Begin typing your search above and press return to search.

తెలంగాణ‌లో టీడీపీ...ఓ ముగిసిన అధ్యాయం

By:  Tupaki Desk   |   18 Oct 2017 5:27 PM GMT
తెలంగాణ‌లో టీడీపీ...ఓ ముగిసిన అధ్యాయం
X

అవును ఇదే మాట అంటున్నారు తెలంగాణలో ప్ర‌స్తుత ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తున్న వారు...తెలంగాణ‌లో టీడీపీ ఓ జ్ఞాపకం...ఓ ముగిసిన అధ్యాయం అని అంటున్నారు. తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేర‌డం ఖరారు అయిపోవ‌డమే కాకుండా...పార్టీ అధిష్టానాన్ని - ఏపీ నేత‌ల‌ను చెడామ‌డా వాయించేసిన నేప‌థ్యంలో... ఈ టాక్ వినిపిస్తోంది.

రాష్ట్ర విభ‌జ‌న అనంత‌రం టీటీడీపీ త‌ర‌ఫున గెలిచిన 15 మంది ఎమ్మెల్యేల్లో ఇప్పటికే 12 మంది అధికార టీఆర్ ఎస్ పార్టీలో చేరిపోయారు. రాష్ట్రంలో పాక్షికంగా మిగిలిన ముగ్గురు తెలుగుదేశంపార్టీ ఎమ్మెల్యేల్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌ రెడ్డి - మరో ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య - ఖమ్మం జిల్లాకు చెందిన సండ్ర వెంకటవీరయ్య. తాజాగా టీడీపీకి రేవంత్ గుడ్ బై చెప్ప‌డం ఖ‌రారు అయిపోయింది. అంటే మిగిలింది ఇంకో ఇద్ద‌రు. అందులో ఒక‌రు ఆర్‌.కృష్ణ‌య్య‌. 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిగా ప్ర‌చారం పొంది....టీడీపీ త‌ర‌ఫున గెలిచిన‌ప్ప‌టికీ ఆ పార్టీ ఆయ‌న్ను గుర్తించ‌క..పార్టీని ఆయ‌న గుర్తించ‌క విభిన్న‌మైన ఎజెండాతో ముందుకు సాగుతున్నారు. తెలంగాణ‌లో టీడీపీ నామ‌మాత్రం అయిపోవ‌డం, ఏపీ సీఎం చంద్ర‌బాబుతో స‌ఖ్య‌త క‌ర‌వ‌యిన నేప‌థ్యంలో కృష్ణ‌య్య త‌నదారి తాను చూసుకుంటున్నారు. కొద్దికాలం కిత్రం తిరుప‌తిలో జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం పొలిట్ బ్యూరో సమావేశం అనంత‌రం కృష్ణ‌య్య చేసిన ప్ర‌క‌ట‌న సైతం ఇందుకు ఆజ్యం పోస్తోంది. ఈ స‌మావేశానికి ముఖ్యఅతిథిగా హాజ‌రైన జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్య‌క్షుడైన కృష్ణ‌య్య‌ బీసీల సంక్షేమం కోసం ప్రత్యేకంగా ఒక పార్టీ ఏర్పాటు చేయాలనే అంశాన్ని పరిశీలిస్తున్నామని వెల్లడించారు. దీంతో తెలుగుదేశం పార్టీలో ఆర్ కృష్ణయ్య అంకం ముగిసిన‌ట్లేన‌ని చెప్తున్నారు.

ఇక మిగిలింది ఖమ్మం జిల్లాకు చెందిన సండ్ర వెంకటవీరయ్య. తెరాసలో చేరడానికి ఆయన సుముఖంగా ఉన్నప్పటికీ, ఓటుకు నోటు కేసులో ఉండటంవల్ల కొంతకాలం ఆగిన తర్వాత పార్టీలో చేరాల్సిందిగా సూచించడంతో ఆగిపోయినట్టు రాజ‌కీయ‌ వర్గాల సమాచారం. అయితే ప్ర‌స్తుతం టీడీపీలో అయినా ఆయ‌న చురుకుగా ఉన్నారా అంటే అదీ లేదు. త‌న వ్యాపారాలు, వ్య‌క్తిగ‌త వ్య‌వ‌హ‌రాలతో స‌రిపెట్టుకుంటున్నారు. స్థూలంగా అసెంబ్లీలో టీటీడీపీ ఉందా అంటే...కేవ‌లం సాంకేతికంగా మాత్ర‌మే ముగ్గురు ఎమ్మెల్యేల‌తో ఉంది.ఇక పార్టీలో మిగిలిన సీనియ‌ర్ నేత‌లు త‌మ ప‌నుల్లో తామున్నార‌ట‌. దీంతో పాటుగా త‌మ నియోజ‌క‌వ‌ర్గాలకు మాత్ర‌మే ప‌రిమితమై...మంచి చాన్స్ దొరికితే...జంప్ చేసేందుకు సిద్ధంగా ఉన్నార‌ని టాక్ వినిపిస్తోంది.