Begin typing your search above and press return to search.

'ఆ ఇద్దరూ' ఎగ్జాంపుల్సే... దేనికో తెలుసా?

By:  Tupaki Desk   |   5 Sep 2015 6:02 AM GMT
ఆ ఇద్దరూ ఎగ్జాంపుల్సే... దేనికో తెలుసా?
X
ఈ రోజుల్లో ఎమ్మెల్యే అంటే మినిమం పదికోట్లు ఖర్చు పెట్టుకోకుండా.. శాసససభలో అడుగుపెట్టడం లేదని అంతా అనుకుంటూ ఉంటారు. ఒక రకంగా అది వాస్తవమేనని మన కళ్ల ముందు కనిపించే విషయాలు తెలియజేస్తుంటాయి. మరోవైపు దేశంలోనే అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యానికి అధినేతలు అయిన అంబానీ వంటి వారు ఎన్నికల్లో పోటీకి దిగితే.. తనకు ఒక్క కారు కూడా లేదంటూ అఫిడవిట్లు సమర్పిస్తుంటారు. అయితే ఎమ్మెల్యే స్థాయిలోని నాయకుడు కనీసం కారు లేకుండా ఉంటారా? అంటే అనుమానమే. కానీ.. ఏపీలో ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రం.. తమ తమ క్వార్టర్లనుంచి.. ప్రభుత్వం ఏర్పాటుచేసిన బస్సుల్లోనే రాష్ట్ర శాసనసభ సమావేశాలకు వచ్చారు. ఒక్కరోజు కూడా వీరిద్దరూ కారు వేసుకుని రాలేదు. ఆ ఇద్దరూ ఎవరో తెలుసా? ఒకరు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, మరొకరు విజయనగరం జిల్లా శృంగవరపు కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి. ఆమె టీటీడీ సభ్యురాలు కూడా! అసెంబ్లీ సమావేశాలకు వీరిద్దరూ మాత్రమే ప్రభుత్వం వారి బస్సులోరావడం విశేషం.

అసెంబ్లీ జరిగేప్పుడు హైదర్‌గూడ, ఆదర్శనగర్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్లనుంచి ఎమ్మెల్యేలకోసం ప్రభుత్వం రెండు వేర్వేరు బస్సు సర్వీసులు ఏర్పాటు చేస్తుంది. ఇది చాలా సాధారణంగా జరుగుతుంది. అయితే ఎమ్మెల్యేలందరికీ కార్లుంటాయి గనుక.. వీటిలో వచ్చేవారంటూ ఎవరూ ఉండరు. కేవలం కొందరు అసెంబ్లీ సిబ్బంది మాత్రమే ప్రయాణిస్తుంటారు. కానీ ఈదఫా అసెంబ్లీ సమావేశాల సమయంలో హైదర్‌ గూడ బస్సులో ఒకరు, ఆదర్శనగర్‌ బస్సులో ఒకరు వంతున పై ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రం వచ్చారు. ఏదో ఆపద్ధర్మంగా కాకుండా... మొత్తం అయిదురోజులపాటూ వీరిద్దరూ బస్సులోనే రావడాన్ని విశేషంగానే చెప్పుకోవాలి.

నిజానికి ఒక కోణంలోంచి చూసినప్పుడు వీరిని రోల్‌మోడల్స్‌ గా, ఎగ్జాంపుల్స్‌ గా చెప్పుకోవాలి. వాహనాలున్నాయి కదాని దుర్వినియోగం కాకుండా ఈ సదుపాయం వాడుకున్నందుకు అభినందించాలి. అయితే వీరు ఎగ్జాంపుల్స్‌ అన్నది నిజమే.. వీరిద్దరూ సొంతకార్లు కాకుండా.. బస్సులోనే రావడం అనేది చాలా అర్థాలు ఇవ్వగల విషయాలకు సంకేతం అని పలువురు భావిస్తున్నారు. కోఇన్సిడెన్స్‌ ఏంటంటే.. వీరిద్దరూ ఉత్తరాంధ్ర ప్రాంతానికే చెందిన ఎమ్మెల్యేలు. ఉత్తరాంధ్రప్రాంతం ఎంతగా వెనుకబడి ఉన్నదో.. ఎమ్మెల్యేలు కూడా సొంత కార్లలో సభకు రాలేని స్థితిలో ఉన్నారో తెలియజెప్పడానికి కూడా ఈ ఉదంతం ఒక ఎగ్జాంపుల్‌ అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

అసెంబ్లీ జరుగుతోంటే.. ఒక్కొక్క ఎమ్మెల్యే, తమకు - తమ వందిమాగధులకు చాలినన్ని కార్లు వేసుకువచ్చి రద్దీ సృష్టించకుండా.. ఇలా ప్రభుత్వ రవాణా ద్వారా రావడం అభినందనీయం. అందుకుకూడా వీరిని ఎగ్జాంపుల్స్‌ గానే పేర్కొనాలి. ప్రజారవాణా ఆదరణ పెరగాలని మాటలు చెప్పడం కాదు, నాయకులే ఆచరించాలనడానికి వీరు ఎగ్జాంపుల్స్‌ అనే చెప్పాలి. ఏమంటారు?