Begin typing your search above and press return to search.

బాబు కోట‌లో..మ‌హిళ‌పై దారుణం చూశారా?

By:  Tupaki Desk   |   18 Jan 2018 7:07 AM GMT
బాబు కోట‌లో..మ‌హిళ‌పై దారుణం చూశారా?
X
మొన్నామ‌ధ్య విశాఖ‌లో ఓ ద‌ళిత మ‌హిళ‌ను టీడీపీ కార్య‌క‌ర్త‌లు న‌డిరోడ్డుపై బ‌ట్ట‌లూడిపోయేలా చిత‌క‌బాదిన వైనం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంచ‌ల‌న‌మే అయ్యింది. అయితే ఆ దాడికి దిగిన వ్య‌క్తులు - బాధితురాలి కుటుంబం మ‌ధ్య కొన్నాళ్లుగా న‌డుస్తున్న వివాద‌మే కార‌ణ‌మ‌ని - దానికి పార్టీతో ఏమాత్రం సంబంధం లేద‌ని చెప్పిన టీడీపీ నేత‌లు... ఆ వివాదం నుంచి ఎలాగోలా త‌ప్పించుకున్నారు. అయితే ఈ ఘ‌ట‌న‌ను మ‌రువ‌క‌ముందే... టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు ప్రాతినిథ్యం వ‌హిస్తున్న కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలో అచ్చం అలాంటి ఘ‌ట‌నే చోటుచేసుకుంది. అచ్చం అలాంటి ఘ‌ట‌నే అనే కంటే కూడా... విశాఖ ఘ‌ట‌న కంటే కూడా కాస్తంత దారుణ ఘ‌ట‌న‌గానే కుప్పం ఘ‌ట‌న‌ను చెప్పుకోవాల‌న్న వాద‌న వినిపిస్తోంది. కుప్పం నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని శాంతిపురం మండ‌లం గంజార్ల‌ప‌ల్లిలో నిన్న ప‌ట్ట ప‌గ‌లు చోటుచేసుకున్న ఈ ఘ‌ట‌న కాస్తంత ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. చంద్ర‌బాబు ప‌రువు ప్ర‌తిష్ఠ‌కు తీవ్ర ఇబ్బంది క‌లిగించేదిగా భావిస్తున్న ఈ ఘ‌ట‌న వివ‌రాల్లోకి వెళితే... వైసీపీ సానుభూతిప‌రులుగా ఉన్న భార్యాభ‌ర్త‌ల‌పై తెలుగు దేశం పార్టీకి చెందిన కార్య‌క‌ర్త‌లు విచ‌క్ష‌ణార‌హితంగా దాడికి పాల్ప‌డ్డారు. ఈ దాడిలో భ‌ర్త‌కు గాయాలు కాగా... భార్య‌ను మాత్రం అంద‌రూ చూస్తుండ‌గానే ఓ తెలుగు మ‌హిళ బ‌ట్ట‌లూడ‌దీసేసి అత్యంత కిరాత‌కంగా వ్య‌వ‌హ‌రించార‌న్న ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి.

ఘ‌ట‌న పూర్తి వివ‌రాల్లోకి వెళితే... వైసీపీకి అనుకూలంగా ఉన్న ఉమ‌ - ఆమె భ‌ర్త‌కు అదే గ్రామానికి చెందిన టీడీపీ కార్య‌క‌ర్త‌ భాగ్య‌ల‌క్ష్మితో గ‌త కొంత‌కాలంగా గొడ‌వ‌లు ఉన్నాయ‌ట‌. ఇదే విషయాన్ని ఉమ దంపతులు ఇటీవలి జన్మభూమి కార్యక్రమంలో అధికారుల దృష్టికి తీసుకు వచ్చారు. అయితే ఆ కుటుంబం వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిందంటూ తెలుగు త‌మ్ముళ్లు చెప్ప‌డంతో అధికారులు కూడా ఆ ఫిర్యాదును పెద్దగా పట్టించుకోలేదట‌. ఈ నేపథ్యంలో నిన్న ఉదయం...ఉమ దంపతులు పక్కింట్లోని అవ్వ దగ్గరకు వెళ్తుండగా వారిని చూసిన భాగ్యలక్ష్మి ఉమ్మివేసింది. ఎందుకు ఉమ్మావంటూ ఆ దంపతులు ప్రశ్నించడమే నేరమయ్యింది. రెచ్చిపోయిన భాగ్యలక్ష్మి తన బంధువులతో కలసి వారిపై దాడికి తెగబడింది. అంతే కాకుండా జన్మభూమి కార్యక‍్రమంలో తనపై ఫిర్యాదు చేస్తావా అంటూ ఉగిపోతూ... ఉమను వీధిలోకి లాక్కొచ్చి అందరి ముందే వివస్త్రను చేసేసింది. రాళ్లతో తీవ్రంగా కొట్టింది. నోటితో కొరికి దారుణంగా గాయపరిచింది. అడ్డుకునేందుకు ప్రయత్నించిన భర్తను తెలుగు త‌మ్ముళ్లు చితకబాదారు. స్థానికులు తీవ్రంగా గాయపడిన మహిళను ఆసుపత్రికి తరలించగా - ప్ర‌స్తుతం ఆమె చికిత్స పొందుతోంది.

దాడి అనంత‌రం ఉమ భ‌ర్త తమపై జరిగిన దాడి గురించి రాళ్లబూదుగూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనకు సంబంధించి పలువురిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. మ‌హిళ‌ను ప‌ట్ట‌ప‌గ‌లు న‌డిరోడ్డుపై వివ‌స్త్ర‌ను చేసి హింసించిన ఈ దారుణ ఘటనను వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే రోజా తీవ్రంగా ఖండించారు.

చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోతోందని ఆమె తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాహ‌సీల్దార్‌ వనజాక్షిపై దాడి - కాల్‌ మనీ సెక్స్‌ రాకెట్‌ - విశాఖ జిల్లాలో దళిత మహిళపై దాడి ఘటనలు సిగ్గుచేటు అని అన్నారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు ...చంద్రబాబుకు బౌన్సర్లుగా మారారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇప్పటికైనా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని రోజా డిమాండ్‌ చేశారు. మొత్తంగా ఈ ఘ‌ట‌న ఇప్పుడు పెద్ద వివాదాన్నే రాజేసిన‌ట్లుగా విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి.