Begin typing your search above and press return to search.

టీఆర్ ఎస్ కు ఊహించని షాక్

By:  Tupaki Desk   |   20 Nov 2018 10:54 AM GMT
టీఆర్ ఎస్ కు ఊహించని షాక్
X
అజ్మీరా రేఖా నాయక్.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఖానాపూర్ నియోజకవర్గ తాజా మాజీ టీఆర్ ఎస్ ఎమ్మెల్యే.. ఈసారి కూడా గులాబీ టికెట్ దక్కించుకొని ప్రచారంలో దూసుకెళుతున్నారు. 2009లో రాజకీయాల్లోకి వచ్చిన ఆమె కాంగ్రెస్ పార్టీ తరఫున ఆసిఫాబాద్ జడ్పీటీసీగా గెలిచారు. అనంతరం 2013లో టీఆర్ ఎస్ లో చేరి.. ఉద్యమంలో పాల్గొని 2014లో టీఆర్ ఎస్ ఖానాపూర్ ఎస్టీ నియోజకవర్గ టికెట్ పొంది గెలుపొందారు. టీడీపీ అభ్యర్థి రితేజ్ రాథోడ్ పై 30వేల ఓట్ల తేడాతో గెలుపొందారు.

తాజాగా ఈ టీఆర్ ఎస్ అభ్యర్థి చేసిన పొరపాటు ఆమెకు ఈ ఎన్నికల్లో పోటీచేసే అవకాశమే లేకుండా చేస్తోంది. రేఖానాయక్ నామినేషన్ లో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. నామినేషన్ పత్రాలను పూర్తిగా నింపకపోవడంతో ఆమె అనర్హత వేటు పడేందుకు సిద్ధంగా ఉన్నారు. రితేష్ రాథోడ్ అనే వ్యక్తి రిటర్నింగ్ అధికారికి దీనిపై ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయంలో తుది నిర్ణయం కోసం రిటర్నింగ్ అధికారులు ఆమె నామినేషన్ పత్రాలను జిల్లా కలెక్టర్ కు పంపించారు. రేఖానాయక్ నామినేషన్ ను తిరస్కరించాలని నిబంధనలు ఆమె పాటించలేదని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్నారు.

ఖానాపూర్ నుంచి రేఖానాయక్ టీఆర్ఎస్ అభ్యర్థిగా మూడు సెట్లు నామినేషన్ దాఖలు చేశారు. ఆ మూడు సెట్లలోనూ ఒక కాలమ్ ను ఖాళీగా వదిలేశారు. అసంపూర్తిగా నింపడంతో నిబంధనల ప్రకారం ఆమె నామినేషన్ ను తిరస్కరించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కలెక్టర్ ఏం నిర్ణయం తీసుకుంటారనేది గులాబీ నాయకులను షేక్ చేస్తోంది.ఆమె నామినేషన్ తిరస్కరణకు గురైతే ఎవరో డమ్మీ ముక్కు మొహం తెలియని వారికి గులాబీ బీఫారం ఇచ్చి అతడినే టీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించే అవాకాశాలుంటాయి. ఇది టీఆర్ఎస్ కు శరాఘాతంగా మారింది.