Begin typing your search above and press return to search.

వైసీపీ నెటిజన్లపై టీడీపీ టార్గెట్?

By:  Tupaki Desk   |   8 Nov 2018 8:11 AM GMT
వైసీపీ నెటిజన్లపై టీడీపీ టార్గెట్?
X
తాము చేస్తే సంసారం.. పక్కోళ్లు చేస్తే వ్యభిచారం లా వ్యవహరించే తెలుగుదేశం పార్టీ పెద్దలు.. ఇప్పుడు మరో ఘాతుకానికి స్కెచ్ గీశారు. తమ అవినీతి, చేతికనితనాన్ని ప్రశ్నిస్తున్న వైసీపీ అనుకూల సోషల్ మీడియా నెటిజన్లను టార్గెట్ చేశారు. ఇప్పటికే వైసీపీ సానుభూతిపరులను వివిధ కేసులు - దాడులతో ఇబ్బందులకు గురిచేస్తున్న టీడీపీ ప్రభుత్వం - తాజాగా వైసీపీ అనుకూల నెటిజన్లపై దృష్టి పెట్టింది. సోషల్ మీడియాలో వైసీపీపై అభిమానంతో పోస్టింగ్ లు పెడుతున్న వారిని గుర్తించి వేధింపులకు గురిచేసేందుకు తెరతీసింది. చట్టంలోని లొసుగులను అనుకూలంగా మలుచుకొని కేసులు నమోదు చేసతున్నారు.

కొందరు వైసీపీ అభిమానులు సోషల్ మీడియానే ఆయుధంగా మలుచుకొని ప్రభుత్వ అవినీతిని - టీడీపీ నేతల భాగోతాలను బయటపెడుతున్నారు. దీంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా పనిచేస్తున్న వారిని గుర్తించి తాజాగా టీడీపీ పెద్దలు కేసులు పెడుతున్నారు. టీడీపీ నేతలను విమర్శిస్తూ పోస్టింగ్లు పెడితే బెదిరింపులకు దిగుతున్నారు. ఇటీవల జగన్ పై హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్ర ప్రసాద్ స్పందిస్తూ ఈ దాడి వెనుక విజయమ్మ - షర్మిల హస్తముందని అన్నారు. దీంతో వైసీపీ నెటిజన్లు ఆయనను టార్గెట్ చేస్తూ పోస్టింగ్ లు పెట్టడం మొదలుపెట్టారు.

రాజేంద్ర ప్రసాద్ కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు హల్ చల్ చేస్తుండటంతో, ఆగ్రహానికి గురైన ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన పైనా - తన కుమారై పైనా పోస్టులు పెట్టిన 18 మందిపై కృష్ణా జిల్లా ఉయ్యూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వెంటనే కేసు నమోదు చేసుకున్న పోలీసులు - స్వామిభక్తిని చాటుతూ అరెస్టు చేసే పనిలో పడ్డారు. వీరిలో కొందరు విదేశాల్లో ఉండటంతో వారిని కూడా అరెస్టు చేస్తామని చెబుతున్నారు.

ఏది ఏమైనా, టీడీపీ తీరుపై విమర్శలు పెల్లుబికుతున్నాయి. తాను చెప్పిందే జరగాలంటున్న చంద్రబాబు వైఖరిపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భావ ప్రకటన స్వేచ్ఛను కూడా హరించేస్తున్నారని, రాబోవు రోజుల్లో ఆ పార్టీకి పుట్టగతులుండవని అంటున్నారు. ఓటర్లు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని తిట్టిపోస్తున్నారు.