Begin typing your search above and press return to search.

టీఆర్ ఎస్ తొలి జాబితా నేడే.. కొందరికి షాకే!

By:  Tupaki Desk   |   21 March 2019 6:45 AM GMT
టీఆర్ ఎస్ తొలి జాబితా నేడే.. కొందరికి షాకే!
X
లోక్ సభ ఎన్నికలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర సమితి ఈ రోజు తన అభ్యర్థుల జాబితాను విడుదల చేయనుంది. ఎంఐఎంకి వదిలి పెట్టిన సీటును మినహాయించి.. తెరాస మిగతా అన్ని స్థానాలకూ అభ్యర్థులను ఖరారు చేయనుంది. ఇప్పటికే కొందరికి వ్యక్తిగతంగా ధ్రువీకరణ ఇచ్చేశారు. అలాంటి సీట్ల విషయంలో అభ్యర్థుల ప్రకటన నామమాత్రం కాబోతోంది.

తెరాస జాబితాలో కొన్ని ఆసక్తిదాయకమైన పేర్లు ఉండనున్నాయి. కొందరికి ఝలక్ లు తప్పేలా లేవు. పత్యేకించి ఖమ్మం సిట్టింగ్ ఎంపీ పొంగులేటికి కేసీఆర్ ఛాన్స్ ఇచ్చే అవకాశాలు లేవని సమాచారం. ఆయన గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున నెగ్గిన సంగతి తెలిసిందే. తెరాసలోకి ఫిరాయించారు. ఇప్పుడు ఆయన స్థానంలో నామా నాగేశ్వరరావుకు టికెట్ ను కేటాయించనున్నారట కేసీఆర్. తెలుగుదేశంపార్టీకి రాజీనామా చేసిన నామాకు ఇలా టక్కున తెరాస టికెట్ ఖరారు కావడం విశేషం.

ఇక సికింద్రాబాద్ఎంపీ సీటు నుంచి తలసాని శ్రీనివాస యాదవ్ తనయుడు రంగంలోకి దిగనున్నారట. భారీగా ఉన్న యాదవుల ఓట్లను దృష్టిలో ఉంచుకుని కేసీఆర్ ఆ నిర్ణయం తీసుకున్నారట.

చేవెళ్ల నుంచి కార్తిక్ రెడ్డి కి లేదా వ్యాపార వేత్త రంజిత్ రెడ్డికి అవకాశం దక్కనుందని సమాచారం. కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఓటమినే కేసీఆర్ అక్కడ లక్ష్యంగా చేసుకున్నారట.

మల్కాజ్ గిరిలో రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర రెడ్డికి అవకాశం ఇవ్వనున్నారని సమాచారం.

వరంగల్ నుంచి పసునూరి దాయకర్ కు - మహబూబాబాద్ నుంచి మాలోత్ కవితకు అభ్యర్థిత్వాలు ఖరారు అయినట్టుగా తెలుస్తోంది. పెద్దపల్లి ఎంపీ సీటు అభ్యర్థిత్వం వివేక్ కు ఖరారు అయ్యిందని సమాచారం.

ఇక మహబూబ్ నగర్ సిట్టింగ్ ఎంపీ జితేందర్ రెడ్డికి కేసీఆర్ ఈ సారి టికెట్ ఇవ్వడంలేదని - పారిశ్రామిక వేత్త మన్నె సత్యనారాయణ రెడ్డి సోదరుడు శ్రీనివాసరెడ్డికి టికెట్ దక్కనుందని సమాచారం. బీజేపీ తరఫునుంచి డీకే అరుణ అక్కడ బరిలోకి దిగనుండటంతో… కేసీఆర్ మరింతగా కసరత్తు చేస్తున్నారని టాక్.