Begin typing your search above and press return to search.

కేసీఆర్ నిర్ణ‌యంతో..ఎమ్మెల్యేల్లో వ‌ణుకు

By:  Tupaki Desk   |   20 Jun 2018 7:27 AM GMT
కేసీఆర్ నిర్ణ‌యంతో..ఎమ్మెల్యేల్లో వ‌ణుకు
X
తెలంగాణ రాష్ట్ర స‌మితి అధినేత‌ - ముఖ్య‌మంత్రి కేసీఆర్ తాజా నిర్ణ‌యం ఆ పార్టీ నేత‌ల్లో క‌ల‌క‌లానికి దారితీస్తోంది. గులాబీ ద‌ళ‌ప‌తి ఓ వైపు దూకుడుగా ముందుకు సాగుతుంటే మ‌రోవైపు ఆ నిర్ణ‌యం ఎక్క‌డ త‌మ పుట్టి ముంచుతుందోన‌ని ఆ పార్టీ ఎమ్మెల్యేల్లో ఆందోళ‌న మొద‌లైంది. ఇదంతా పంచాయ‌తీ ఎన్నిక‌ల గురించి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ - పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాత్రం గడువులోగానే ఎన్నికలు నిర్వహిస్తామని అంటుండ‌గా ఆ పార్టీ ఎమ్మెల్యేలు నిరాకరిస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఒక వైపు ఎన్నికల ఏర్పాట్లు చేస్తుండగా - మరోవైపు టీఆర్ ఎస్‌ శాసనసభ్యులు మాత్రం ససేమిరా వద్దంటుండ‌టంతో పంచాయతీరాజ్‌ సంస్థల ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వంలో డైలమా కొనసాగుతోంద‌ని అంటున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా పెరిగిన పంచాయతీలతో కలుపుకుని మొత్తం 12, 751 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నది. 31 జిల్లాలకుగాను 30 జిల్లాల్లో స్థానిక సంస్థలకు ఎన్నికలు చేపట్టాల్సి ఉంది. దాదాపు 80 శాతం పంచాయతీలను గెలిపించుకుకోలేకపోతే, సమస్యలు తప్పవనే భావనలో ఎమ్మెల్యేలు ఉన్నట్టు సమాచారం. ఎంపీపీ, జెడ్పీటీసీ ఎన్నికలు వచ్చే సంవత్సరం ప్రథమార్థంలో జరిగే అవకాశాలు ఉన్నాయి. గ్రామాల్లో సర్పంచ్‌ - వార్డు సభ్యుల ఎన్నికలు అత్యంత కీలకం. అసెంబ్లీ ఎన్నికల ముందు వీటిని తెరమీదకు తెస్తే లేని తలపోటు ఉంటుందనే వ్యాఖ్యానాలు ఎమ్మెల్యేల నుంచే వస్తున్నాయి. సర్పంచ్‌లుగా తమ పార్టీ అభ్యర్థులను బరిలోకి దింపి - వాళ్లను విజేతలుగా నిలపాలంటే ఎమ్మెల్యేలుగా తమ పాత్ర కీలకమని భావిస్తున్నారు. అలాగే ఈ ఎన్నికల సందర్భంగా అయ్యే ఖర్చును భరించడం, అభ్యర్థులను ఎంపిక చేయడం కత్తిమీద సాముకానున్నది. ఎంపికైన వారిని గెలిపించడం - అవకాశాలు రానివారిని బుజ్జగించడం అంత సులువుకాదని అంటున్న వారు లేకపోలేదు.

ఇదిలాఉండ‌గా...స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేయడంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కొంత చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల సామాగ్రి ముద్రణకు సన్నాహాలు చేస్తున్నారు. జిల్లాల్లో ఈ బాధ్యతలను కలెక్టర్లకు అప్పగించారు. అయితే ఎస్సీ - ఎస్టీ - బీసీ రిజర్వేషన్ల ఖరారుకు ఇంకా కొంత సమయం పట్టే అవకాశం ఉన్నదని సమాచారం. బీసీ ఓటర్ల గణన జరుగుతున్నది. త్వరలో పూర్తవుతుందని పంచాయతీరాజ్‌ - గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు రెండు రోజుల క్రితం ప్రకటించారు.పంచాయతీరాజ్‌ సంస్థల ఎన్నికల నిర్వహణకు సుతారమూ ఇష్టంలేని టీఆర్ ఎస్‌ ఎమ్మెల్యేలు - అందుకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. రిజర్వేషన్ల విషయమై కోర్టులో తమ అనుచరుల చేత కేసులు వేయించేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం ఎన్నికల నిర్వహణకు సీఎం కేసీఆర్‌ గ్రీన్‌సిగల్‌ ఇస్తే మాత్రం, కోర్టు తలుపు తట్టడం ఒక్కటే మార్గమని కొందరు భావిస్తున్నారు. లేకపోతే సాధారణ ఎన్నికల ముందు తలవంపులు తప్పవని ఆందోళన చెందుతున్నారు.