Begin typing your search above and press return to search.

మనోళ్లే అడ్డు పడుతున్నారు కేసీఆర్

By:  Tupaki Desk   |   27 Sep 2016 7:56 AM GMT
మనోళ్లే అడ్డు పడుతున్నారు కేసీఆర్
X
ఏదైనా విషయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక నిర్ణయానికి వస్తే.. ఆయన్ను ఎవరూ ఆపలేరు. ఎవరి మాట వినటం తర్వాత.. కేసీఆర్ ఒక విషయంలో ఫిక్స్ అయ్యారని తెలిసిన తర్వాత ఆయన కుటుంబ సభ్యులు సైతం ఆ విషయానికి భిన్నంగా మాట్లాడటానికి ఏమాత్రం ఇష్టపడరని చెబుతారు. ఇలాంటి వైఖరి ఉన్న కేసీఆర్ తాజాగా హైదరాబాద్ వరదల మీద ఫోకస్ చేశారు. హైదరాబాద్ లోని పలు కాలనీలు ఎందుకిలా మునిగిపోతున్నాయన్న అంశం మీద అధికారుల నుంచి సమాచారం తీసుకొని మదింపు జరిపిన తర్వాత.. నల్లాల మీద ఆక్రమ నిర్మాణాలు నిర్మించటం.. చెరువుల్ని ఆక్రమించి భారీ ఎత్తున నిర్మాణాలు సాగటమన్న విషయాన్ని అర్థం చేసుకున్న కేసీఆర్.. వాటి అంతు చూడాలని డిసైడ్ అయ్యారు.

దీనికి తగ్గట్లే మొన్న మీడియా సమావేశంలో అక్రమ కట్టడాల కారణంగా ఎదురవుతున్న ఇబ్బందుల్ని ప్రస్తావిస్తూ.. అక్రమ నిర్మాణాల కూల్చివేత విషయంలో సర్కారు సీరియస్ గా ఉంటుందని.. కాకుంటే ఈ ఇష్యూలో రాజకీయ నాయకులు.. మీడియా అందరూ సహకరించాలని కోరారు. కేసీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీ లాంటోళ్లు సైతం స్వాగతించి.. సర్కారుకు తాము సాయంగా ఉంటామని.. అక్రమ నిర్మాణాల్ని కూల్చివేయాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.

ప్రత్యర్థి పార్టీ నేతల నుంచి సహకారం అందినప్పటికీ.. సొంత పార్టీకి చెందిన నేతలు మాత్రం అక్రమ నిర్మాణాల కూల్చివేత విషయంలో సహకారాన్ని అందించకపోవటం ఇప్పుడు చర్చగా మారింది. ఓపక్క ముఖ్యమంత్రి అక్రమ నిర్మాణాల విషయంలో సీరియస్ గా ఉండటమే కాదు.. అలాంటి నిర్మాణాలు తమ పార్టీకి చెందిన వారివి అయినా వదిలిపెట్టేది లేదంటూ తేల్చి చెబితే.. మరోవైపు పార్టీ నేతలు అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తున్న అధికారుల్ని అడ్డుకోవటం ఏమిటన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

సోమవారం కూల్చివేతలు షురూ చేసిన అధికారులకు రెండు చోట్ల టీఆర్ ఎస్ నేతల నుంచే వ్యతిరేకత ఎదురైంది. ఇందులో ఒకరు టీఆర్ ఎస్ ఎమ్మెల్యే వివేక్ కాగా.. మరొకరు కార్పొరేటర్ తూము శ్రవణ్ కుమార్ కావటం గమనార్హం. మియాపూర్ సమీపంలోని దీప్తి శ్రీనగర్ లో ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చివేసేందుకు వెళ్లిన గ్రేటర్ అధికారుల్ని కుత్భుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ అడ్డుకోవటంతో అధికారులు వెనుదిరిగారు. ఈ విషయం మంత్రి కేటీఆర్ దృష్టికి వెళ్లటంతో ఆయన సీరియస్ కావటమే కాదు.. క్లాస్ పీకినట్లు చెబుతున్నారు. ఇదే విధంగా మూసాపేటలో ఆక్రమణలు తొలిగిస్తున్న అధికారులపై స్థానిక కార్పొరేటర్ శ్రవణ్ కుమార్ అడ్డుకోవటం హాట్ టాపిక్ గా మారింది. విపక్ష పార్టీల నేతలు కాకుండా.. సొంత పార్టీ నేతలే తమ అధినేత ఆదేశాల్ని అధికారులు అమలు చేయకుండా అడ్డుకోవటం విశేషం.