Begin typing your search above and press return to search.

మోడీని ఈసారి తెగ ఇబ్బంది పెట్టేస్తార‌ట‌

By:  Tupaki Desk   |   15 Dec 2017 5:35 AM GMT
మోడీని ఈసారి తెగ ఇబ్బంది పెట్టేస్తార‌ట‌
X
ఈ రోజు నుంచి మొద‌లు కానున్న పార్ల‌మెంటు శీతాకాల స‌మావేశాల్లో త‌మ గ‌ళాన్ని బ‌లంగా వినిపిస్తామ‌ని చెబుతున్నారు టీఆర్ ఎస్ ఎంపీ జితేంద‌ర్ రెడ్డి. విభ‌జన అనంత‌రం రెండు రాష్ట్రాలుగా విడిపోయి నాలుగేళ్లు అవుతున్నా.. విభ‌జ‌న వేళ‌లో ఇచ్చిన హామీల్ని ఇప్ప‌టివ‌ర‌కూ అమ‌లు చేయ‌లేద‌న్న ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు.

విభ‌జ‌న సంద‌ర్భంగా తెలంగాణ రాష్ట్రానికి హామీ ఇచ్చిన అంశాల అమ‌లుపై మోడీ స‌ర్కారును నిల‌దీస్తామ‌ని చెబుతున్నారు. కీల‌క‌మైన హైకోర్టు విభ‌జ‌న మీద కేంద్రం ఇప్ప‌టివ‌ర‌కూ చ‌ర్య‌లు తీసుకోలేద‌న్న అసంతృప్తిని వ్య‌క్తం చేశారు. హైకోర్టుతో పాటు.. బ‌య్యారం ఉక్కు క‌ర్మాగారం.. ఎయిమ్స్ లాంటి వాటిపై ఇచ్చిన హామీల్ని ఇప్ప‌టివ‌ర‌కూ నెర‌వేర్చ‌లేద‌ని.. వీటి విష‌యంలో గ‌ట్టిగా నిల‌దీస్తామ‌ని చెబుతున్నారు.

విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న రీతిలో రాష్ట్రంలో అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో అసెంబ్లీ స్థానాల్ని పెంచాల్సిన అవ‌స‌రం ఉంద‌న్న ఆయ‌న‌.. రిజ‌ర్వేష‌న్ల విష‌యంలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో అఖిల‌ప‌క్షాన్ని ఏర్పాటు చేసి ప్ర‌ధాని దృష్టికి తీసుకెళ‌తామ‌ని చెప్పారు.

ఈ రోజు నుంచి మొద‌ల‌య్యే శీతాకాల స‌మావేశాల్లో మోడీ స‌ర్కారును ఇరుకున పెట్టేలా ప్ర‌శ్న‌ల స‌రంప‌ర ఉంటుంద‌ని.. ఈ విష‌యంలో వెన‌క్కి త‌గ్గేది లేదంటూ గులాబీ ఎంపీ చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారాయి. మ‌రి.. పార్ల‌మెంటులో గులాబీ ఎంపీలు ఎంత‌గా త‌మ గ‌ళాన్ని వినిపిస్తారో చూడాలి.