Begin typing your search above and press return to search.

25 మంది కొత్తవారికి టీడీపీ టిక్కెట్లు

By:  Tupaki Desk   |   18 Dec 2018 6:31 AM GMT
25 మంది కొత్తవారికి టీడీపీ టిక్కెట్లు
X
తెలంగాణ ఎన్నికల దెబ్బకు ఏపీలో ఎలాంటి తేడా లేకుండా చంద్రబాబునాయుడు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా అత్యంత సమస్యాత్మకంగా ఉన్న 25 ఎమ్మెల్యేలకు ఈసారి టిక్కెట్లు ఇవ్వకుండా వారి స్థానంలో కొత్తవారికి చాన్సివ్వనున్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు మరికొందరినీ మార్చనున్నట్లు సమాచారం. మొత్తంగా 30 నుంచి 40 మందిని మారుస్తారని పార్టీలో వినిపిస్తోంది.

క్షేత్ర స్థాయిలో కొందరు ఎమ్మెల్యేలు బాగా బలహీనపడడం.. పనితీరు సక్రమంగా లేకపోవడం, ప్రజల్లో వ్యతిరేకత రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఈ కేటగిరీలో ఉన్న సంఖ్య ఇంకా ఎక్కువే ఉన్నప్పటికీ వారికి టిక్కెట్లు ఇవ్వకపోతే అక్కడ సమస్యలు సృష్టించి నష్టం చేస్తారన్న భయంతో కొందరిని మాత్రం ఉపేక్షిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ జాబితాలో పలువురు మంత్రులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

వర్గ రాజకీయాలు, ఇసుక దందాలు, ఇతర అరాచకాలతో ప్రతిష్ఠ పోగొట్టుకున్న ఎమ్మెల్యేలు కొందరున్నప్పటికీ వారికి బదులు కొత్తవారికి అవకాశం ఇచ్చినా వారిని గెలవనివ్వకుండా చేస్తారని చంద్రబాబు భయపడుతున్నారట. దీంతో కేవలం పనితీరు సరిగా లేనివారిని మార్చబోతున్నట్లు చెబుతున్నారు. కొన్ని చోట్ల చినబాబు లోకేశ్ అనుకూలురు కోసం కూడా పాతవారిని మారుస్తున్నారట.