Begin typing your search above and press return to search.

బాబుకు షాక్‌: వ‌ంశీ రాజీనామా లేఖ‌!

By:  Tupaki Desk   |   22 Nov 2017 8:15 AM GMT
బాబుకు షాక్‌: వ‌ంశీ రాజీనామా లేఖ‌!
X
ఏపీ సీఎం టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు గ‌ట్టి షాక్ త‌గ‌ల‌నుందా? టీడీపీకి కంచుకోట అయిన కృష్ణా జిల్లా గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ త‌న ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని డిసైడ్ అయ్యారా? ప్ర‌స్తుతం జరుగుతున్న అసెంబ్లీ స‌మావేశాల్లో ఈ విష‌యం సంచ‌ల‌నంగా మారిందా? అంటే ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. టీడీపీలో ఎంతో చురుగ్గా, చంద్ర‌బాబుకు ఎంతో విధేయుడుగా పేరు తెచ్చుకున్న గ‌న్న‌వ‌రం టీడీపీ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ.. త‌న ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని డిసైడ్ అయ్యారు. అసెంబ్లీలో స్పీక‌ర్‌ కు ఈ రాజీనామా లేఖ ఇచ్చేందుకు కూడా వంశీ రెడీ అయ్యారు. అయితే, అనూహ్యంగా ఈ విష‌యం యూట‌ర్న్ తీసుకుంది. అత్యంత ఆస‌క్తిని క‌లిగించే ఈ ఘ‌ట‌న విష‌యాలు ఇవీ..

గ‌న్న‌వ‌రం నుంచి గెలిచిన వంశీకి.. టీడీపీలో పెద్ద‌గా ప్రాధాన్యం ఉండ‌డం లేద‌ని ఇటీవ‌ల టాక్ న‌డిచింది. అంతేకాదు, త‌న నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రుగుతున్న ప‌నుల విష‌యంలోనూ ఆయ‌న‌కు స‌మాచారం ఉండ‌డం లేద‌ని, ఓ ఎమ్మెల్యేగా ఆయ‌న‌కు గౌర‌వం కూడా ద‌క్క‌డం లేద‌ని వంశీ తీవ్రంగా మ‌థ‌న ప‌డుతున్నాడు. ఈ క్ర‌మంలోనే తాజాగా జ‌రిగిన ఘ‌ట‌న ఆయ‌న‌లో ఇప్ప‌టికే ఉన్న అసంతృప్తి మంట‌ల‌పై పెట్రోల్ జ‌ల్లిన‌ట్ట‌యింది. కోస్తాలో ప్ర‌తిష్టాత్మ‌క‌.. డెల్టా షుగర్స్‌ ను హనుమాన్‌ జంక్షన్‌ నుంచి తణుకు ప్రాంతానికి తరలించాలనే ప్రతిపాదన ఉంది. అయితే తన నియోజకవర్గం నుంచి డెల్టా షుగర్స్‌ను తరలించవద్దని, అనేకమంది రైతుల జీవితాలు ఆధారపడి ఉన్నాయంటూ... ఈ విషయంపై ఎమ్మెల్యే వంశీ గ‌త కొన్నాళ్లుగా అధికారుల‌కు విన్న‌విస్తూనే ఉన్నారు.

అయినా కూడా వంశీ మాట‌లు ఖాత‌రు చేయ‌కుండా అధికారులు త‌ర‌లింపున‌కు య‌త్నాలు సాగించారు. ఇక‌, ఈ విష‌యంపై రైతులు ఎమ్మెల్యే వంశీని ఆశ్ర‌యించారు. దీంతో ఆయ‌న బుధ‌వారం కొంతమంది రైతులతో కలిసి ముఖ్యమంత్రితో మాట్లాడేందుకు అసెంబ్లీకి వెళ్లారు. అయితే సీఎంవో కార్యాలయానికి చెందిన ఓ అధికారి... ఎమ్మెల్యే వంశీని అడ్డుకుని, విషయం తమతో చెప్పాలని, సీఎంను కలిసేందుకు ఇప్పుడు వీలు కాదని చెప్పడంతో... ఇరువురి మధ్య వాగ్వివాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఓ దశలో ఆ అధికారి దురుసుగా ప్రవర్తించడంతో వంశీ... మనస్తాపానికి గుర‌య్యారు. ఎమ్మెల్యే అయిన త‌న‌కే విలువ లేదా? అని ప్ర‌శ్నించ‌డంతోపాటు విలువ లేని ప‌ద‌వి త‌న‌కు అవ‌స‌రం లేద‌ని భావిస్తూ.. ఎమ్మెల్యేగా రాజీనామాకు సిద్ధపడ్డారు.

ఈ క్ర‌మంలోనే వంశీ తన రాజీనామా లేఖతో స్పీకర్‌ వద్దకు వెళ్లేందుకు యత్నించారు. ఆ విషయాన్ని గమనించిన ఆయ‌న స్నేహితుడు, మరో ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌... వంశీ వద్ద నుంచి రాజీనామా లేఖను తీసుకుని చింపివేశారు. అంతేకాకుండా ఈ విషయాన్ని మంత్రి లోకేశ్‌ దృష్టికి తీసుకు వెళ్లడంతో... వంశీని బుజ్జగించే అంశాన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావుకు అప్పగించారు. ప్ర‌స్తుతం వెంక‌ట్రావ్ స‌మ‌స్య‌ను తెలుసుకుంటున్నార‌ట‌. అయితే, డెల్టా షుగ‌ర్స్ విష‌యంలో అధికారులు చేసిన అవ‌మానాన్ని తాను జీర్ణించుకోలేక పోతున్నాన‌ని వంశీ చెప్ప‌డంతో ఈ విష‌యాన్ని అధినేత చంద్ర‌బాబు దృష్టికి తీసుకు వెళ్లాల‌ని క‌ళా వెంక‌ట్రావ్ డిసైడ్ చేసుకున్నార‌ట‌. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. మొన్నామ‌ధ్య అనంత‌పురం ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి కూడా త‌న నియోజ‌క‌వ‌ర్గంలో అధికారులు త‌న మాట విన‌డం లేద‌ని, రైతుల‌కు నీళ్లు రావ‌డం లేద‌ని రాజీనామా అస్త్రం ప్ర‌యోగించిన విష‌యం గుర్తుండే ఉంటుంది.