Begin typing your search above and press return to search.

కారెక్కిన ఫలితం: సాయన్నకు ఆ పదవి పోయింది

By:  Tupaki Desk   |   2 May 2016 6:20 AM GMT
కారెక్కిన ఫలితం: సాయన్నకు ఆ పదవి పోయింది
X
తెలంగాణ తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యే గా గెలిచిన సాయన్నకు ఉన్న ఒక పదవి పోయింది. సైకిల్ దిగేసి.. కారు ఎక్కేసిన నేపథ్యంలో ఆయనకు ఏపీ ముఖ్యమంత్రి ఇచ్చిన టీటీడీ బోర్డు సభ్యుడి హోదా నుంచి తొలగించినట్లుగా చెబుతున్నారు. అయితే.. ఈ అంశంలో రెండు వాదనలు ఉన్నాయి. విభజన అనంతరం రెండు రాష్ట్రాల సార్వత్రిక ఎన్నికల అనంతరం తెలంగాణ తెలుగుదేశం తరఫున గెలిచిన ఎమ్మెల్యేల్లో సండ్రకు.. సాయన్నకు టీటీడీ బోర్డు సభ్యుడి గా అవకాశం కల్పిస్తూ ఏపీ ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.

అనంతరం సాయన్న తెలంగాణ అధికారపక్షంలో చేరిపోవటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. టీటీడీ పాలక మండలి పరిమితి ముగిసి.. కొత్త పాలక మండలిని ఏర్పాటు చేయాల్సిన సమయంలో చంద్రబాబు పాత మండలిని మరో ఏడాది పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే..పాలక మండలి కాల పరిమితిని ఏడాది పొడిగించినా.. బోర్డు సభ్యుల్లో ఒకరైన సాయన్నను తొలగించినట్లుగా చెబుతున్నారు.

దీనిపై మరో వాదన కూడా వినిపిస్తోంది.ఎప్పుడైతే సైకిల్ దిగేసి.. కారు ఎక్కారో అప్పటి నుంచి సాయన్న టీటీడీ బోర్డు సమావేశాలకు హాజరు కావటం లేదని.. టీటీడీ వ్యవహారాల్లో తల దూర్చటం లేదని చెబుతున్నారు. టీటీడీ పాలకమండలిలో ఉన్న నిబంధనల ప్రకారం.. ముందస్తు సమాచారం ఇవ్వకుండా వరుసగా మూడు సమావేశాలకు హాజరు కాని పక్షంలో సభ్యుడి సభ్యత్వం నుంచి తొలగించే వీలుందని.. టీఆర్ ఎస్ లో చేరిన తర్వాత నుంచి సాయన్న టీటీడీ సమావేశాలకు సమాచారం ఇవ్వకుండానే గైర్హజరీ అవుతున్న నేపథ్యంలో.. టీటీడీ బోర్డు సభ్యుడి హోదానే సాయన్నే తనకు తానుగా వదులుకున్నట్లుగా చెబుతున్నారు. ఈ రెండు వాదనల్ని పక్కన పెడితే.. సాయన్న టీటీడీ బోర్డు సభ్యుడిగా లేరన్న విషయం స్పష్టం కావటంతో పాటు..ఆ అవకాశం మరొకరికి దక్కనున్న విషయం అర్థమవుతంది. మరి.. ఆ అవకాశం ఎవరికి దక్కుతుందో..?