Begin typing your search above and press return to search.

బాబూ.... సీనియర్ల మాట వినండి....

By:  Tupaki Desk   |   12 Dec 2018 3:30 PM GMT
బాబూ.... సీనియర్ల మాట వినండి....
X
చంద్రబాబు నాయుడు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. అంతే కాదు... ఆయన మాటే పార్టీలో వేద వాక్కు. ఆయన గీసిన గీత దాటేందుకు కాదు... కనీసం ప్రశ్నించేందుకు కూడా తెలుగుదేశం పార్టీలో ఏ ఒక్కరికి అధికారం లేదు. చంద్రబాబు నాయుడి మాటే వేద వాక్కు. చంద్రబాబు నాయుడి ఆదేశాలే శిలాశాసనం. చంద్రబాబు నాయుడు మాటకు ఎదురు లేదు. ఇదంతా గతం. తెలంగాణలో జరిగిన ఎన్నికలతో తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడికి ఎదురు దెబ్బ తగిలే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇన్నాళ్లూ చంద్రబాబు నాయుడి ఆదేశాలకు - నిర్ణయాలకు జీహుజూర్ అని తలలు ఊపిన సీనియర్ నాయకులు ఇప్పుడు ఎదురు తిరిగే పరిస్థితి కనిపిస్తోంది. తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాన్ని తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులు వ్యతిరేకించారు. అసలు తెలుగుదేశం పార్టీ పుట్టిందే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అని - అలాంటిది ఇప్పుడు ఆ పార్టీతో చేతులు కలపడం ఆత్మహత్య వంటిదేనని సీనియర్ నాయకులు బహిరంగంగానే ప్రకటించారు. అయితే చంద్రబాబు నాయుడి ఏకపక్ష నిర్ణయాలకు తలొగ్గడమే తప్ప ఎలాంటి చర్చలకు తావు లేని తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులందరూ మిన్నకుండిపోయారు.

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి మహాకూటమిగా ఏర్పడిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీకి చావు దెబ్బ తగలడంతో సీనియర్ నాయకులు పెదవి విప్పే అవకాశాలు ఎక్కువయ్యాయంటున్నారు. కాంగ్రెస్ పార్టీని తెలుగు ప్రజలు క్షమించరడానికి తెలంగాణ ఎన్నికలే తార్కాణమని - దీనిని గమనించి భవిష్యత్ లో చంద్రబాబు నాయుడు వ్యక్తిగత ప్రయోజనాలను పక్కన పెట్టాలని తెలుగుదేశం సీనియర్లు అంటున్నారు. ఓటుకునోటు కేసు నుంచి బయటపడేందుకు, భారతీయ జనతా పార్టీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ కలిసారని తెలుగు ప్రజలకు అర్ధం అయ్యిందని - ఈ సమయంలో తన వ్యక్తిగత అవసరాల కంటే పార్టీ అవసరాలను పట్టించుకోవాలని సీనియర్లు తమ గళం విప్పే అవకాశం ఉందంటున్నారు. పార్టీలో ముందు నుంచి ఉన్న సీనియర్ నాయకులు కె.ఈ.క్రిష్ణమూర్తి - యనమల రామక్రిష్ణుడు - కిమిడి కళా వెంకట్రావ్ - బుచ్చయ్య చౌదరి వంటి వారు పార్టీని రక్షించుకోవాలంటే సమష్టి నిర్ణయాలకే ప్రాధాన్యత ఇవ్వాలని చంద్రబాబు నాయుడికి సూచించే అవకాశం ఉందంటున్నారు. తన కుమారుడ్ని ఎమ్మెల్సీగాను - మంత్రిగాను చేసిన చంద్రబాబు నాయుడు ఆ సమయంలో సీనియర్ల అభిప్రాయాలను తీసుకోలేదని కొందరు పార్టీ అంతర్గత సమావేశాల్లో అంటున్నారు. భవిష్యత్ లో తెలుగుదేశం పార్టీకి మేలు జరగాలంటే పార్టీలో సీనియర్ల అభిప్రాయాలను గౌరవించే పరిస్థితి రావాలని వారు ఆశిస్తున్నారు. పార్టీలో సీనియర్ల మాట వినకపోతే తెలంగాణలో జరిగిన పరిణామాలే ఆంధ్రప్రదేశ్ లో కూడా జరుగుతాయని వారు హెచ్చరిస్తున్నారు.