Begin typing your search above and press return to search.

సీనియర్ నేత తనయుడికి టీడీపీ టికెట్ ఖరారు?

By:  Tupaki Desk   |   14 March 2019 9:30 AM GMT
సీనియర్ నేత తనయుడికి టీడీపీ టికెట్ ఖరారు?
X
వివాదంగా మారిన శ్రీకాళహస్తి నియోజకవర్గం అభ్యర్థి విషయంలో తెలుగుదేశంలో స్పష్టత వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక్కడ నుంచి పోటీకి సీనియర్ నేత, మాజీ మంత్రి బొజ్జల గోపాల కృష్ణా రెడ్డి తనయుడికి ఓకే చెప్పారట చంద్రబాబు నాయుడు. గత కొన్ని రోజులుగా ఈ వ్యవహరం పై రచ్చ సాగుతున్న సంగతి తెలిసిందే.

ఇక్కడ నుంచి టీడీపీ అభ్యర్థిత్వానికి ఎస్సీవీ నాయుడు పోటీ పడుతూ ఉన్నారు. బొజ్జల కుటుంబానికి బదులుగా తనకు టికెట్ ఇవ్వాలని ఆయన కోరుతూ వస్తున్నారు. ఆయనకే టికెట్ ఖరారు అయ్యిందని కూడా ప్రచారం జరిగింది. అయితే బొజ్జల కుటుంబం మాత్రం గట్టిగా పోరాడుతూ ఉందని సమాచారం. బొజ్జల కాకుండా.. ఆయన తనయుడు సుధీర్ రెడ్డి పోటీ చేయడానికి ముందుకు వచ్చారు.

అయితే చంద్రబాబు నాయుడు బొజ్జల సుధీర్ రెడ్డికి టికెట్ ఇచ్చేందుకు సిద్ధంగా లేరని ఇన్నాళ్లూ వార్తలు వచ్చాయి. గోపాలకృష్ణా రెడ్డి మళ్లీ పోటీ చేస్తే చంద్రబాబు నాయుడు టికెట్ కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నారని, అయితే ఆయన తనయుడికి టికెట్ విషయంలో మాత్రం చంద్రబాబు సానుకూలంగా లేరని ప్రచారం జరిగింది. గోపాలకృష్ణా రెడ్డి పోటీ చేయడానికి రెడీ అయితే.. టికెట్ ఆయనదే అని బాబు స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది.

అయితే వయసు రీత్యా తను పోటీకి రెడీ లేనట్టుగా బొజ్జల బాబుకు విన్నవించారట. బొజ్జలకు ఆరోగ్యం బాగోలేదని చెప్పి.. చంద్రబాబు నాయుడే ఆయనను కేబినెట్ నుంచి తప్పించారు. అలాంటిది ఇప్పుడు ఆయనను మళ్లీ ఎమ్మెల్యేగా పోటీ చేయాలని బాబు ఒత్తిడి చేస్తున్నట్టుగా కూడా వార్తలు వచ్చాయి. అయితే.. అమరావతి ప్రాంతంలోనే మకాం వేసి బొజ్జల కుటుంబం బాబు మీద తీవ్రమైన ఒత్తిడి చేస్తూ వచ్చిందట.

బొజ్జలతో బాబుకు సాన్నిహిత్యం ఈనాటిది కాదు. దశాబ్దాల నాటి బంధం అది. ఆ సాన్నిహిత్యం కొద్దీ బాబు మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకురావడానికి వారికి అవకాశం ఏర్పడింది. ఈ నేపథ్యంలో… సుధీర్ కుమార్ రెడ్డికి శ్రీకాళహస్తి టికెట్ ఖరారు అయినట్టుగా సమాచారం. ఎస్సీవీ నాయుడును పక్కన పెట్టి బొజ్జల కుటుంబం కోరిక మేరకు సుధీర్ రెడ్డికి టికెట్ ఖరారు చేశారట చంద్రబాబు.