Begin typing your search above and press return to search.

గ్రేటర్ టీడీపీ దుకాణ్ బంద్?

By:  Tupaki Desk   |   10 Feb 2016 11:30 AM GMT
గ్రేటర్ టీడీపీ దుకాణ్ బంద్?
X
గ్రేటర్ హైదరాబాద్ లో తెలుగుదేశం పార్టీ ఖాళీ అయిపోతోంది. జిహెచ్ ఎంసి పరిధిలోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం టిడిపి ఎంఎల్ ఏ వివేకానంద గౌడ్ మంగళవారం టీఆరెస్ లో చేరగా మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా టీఆరెస్ లో చేరుతారని ప్రచారం జరుగుతోంది. గడచిన ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో మిత్రపక్షాలైన టిడిపి-భాజపాకు చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఎమ్మెల్యేలు గెలిచారు. అయితే, అధికారం చేపట్టిన తరువాత టీఆరెస్ ఆకర్ష పథకానికి టిడిపి నుండి ఒక్కొక్క వికెట్టే పడిపోతోంది. గ్రేటర్ పరిధిలో టిడిపి తరపున 9 మంది శాసనసభ్యులు విజయం సాధించగా ప్రస్తుతం ఆ పార్టీలో ముగ్గురు మాత్రమే కొనసాగుతున్నారు. మిగిలిన వారందరూ టిఆర్ ఎస్‌ లోకి చేరిపోయారు. రేపో మాపో మిగిలిన ఇద్దరు కూడా చేరిపోతారంటూ ప్రచారం ఊపందుకుంది. గ్రేటర్‌ లో టిడిపి తరపున గెలిచిన వారిలో ఇప్పటికే తీగల కృష్ణారెడ్డి - తలసాని శ్రీనివాసయాదవ్ - శాయన్న - మాధవరం కృష్ణారావులు చేరగా తాజాగా వివేక్ చేరికతో టిడిపి ఇబ్బందులో పడ్డట్లే. ఇక మిగిలింది శేరిలింగంపల్లి - జూబ్లిహిల్స్ - రాజేంద్రనగర్ ఎమ్మెల్యేలు ఆరెకపూడి గాంధి - మాగంటి గోపీనాధ్ - ప్రకాశ్ గౌడ్ మాత్రమే. వీరిలో కూడా గాంధీ - ప్రకాశ్ గౌడ్‌ లు కూడా త్వరలోనే గులాబీ కండువాను కప్పుకోవటం ఖాయమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

కాగా, టిడిపి తరపున పోటీచేసి ఎల్‌ బినగర్ శాసనసభ్యునిగా ఆర్. కృష్ణయ్య గెలిచినప్పటికీ పార్టీతో సంబంధం లేకుండానే ఉద్యమాలు చేసుకుంటున్నారు. టీడీపీ కూడా ఆయన్ను లెక్కల్లోంచి తీసేసింది. తాజాగా గ్రేటర్ ఎన్నికల తర్వాత మొదలైన పరిణామాలను గమనిస్తే గ్రేటర్ పరిధిలో టిడిపికి గడ్డు పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రాజకీయవర్గాల్లో వినిపిస్తున్న అంచనాల ప్రకారం టీడీపీలో జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మాత్రమే కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయని.... మిగతావారంతా టీఆరెస్ లో చేరుతారని అంటున్నారు.

అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి కూడా గులాబీ పార్టీ ఒక పద్దతి ప్రకారం ప్రతిపక్ష టిడిపిని నిర్వీర్యం చేసే పని మొదలుపెట్టింది. గడచిన ఎన్నికల్లో టిడిపి తరపున ఖమ్మంలో పోటీ చేసి ఓటమిపాలైన తుమ్మల నాగేశ్వర్‌ రావును టిఆర్ ఎస్ లాక్కుంది. ఆ తర్వాత తలసాని తీగల - మాధవరం - శాయన్నలను ఆకర్షించింది. దాంతో గ్రేటర్‌ లో దశాబ్దాలుగా పార్టీనే అంటిపెట్టుకుని ఉన్న బలమైన నేతలు పార్టీని వీడినట్లైంది. రాష్ట్ర విభజన సమయంలో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు వ్యవహారశైలిని పలువురు నేతలు వ్యతిరేకించారు. తుమ్మల - తలసాని అయితే, రాష్ట్ర విభజనకు టిడిపి మద్దతు తెలపటాన్ని పూర్తిగా వ్యతిరేకించారు. అయినా, చంద్రబాబు విభజనకు అనుకూలంగా లేఖను ఇచ్చారు. దానికి తోడు విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో ఏపిలో టిడిపి అధికారంలోకి వచ్చింది. దాంతో తెలంగాణాలో పార్టీ నిర్వహణ బాధ్యతలను చంద్రబాబు తన కుమారుడు లోకేష్‌ కు అప్పగించారు. దాన్ని తలసాని - తీగల వంటి పలువురు తీవ్రంగా వ్యతిరేకించారు. అయినా చంద్రబాబు వారిని పట్టించుకోలేదు. దానికి తోడు టిఆర్ ఎస్ ఆకర్ష్ కూడా తోడవ్వటంతో వారంతా పార్టీని వీడారు. దాంతో పార్టీ గ్రేటర్ పరిధిలో పూర్తిగా ఢీలా పడిపోయింది. దానికితోడు ఓటుకునోటు వ్యవహారంలో స్వయంగా పార్టీ అధ్యక్షుడే ఇరకాటంలో పడడంతో పార్టీ నేతలు అయోమయంలో పడిపోయారు. ఓటుకునోటు దెబ్బకు చంద్రబాబు హఠాత్తుగా హైదరాబాద్ నుండి తన మకాంను విజయవాడకు మార్చేసారు. దాంతో పార్టీకి దిశా నిర్దేశం చేసే వారు కరువయ్యారు. ఉన్న వారిలో కలహాలు, ఒకరిపై మరొకరికి అపనమ్మకం, ఆధిపత్యం కోసం ఎత్తులుపై ఎత్తులు వేసుకుంటుంటే శ్రేణులకు మార్గదర్శనం చేసే వారే లేకుండా పో యారు. ఈ పరిస్థితిలో తెలంగాణలో.. ముఖ్యంగా హైదరాబాద్ లో పార్టీ భవిష్యత్తు అగమ్యగోచరంగా ఉందని టీడీపీ నేతలే అంటున్నారు.