Begin typing your search above and press return to search.

బాబు మార్కు సాగ‌దీత‌తో త‌మ్ముళ్ల‌లో బేజారు

By:  Tupaki Desk   |   12 Oct 2017 5:30 PM GMT
బాబు మార్కు సాగ‌దీత‌తో త‌మ్ముళ్ల‌లో బేజారు
X
ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుపై తెలుగుదేశం పార్టీ ద్వితీయ శ్రేణి నేత‌లు గుస్సా అవుతున్నారు. అధికారంలో ఉన్నామ‌నే సంతోషం కూడా తమ‌కు మిగ‌ల‌డం లేద‌నే అసహ‌నం వ్య‌క్తం చేస్తున్నారు. పార్టీ కోసం తాము శ్ర‌మిస్తుంటే...త‌మ‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని వాపోతున్నారు. ఇదంతా రాష్ట్రంలో నామినేటెడ్‌ పదవుల భ‌ర్తీ గురించి. ఎంతో కాలంగా నేతలు నామినేటెడ్ ప‌ద‌వుల భ‌ర్తీ కోసం ఎదురుచూస్తున్నా వారికి నిరాశే మిగులుతోంది. మరి కొంతమందికి అవకాశం వచ్చినట్లే వచ్చి, ఇట్టే చేజారిపోతుండడంతో వారిలో నిరాశనిస్పృహలు అలుముకుంటున్నాయి.

ఏపీలో పలు ప్రధాన దేవస్థానాల‌ పాలకమండళ్ల‌ చైర్మన్‌ - పాలక మండలి సభ్యుల నియామకం చేయాల్సి ఉంది. వీటి కోసం ఎంతో మంది సీనియర్‌ తెలుగుదేశం నాయకులు ఆశగా ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్దానంతో పాటు శ్రీశైలం దేవస్థానంతో పాటు మ‌రికొన్ని దేవస్థానాలకు కూడా చైర్మన్లు - సభ్యులను నియమించాల్సి ఉంది. కానీ పార్టీ అధికారాన్ని చేపట్టి మూడేళ్లయినా ఇంతవరకు నామినేటెడ్‌ పదవులను భర్తీ చేయకపోవడం పట్ల పార్టీ నేతల్లో కొంత అసహనం నెలకొన్నదంటున్నారు. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి నియామకం విషయంలో ప్రతిసారి వాయిదా పడుతూ వస్త్తోంది. రాష్ట్రంలో ఏ పదవికి లేని విధంగా టీటీడీ దేవస్థానం చైర్మన్‌ పదవికి మంచి డిమాండ్‌ ఉంది. దీని కోసం తీవ్రంగా పోటీపడుతున్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా పార్టీ సీనియర్‌ నాయకులు - పార్లమెంట్‌ సభ్యులు రాయపాటి సాంబశివరావు ఈ పదవిని బాగా ఆశిస్తున్నారు. ఈ పదవి తనకిస్తే అవసరమైతే తన ఎంపీ పదవిని సైతం వదులుకుంటా నని కూడా సాంబశివరావు గతంలోనే స్పష్టంచేశారు. ఇటీవల కూడా ఆ వేంకటేశ్వరుడే తనకు న్యాయం చేస్తాడని కూడా ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. పదవులున్న వారికి నామినేటెడ్‌ పదవి ఇవ్వడం కుదరదని ముఖ్యమంత్రి తేల్చిచెప్పడంతో ఒకింత ఆయన నొచ్చుకోవడం కూడా జరిగింది. ఇప్పటికీ కూడా ఆయన ఈ పదవి కోసమే ఎదురుచూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. సాంబ శివరావు ఇటీవల ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఆయనతోపాటు రాజమండ్రి ఎంపీ మురళీమోహన్‌ కూడా ఈ పదవిని ఆశించారు. తర్వాత చిత్తూరు జిల్లాకు చెందిన ప్రముఖ వ్యాపార వేత్త కృష్ణమూర్తి తదితరులు పదవిని ఆశించి, విజయం సాధించలేకపోయారు. ఆ మధ్య మళ్లీ పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు నందమూరి హరికృష్ణ పేరు కూడా తెరపైకి తెచ్చారు.

ఇదే స‌మ‌యంలో కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న పుట్టా సుధాకర్‌ యాదవ్‌ ను ప్రభుత్వం నియమించినట్లు ఇటీవల ప్రచారం జరిగింది. కానీ ఆయన సంతోషం ఎన్నో రోజులు నిలవలేదు. ఆయనకు క్రైస్తవ మతంతో సంబంధాలు ఉన్నాయని, ఈ పదవిని చేపట్టేందుకు నిబంధనలు అంగీకరించవని తేల్చిచెప్పడంతో ప్రభుత్వం ఆయన నియామకాన్ని నిలిపేసింది. దీంతో ఆయన నియామకంతో పాటు సభ్యుల నియామకాలు కూడా నిలిచిపోయాయి. దీంతో మ‌ళ్లీ వ్యవహారం మొదటికే వచ్చింది. చివరికి ఈ పదవిలో ఎవర్నీ నియమించ కుండానే బ్రహోత్సవాలు కూడా జరిగిపోయాయి.సుధాకర్‌యాదవ్‌ పేరు ఖారారైందన్న ప్రచారం నేపథ్యంలో హరికృష్ణ కొంత కినుక వహించారని, ఆయన్ని పార్టీ పెద్దలు బుజ్జగించారంటూ ప్రచారం జరిగింది. అసలు ఈ పదవి నియామకంలో సమీకరణలు, లెక్కలు కుదరకనే ముఖ్యమంత్రి చంద్ర‌బాబు ఎటూ తేల్చడం లేదంటున్నారు. ఈ పదవి విషయంలో తీవ్ర ఒత్తిడి వస్తుండడంతో ఎవరికీ కట్టబెట్టాలనే విషయంలో ప్రభుత్వంలో మీమాంస నెలకొన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే శ్రీశైలం దేవస్థానం పాలక మండలి నియామకం వ్యవహారం కూడా ఇంకా ఒక కొలిక్కిరాలేదు. ఈ దేవస్థానం చైర్మన్‌ పదవి కోసం రాయలసీమ నుంచి పలువురు ఆశిస్తున్నారు. ప్రస్తుతం ఈఓ ఆధ్వర్యంలోనే కార్యక్రమాలు జరుగుతున్నాయి.

ఈ పదవులే కాకుండా ఇంకా రాష్ట్రంలో కార్పొరేషన్లకు సంబంధించి పలు నామి నేటెడ్‌ పదవులను కూడా భర్తీ చేయాల్సి ఉంది. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను పర్యవేక్షించే 20 సూత్రాల పథకం కమిటీ చైర్మన్‌ - సభ్యులను నియమించాల్సి ఉంది. అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్ధ కార్పొరేషన్‌, ఏపీఐడీసీలతో పాటు దాదాపు 20కి పైగానే కార్పొరేషన్లకు చైర్మన్‌, ఇతర సభ్యులను నియమించాల్సి ఉంది. కానీ ఎందుకో ఇంతవరకు వీటిలో ఏ ఒక్క నామినేటెడ్‌ పదవిని ప్రభుత్వం భర్తీ చేయలేదు.మరో ఏడాదిన్నర కాలంలో సాధారణ ఎన్నికలు వచ్చే అవకాశం ఉండడంతో ఇంకెప్పుడు బె ర్తు రిజర్వవుతుందా? అని టెన్షన్‌ తో ఉన్నారు. ఈ తరుణంలోనే పదవులను భర్తీ చేస్తే రానున్న ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుందని పదవులు ఆశిస్తున్న వారు అభిప్రాయపడుతున్నారు.