Begin typing your search above and press return to search.

ప్ర‌జా కూట‌మి కాదు...ప్ర‌జ‌లు లేని కూట‌మి

By:  Tupaki Desk   |   15 Nov 2018 5:39 AM GMT
ప్ర‌జా కూట‌మి కాదు...ప్ర‌జ‌లు లేని కూట‌మి
X
ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా త‌న పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గంలోని పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో గెలుపు బాధ్య‌త భుజాన వేసుకున్న టీఆర్ ఎస్ ఎంపీ క‌విత ఈ క్ర‌మంలో ఓ వైపు ప్ర‌చారం చేస్తూనే మ‌రోవైపు కీల‌క‌మైన రాజ‌కీయ అంశాల‌పై ఘాటుగా స్పందిస్తున్నారు. త‌న పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గంలో టీఆర్ ఎస్ ద్వారా ప‌ద‌వుల‌ను పొంది అనంత‌రం పార్టీ మారిన నేత‌ల‌ను తాజాగా ఆమె టార్గెట్ చేశారు. ఎంపీ కవిత నిజామాబాద్‌ లో మీడియాతో మాట్లాడుతూ..ఎమ్మెల్సీ భూపతిరెడ్డి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. టీఆర్‌ ఎస్ పార్టీ ద్వారా వచ్చిన పదవిని ఆయన వదులుకోవాలన్నారు. రాజ్య‌స‌భ స‌భ్యుడు డి. శ్రీనివాస్‌ పై పార్టీ నిర్ణయం తీసుకుంటుందని ఎంపీ కవిత తెలిపారు. ఈ ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌ల మ‌ద్ద‌తుతో టీఆర్ఎస్ గెలుపొంది తిరిగి అధికారం చేప‌ట్ట‌డం ఖాయ‌మ‌ని ఆమె వెల్ల‌డించారు.

విపక్షాలు ఏర్పాటు చేసింది ప్రజా కూటమి కాదు.. అది ప్రజలు లేని కూటమి అని ఎంపీ కవిత ఎద్దేవా చేశారు. చంద్రబాబుతో పొత్తు ఎందుకో కాంగ్రెస్ సమాధానం చెప్పాలన్నారు. కూటమి కుట్రలను ప్రజలు గమనించాలని కోరారు. నిరంతరం ప్రజల మధ్య ఉంటున్న వారినే మళ్లీ గెలిపించాల్సిందిగా ఆమె పిలుపునిచ్చారు. నాలుగున్నరేండ్లలో కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్‌ ఎస్ ప్రభుత్వం అందించిన సంక్షేమ - అభివృద్ధి పథకాలను చూసి ప్రజలు నిర్ణయం తీసుకోవాలని కోరారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలతో భవిష్యత్‌ లో పుట్టగతులు ఉండవని భయపడిన కాంగ్రెస్ - టీడీపీలు.. తమ ముఫ్ఫై ఏళ్ల‌ వైరాన్ని వదిలి కూటమి కట్టాయన్నారు. కేసీఆర్‌ ను తట్టుకోలేని ప్రత్యర్థులు తప్పుడు జట్టుకట్టాయని పేర్కొన్నారు. పక్కరాష్ట్రం సీఎం చంద్రబాబు తెలంగాణ బాగుపడవద్దని నాలుగున్నరేళ్ల‌లో అనేక కుట్రలు చేశారని, హైకోర్టు విభజనను అడ్డుకున్నారన్నారు. కూటమికి మూడు అధిష్ఠానాలు ఉన్నాయని ఎంపీ క‌విత ఎద్దేవా చేశారు. అమరావతి - ఢిల్లీ పార్టీలకు ఓటు వేస్తే తెలంగాణ అభివృద్ధి కలగానే మిగులుతుందని చెప్పారు. మాకు ప్రజలే అధిష్ఠానం - వారు చెప్పినట్లే మేం నడుచుకొంటాం - వారి అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు.