసా స‌గ‌టు కార్య‌క‌ర్త‌లు ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. తాజాగా మేడ్చ‌ల్ జిల్లాలో టీఆర్ ఎస్ యువజ‌న నేత ఒక‌రు భార్యను దారుణంగా కొట్టి బ‌య‌ట‌కు పంపిన ఘ‌ట‌న ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నాలుగేళ్ల క్రితం పెళ్లి చేసుకొని.. పాత భార్య‌ను వ‌దిలేసిన వైనంపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తున్నాయి. మేడ్చ‌ల్ జిల్లా బోడుప్ప‌ల్లో చోట చేసుకున్న ఈ ఉదంతంలోకి వెళితే.. నాలుగేళ్ల పాటు కాపురం చేసిన భార్య‌ను వ‌దిలేసి.. మ‌రో యువ‌తిని పెళ్లి చేసుకున్నాడు టీఆర్ఎస్ యువ‌జ‌న విభాగానికి చెందిన నేత‌.

జ‌రిగిన అన్యాయాన్ని నిల‌దీయ‌టానికి బాధితురాలు రాగా.. ఆమెపై చేయి చేసుకున్న‌ట్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ త‌ర‌హాలో ఈ మ‌ధ్య‌న ప‌వ‌ర్ చూపించి నేరాల‌కు పాల్ప‌డుతున్న వైనంపై టీఆర్ ఎస్ అగ్ర‌నాయ‌క‌త్వం అలెర్ట్ కావాల్సిన అవ‌స‌రం ఉంది. చేతిలోని అధికారాన్ని బూచిగా చూపిస్తూ ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రించే వారి తోక‌లు క‌ట్ చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్న‌ది మ‌ర్చిపోకూడ‌దు.