Begin typing your search above and press return to search.

బిగ్ బ్రేకింగ్: అర‌కు ఎమ్మెల్యేను కాల్చిచంపిన మావోలు

By:  Tupaki Desk   |   23 Sep 2018 8:58 AM GMT
బిగ్ బ్రేకింగ్: అర‌కు ఎమ్మెల్యేను కాల్చిచంపిన మావోలు
X
మావోయిస్టులు మ‌రోమారు త‌మ పంజా విసిరారు. విశాఖ జిల్లాలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. అరుకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు - మాజీ ఎమ్మెల్యే శివేరి సోమను కూడా మావోయిస్టులు కాల్చిచంపారు.ఈ రోజు డుంబ్రిగూడ మండలం తుటంగికి గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తుండగా... ఒక్కసారిగా ఎమ్మెల్యే కాన్వాయ్‌పై దాడికి పాల్పడ్డారు. దాడిలో సుమారు 60 మంది వరకు మావోయిస్టులు పాల్గొన్నట్టు తెలుస్తోంది. వాహన శ్రేణిపై దాడి చేసిన మావోయిస్టులు... మిగతావారిని వాహనాల నుంచి దించివేసి... అతిసమీపం నుంచి ఇద్దరిని కాల్చిచంపారు. మధ్యాహ్నం ఒంటి గంట సమీపంలో అరకు నుంచి బయల్దేరిన ఎమ్మెల్యే... దాదాపు అరగంటలోనే హత్యకు గురయ్యారు.

గత ఎన్నికల్లో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సర్వేశ్వరరావు... ఇటీవలే వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. పలుమార్లు మావోయిస్టులు... ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును హెచ్చరించారు. ఆయనను హెచ్చరిస్తూ మావోయిస్టులు పోస్టర్లు కూడా వేశారు. 2014లో కిడారి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయనకు భార్య - ఇద్దరు కుమారులున్నారు. ఇటీవలే వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. కిడారిపై దాడి జరిగినట్లు మాకు సమాచారం అందిందని ఎస్పీ రాహుల్ దేవ్ తెలిపారు. దాడిని నిర్ధారించేందుకు సిబ్బంది సంఘటనా స్థలానికి వెళ్లారని ఎస్పీ చెప్పారు. కాగా, ఈ ఘ‌ట‌న‌పై అమెరికా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న సీఎం చంద్ర‌బాబు దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశార‌ని ఒక ప్ర‌క‌ట‌న వెలువ‌డింది.