Begin typing your search above and press return to search.

మెదక్‌ పెద్దోళ్లంతా అక్కడ ఫోకస్‌ పెట్టారు!!

By:  Tupaki Desk   |   3 Oct 2015 10:30 PM GMT
మెదక్‌ పెద్దోళ్లంతా అక్కడ ఫోకస్‌ పెట్టారు!!
X
చిన్నపామునైనా పెద్ద కర్రతో కొట్టాలనే సామెతను తెలంగాణలో అధికార కాంగ్రెెసు పార్టీ ఆచరణలో చూపిస్తున్నట్లుగా కనిపిస్తోంది. తమ పార్టీని మరింతగా బలోపేతం చేసుకోవడానికి ఏ చిన్న అవకాశం దొరికినా సరే.. దానిని వదిలిపెట్టకుండా తెలంగాణ రాష్ట్ర సమితి వాడుకుంటున్న సంగతి అందరికీ తెలుసు. ఇతర పార్టీల టికెట్ల మీద గెల్చిన వారిని కూడా తమలో కలిపేసుకుని, తమ పాలన పట్ల వారికి మక్కువ పుట్టిందంటూ భాష్యం చెప్పగలిగిన వారు... ఒక్క ఎమ్మెల్యే స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంటే ఎందుకు వదులుకుంటారు? అందుకే .. మెదక్‌ జిల్లా నారాయణఖేడ్‌ ఎమ్మెల్యే స్థానానికి ఉప ఎన్నిక జరగబోతుండగా.. తెరాస పార్టీలో ఆ జిల్లా మీద ప్రభావం చూపగల పెద్దలందరూ అక్కడ తీవ్రంగా తమ ఫోకస్‌ పెడుతున్నారు.

మామూలుగా అయితే.. ఇప్పటికీ కూడా తమకు అధికారం కట్టబెట్టిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు హవా, ఇమేజి కొనసాగుతూనే ఉన్నది గనుక.. ఎన్నిక గురించి పెద్దగా టెన్షన్‌ పడాల్సిన అవసరం వారికి లేదు. అందుకే వరంగల్‌ ఎంపీ స్థానానికి కూడా ఉప ఎన్నిక జరుగుతున్నప్పటికీ దాని మీద వారికింకా పెద్ద శ్రద్ధ పుట్టలేదు. అక్కడ అభ్యర్థి ఎంపిక గురించి కేసీఆర్‌ ఇప్పటిదాకా ప్రాథమిక కసరత్తు కూడా చేపట్టినట్టు లేదు. కానీ నారాయణఖేడ్‌ కు అప్పుడే.. పార్టీ ఇన్చార్జి ఎం.భూపాల్‌ రెడ్డి ని అభ్యర్థిగా కూడా ఎంపిక చేసేశారు.

అదే నారాయణఖేడ్‌ విషయానికి వచ్చేసరికి ఇక్కడ కాంగ్రెసుకు చెందిన పి.కిష్టారెడ్డి మరణం వలన ఉప ఎన్నిక వస్తున్నది. సార్వత్రిక ఎన్నికల సమయంలో తమ పార్టీకి అంత బీభత్సమైన హవా ఉంటేనే ఈ సీట్లో కాంగ్రెస్‌ గెలిచిందంటే.. ఇప్పుడు వారికి సానుభూతి కూడా తోడవుతుంది గనుక.. తాము బాగా కష్టపడాలని తెరాస పెద్దలు ఫోకస్‌ పెంచుతున్నారు. ప్రధానంగా మెదక్‌జిల్లా మీద ప్రభావం చూపగల నాయకులు మంత్రి హరీష్‌ రావు, మంత్రి ఈటెల రాజేందర్‌ - ఉపసభాపతి పద్మా దేవందర్‌ రెడ్డి తదితరులు ఆ నియోజకవర్గం పరిధిలో అభివృద్ధి కార్యక్రమాల్లో ముమ్మరంగా పాల్గొంటున్నారు. సెగ్మెంటులోని ప్రతి మండలంలోనూ కార్యక్రమాల్లో పాల్గొంటూ అక్కడి స్థానిక నేతల్ని తమకు అనుకూలంగా సమీకరించుకుంటూ భిన్నమైన వ్యూహంతో మంత్రులు ముందుకు సాగుతున్నారు. మంత్రి కేటీఆర్‌ కూడా నారాయణఖేడ్‌ బరిలోకి త్వరలోనే దిగబోతున్నారు కూడా! గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ విజయానికి దోహదం చేసిన స్థానిక నాయకుల్ని, ఇప్పుడు తాము అధికార పార్టీ గనుక.. తమ వైపునకు తిప్పుకుంటే.. అక్కడ గెలుపు సునాయాసం అవుతుందనే వ్యూహంతో మెదక పెద్దలంతా అక్కడ దృష్టి కేంద్రీకరిస్తున్నారు.