Begin typing your search above and press return to search.

'దేశం' సరికొత్త అవిశ్వాసం డ్రామా...!

By:  Tupaki Desk   |   15 July 2018 5:09 PM GMT
దేశం సరికొత్త అవిశ్వాసం డ్రామా...!
X
తెలుగుదేశం పార్టీ మరో డ్రామాకు తెరతీసింది. ఇన్నాళ్లూ ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక హోదాపై రెండు నాల్కల ధోరణి అవలంభించి రాష్ట్ర ప్రజలను నిలువునా ముంచిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కొత్తగా కేంద్రంలో బిజెపి న్రభుత్వంపై అవిశ్వాసం పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ప్రత్యేక హోదా అంశంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుగుదేశం పార్టీని నమ్మడం లేదన్న విషయం తేటతెల్లమవడంతో ఈ సరికొత్త నాటకానికి తెలుగుదేశం పార్టీ తెర తీసింది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. లోక్‌ సభ సభ్యత్వాలకు రాజీనామా చేయకముందు సభలో అవిశ్వాస తీర్మానం పెట్టిన వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించిన తెలుగుదేశం నాయకులు ఇప్పుడు కొత్తగా ఈ అవిశ్వాసం తీర్మానం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.

లోక్‌ సభ ముగిసేందుకు ఇక పది పన్నెండు నెలల కాలం మాత్రమే ఉందని - ఇప్పుడు అవిశ్వాస తీర్మానం పెట్టి ఏం సాధిస్తారనే విమర్శలొస్తున్నాయి. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంపై తాము అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని - తమకు మద్దతు తెలపాలంటూ తెలుగుదేశం లోక్‌ సభ సభ్యులు సుజనా చౌదరి - కొనకళ్ల - సి.ఎం.మల్యాద్రి ఆదివారం సాయంత్రం తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన ఎంపీలు కె.కేశవరావు - జితేందర్ రెడ్డిలను కలిసి తమకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఇది కూడా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

సభలో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపై చర్చకు వచ్చిన సమయంలో మిన్నకున్న తెలుగుదేశం ఎంపీలు ఇప్పుడు తమకు అవసరం కాబట్టి తెలంగాణ ఎంపీలను కలవడం ఎంత వరకూ సమంజసమని ప్రశ్నిస్తున్నారు. గతంలో అవిశ్వాసం తీర్మానం - ఎంపీల రాజీనామాలు చేయడం వ్యర్ధమంటూ మాట్లాడిన తెలుగుదేశం అగ్రనాయకుడు - ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇప్పుడు తెర తీసిన ఈ కొత్త నాటకం ఎవరికి ఉపయోగమని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీని మంచిదంటూ చిలుక పలుకులు పలికిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇప్పుడు ఆడుతున్న ఈ కొత్తనాటకానికి తెర తీయడం డ్రామాగానే అందరూ పరిగణిస్తున్నారు.