Begin typing your search above and press return to search.

టీడీపీ రాజ్యసభ సీటుకు కొత్త ముఖం హేమలత?

By:  Tupaki Desk   |   25 May 2016 8:41 AM GMT
టీడీపీ రాజ్యసభ సీటుకు కొత్త ముఖం హేమలత?
X
రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఆశావహుల సంఖ్య పెరుగుతోంది.ఏపి నుంచి ఖాళీ అయ్యే నాలుగు సీట్లలో మూడు స్థానాలు టిడిపి - ఒకటి వైఎస్సార్‌ సీపీకి సులభంగా దక్కే అవకాశాలున్నాయి. అయితే వైసీపీ ఎమ్మెల్యేల ఫిరాయింపు నేపథ్యంలో, నాలుగోసీటుకు ఈసారి పారిశ్రామికవేత్తను బరిలోకి దించాలని టిడిపి భావిస్తున్నట్లు సమాచారం. ఉన్న మూడు స్థానాల కోసం టిడిపిలో దాదాపు డజనుమంది ఆశావహులు కాచుక్కూచున్నారు. ప్రస్తుత కేంద్రమంత్రి సుజనా చౌదరికి పొడిగింపు వ్యవహారం ఇంకా తేలకపోవడంతో చాలామంది ఆ సీటుపై ఆశ పెట్టుకున్నారు. విదేశీ బ్యాంకు రుణాల ఎగవేత వ్యవహారంపై ప్రధాని సీరియస్‌ గా ఉన్నారని, బాబుకు సైతం ఆ విషయం స్పష్టం చేశారన్న ప్రచారం పార్టీ వర్గాల్లో జరుగుతోంది. దానికితోడు లోకేష్‌ తో ఆయన సంబంధాలు బలహీనపడ్డాయన్న ప్రచారం కూడా ఉంది. దాంతో ఆయనకు పొడిగింపు ఉండకపోవచ్చని అనుకుంటున్నారు.. కానీ.. సుజనా ఇటీవల లోకేష్‌ తో తన సంబంధాలను పునరుద్ధరించుకున్నందున ఆయన సీటుకు ఢోకా లేదనీ తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం నిర్మలాసీతారామన్ - సత్యవేడు మాజీ ఎమ్మెల్యే హెచ్.హేమలతలకు ఇప్పటికే కన్ఫర్మయిందని తెలుస్తోంది. హేమలత పేరు ఇంతవరకు రేసులో వినిపించకపోయినా సడెన్ గా వచ్చి చేరింది.

ఇక రాజ్యసభ సీట్ల కోసం టీడీపీలో గట్టి ప్రయత్నాల్లో ఉన్నవారిని చూస్తే... ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్‌ రావు ముందు వరుసలో ఉన్నారు. ఢిల్లీలో పార్టీ-ప్రభుత్వానికి అనుసంధానకర్తగా ఉన్న కంభంపాటి కోసం కృష్ణా జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు - ఇద్దరు మంత్రులు కూడా సిఫారసు చేస్తున్నట్లు సమాచారం. గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి జెఆర్ పుష్పరాజ్ కూడా సీటు ఆశిస్తున్నారు. తనకు ఎమ్మెల్సీ కూడా ఇవ్వనందున, ఈసారయినా సీనియారిటీని గుర్తించాలంటున్నారు. కొత్తగా పార్టీలో చేసిన మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ రాయపాటి ఆశీస్సులతో లోకేష్ ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇద్దరూ దళితులే అయినప్పటికీ, పుష్పరాజ్ సీనియర్. ఆయనకు కాకుండా డొక్కాకు అవకాశం ఇస్తే, జిల్లాలో రాయపాటి అధిపత్యం పెరిగే అవకాశం ఉంది కాబట్టి చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. మరోవైపు బీసీ - యాదవ వర్గానికి చెందిన ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడుకు ఈసారి రాజ్యసభ సీటు ఖాయమని చర్చ జరుగుతోంది. బీసీ కోటాలో యాదవవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే - నెల్లూరు జిల్లా నేత బీద మస్తాన్‌ రావుకూడా టికెట్ అడుగుతున్నారు. పార్టీ స్థాపించిన తర్వాత ఇప్పటివరకూ కోస్తాలో బీసీలు - అందులోనూ యాదవులకు రాజ్యసభ ఇవ్వలేదని, కాబట్టి ఆ కోటాలో బీదకు ఇవ్వాలని రాష్ట్ర యాదవ సంఘ నేతలు బాహాటంగానే డిమాండ్ చేస్తున్నారు. బిజెపి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్‌ కు మళ్లీ పొడిగింపు ఇస్తారా? లేదా? అన్న అంశంపైనా తర్జనభర్జన జరుగుతోంది. మోదీని కలసిన తర్వాత బాబు వైఖరి మారిందంటున్నారు. పార్టీ నేతలతో జరిగిన రెండు మూడు సమావేశాల్లో బిజెపిని దూరం చేసుకోవద్దని స్పష్టం చేశారు. ఆ కోణంలో చూస్తే ఆమెకు చివరి నిమిషంలో మళ్లీ పొడిగింపు ఇచ్చినా, ఆశ్చర్యపోవలసిన పనిలేదంటున్నారు.

కాగా ఇప్పటికి 17 మంది వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీలో చేరిన నేపథ్యంలో.. మరో 17 మంది చేరితే వైసీపీ అభ్యర్ధి ఓడిపోవడం ఖాయమైనందున, నాలుగో సీటుకూ పోటీ పడాలని దేశం నాయకత్వం యోచిస్తోంది. ఆ మేరకు ఇద్దరు ముగ్గురు పారిశ్రామికవేత్తలు పోటీపడుతున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌ రెడ్డి - అదే జిల్లాకు చెందిన వేమారెడ్డి ప్రభాకర్‌ రెడ్డి - పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన రఘురామకృష్ణంరాజు - కర్నూలు జిల్లాకు చెందిన మాజీ మంత్రి టిజి వెంకటేష్ పేర్లు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. వీరంతా ఇప్పటికే లోకేష్‌ ను కలిశారు. తమకు టిక్కెటిస్తే మిగిలిన వైసీపీ ఎమ్మెల్యేలతో తాము ఓట్లు వేయించుకుంటామని వీరంతా చెబుతున్నారు.

మరోవైపు టిడిపి జాతీయ పార్టీగా రూపాంతరం చెందినందున, తెలంగాణ కోటాలో ఒకరికి రాజ్యసభ ఇవ్వాలన్న డిమాండ్ వినిపిస్తోంది. మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు - ఇనుగాల పెద్దిరెడ్డి - ఎం అరవిందకుమార్‌ గౌడ్ తమకు ఈసారి అవకాశం ఇవ్వాలని బాబును కోరుతున్నారు. మోత్కుల్లికి గవర్నర్ అవకాశం లేనందున, కనీసం రాజ్యసభకయినా పంపాలని అభ్యర్థిస్తున్నారు.

అయితే... ప్రస్తుతానికి రెండు సీట్ల విషయంలో క్లారిటీ వచ్చిందని టీడీపీ వర్గాలు అంటున్నాయి. ఒకటి నిర్మలా సీతారామన్ కు పొడిగింపు కాగా రెండోది చిత్తూరు జిల్లా సత్యవేడు మాజీ ఎమ్మెల్యే హెచ్.హేమలతకు ఇస్తున్నారని చెబుతున్నారు. సో... మిగిలిన నేతలంతా మూడో స్థానం కోసం పోటీపడాల్సి ఉంటుంది. పారిశ్రామికవేత్తలంతా వైసీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే సత్తా ఆధారంగా నాలుగో సీటుకు ప్రయత్నిస్తున్నారు.