Begin typing your search above and press return to search.

కాల్ డేటా ఇవ్వొద్దని హైకోర్టుకు టీ హోంశాఖ

By:  Tupaki Desk   |   29 July 2015 4:13 AM GMT
కాల్ డేటా ఇవ్వొద్దని హైకోర్టుకు టీ హోంశాఖ
X
ఏపీ ముఖ్యమంత్రితోపాటు.. పలువురు ప్రముఖులకు చెందిన ఫోన్లను ట్యాప్ చేసిన ఆరోపణలు నమోదైన కేసుకు సంబంధించి తాజాగా మరో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ వివాదానికి సంబంధించిన కాల్ డేటాను విజయవాడ కోర్టుకు టెలికం ఆపరేటర్లు ఇవ్వాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో కాల్ డేటా ఇవ్వటానికి సుప్రీం విధించిన గడువును మరింత పొడిగించాలంటూ టెలికం ఆపరేటర్లు కోర్టును అభ్యర్థిస్తుంటే.. మరోవైపు తెలంగాణ రాష్ట్ర హోంశాఖ రంగ ప్రవేశం చేసింది. ట్యాపింగ్ చేసిన ఫోన్ డేటాను విజయవాడ కోర్టుకు ఇవ్వాలంటూ తన పరిదిని దాటి వ్యవహరించిందని.. సుప్రీంకోర్టు ఆదేశాల్ని నిలిపివేయాలంటూ.. తెలంగాణ సర్కారు తరఫున హోంశాఖ ముఖ్యకార్యదర్శి అజయ్ మిశ్రా మంగళవారం హైకోర్టులో ఒక పిటీషన్ దాఖలు చేశారు.

తాజా పిటీషన్ లో కేంద్ర హోంశాఖ కార్యదర్శి.. కేంద్ర సమాచార.. ఐటీ.. టెలికమ్యూనికేషన్ శాఖ కార్యదర్శి.. కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ డీఎస్పీ.. టెలికం ఆపరేటర్లు (బీఎస్ ఎన్ ఎల్.. భారతి ఎయిర్ టెల్.. ఐడియా.. రిలయన్స్) ప్రతివాదులుగా చేర్చారు. 25 నెంబర్లకు చెందిన కాల్ డేటాను కోర్టు పరిశీలనకు ఇవ్వాలని కోరటం న్యాయ సమ్మతం కాదని.. విజయవాడ కోర్టు తన పరిధి దాటిందని.. ఇలాంటి ఆదేశాలు చేయటం సరికాదని.. చట్టాన్ని ఉల్లంఘించిందని పేర్కొంటూ పిటీషన్ దాఖలు చేశారు.

ట్యాపింగ్ వ్యవహారంపై ఇంతకాలం మౌనంగా ఉన్న తెలంగాణ సర్కారు.. తాజాగా హైకోర్టులో పిటీషన్ దాఖలు చేయటంతో ఈ వ్యవహారం కొత్త మలుపు తిరిగినట్లుగా చెబుతున్నారు. ఇప్పటివరకూ తమ సర్కారు ఎవరి ఫోన్లు ట్యాప్ చేయలేదని చెప్పిన దానికి భిన్నంగా.. కాల్ డేటా ఇవ్వాల్సిన అవసరం లేదంటూ వాదించటం ఆసక్తికరగా మారింది. తమ రాష్ట్ర ప్రయోజనాల కోసం తామీ పిటీషన్ దాఖలు చేసినట్లు పేర్కొన్నారు.

మరోవైపు.. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాలతోతాము ఫోన్లను ట్యాప్ చేసినట్లుగా టెలికం ఆపరేటర్లు సుప్రీంకు పేర్కొనటం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సీన్లోకి వచ్చి.. హైకోర్టులో పిటీషన్ దాఖలు చేయటం జరిగింది. తాజా పిటీషన్ పై హైకోర్టు ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.