Begin typing your search above and press return to search.

ప్ర‌తిభాభార‌తిని సాగ‌నంప‌నున్న బాబు?

By:  Tupaki Desk   |   15 Jun 2018 7:55 AM GMT
ప్ర‌తిభాభార‌తిని సాగ‌నంప‌నున్న బాబు?
X
తెలుగుదేశం పార్టీలో ఎవ‌రిక‌యినా ప‌ద‌వి ఇవ్వాల‌న్నా, ఎవ‌రి మీద‌యినా చ‌ర్య తీసుకోవాల‌న్నా అధిష్టానం నుండి లీకులు ఇచ్చి, అనుకూల మీడియాలో ప్ర‌చారం చేసి వేటు వేయ‌డ‌మో, వెళ్ల‌గొట్ట‌డ‌మో, ప‌ద‌వి క‌ట్ట‌బెట్ట‌డ‌మో జ‌రుగుతుంది. అయితే చంద్రబాబు అడుగుల‌కు మ‌డుగులొత్తే ఓ మీడియాలో మాజీ స్పీక‌ర్ కావ‌లి ప్ర‌తిభాభార‌తి మీద వ‌స్తున్న క‌థ‌నాలు ఆమెను పార్టీ నుండి చంద్ర‌బాబు సాగ‌నంప‌నున్నాడా ? లేక ఆమె కూతురుకు వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ అడుగుతున్న నేప‌థ్యంలో ఇవ్వ‌కూడ‌ద‌న్న ఉద్దేశంతో వ్య‌తిరేక క‌థ‌నాలు రాయిస్తున్నారా ? అన్న అనుమానాలు త‌లెత్తుతున్నాయి.

1983లో శ్రీ‌కాకుళం జిల్లా రాజాం ఎస్సీ రిజ‌ర్వుడు నియోజ‌క‌వ‌ర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైన ప్ర‌తిభా భార‌తి ఎన్టీఆర్ ప్ర‌భుత్వంలో మంత్రిగా ప‌నిచేశారు. ఆ త‌రువాత 1985లోనూ ఎన్నికై మంత్రిగా ప‌నిచేశారు. ఆ త‌రువాత తిరిగి 1994లో ఎన్నికై మంత్రిగా కొన‌సాగారు. 1999లో ఎన్నిక‌యినా ఆమెను శాస‌న‌స‌భ స్పీక‌ర్ గా ఎంపిక చేసిన చంద్ర‌బాబు ద‌ళిత మ‌హిళ‌ను శాస‌న‌స‌భ చ‌రిత్ర‌లో తొలిసారి స్పీక‌ర్ చేశాన‌న్న క్రెడిట్ తెచ్చుకున్నాడు. అయితే 2014 ఎన్నిక‌ల్లో కేవ‌లం 512 ఓట్ల తేడాతో ప్ర‌తిభా భార‌తి ఓట‌మి చ‌విచూసింది. ప్ర‌తిభా భార‌తి తండ్రి పున్న‌య్య‌, తాత నారాయ‌ణ‌లు కూడా ఎమ్మెల్యేలుగా ప‌నిచేయ‌డం గ‌మ‌నార్హం.

ఈ నేప‌థ్యంలో ప్ర‌స్తుతం ప్ర‌తిభా భార‌తి మీద బాబు అనుకూల మీడియా ఎక్కుపెట్ట‌డం పార్టీలో తీవ్ర చ‌ర్చానీయాంశం అయింది. రెండు సార్లు ఆమె ఓడిపోయినా పార్టీ ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇచ్చింద‌ని, ఆ ప‌ద‌విని పార్టీ బ‌లోపేతం కంటే కొంద‌రి ఆర్థిక బ‌లోపేతానికే ఉప‌యోగ‌ప‌డింద‌ని, పార్టీకి విశ్వాసపాత్రులైన వారికి అటోమాటిక్‌గా ఉన్నత పదవులు లభిస్తాయి.. ఏమాత్రం తేడా చూపించినా రాజకీయ భవిష్యత్తు లేకుండా పోతుందని, ఈ విష‌యం తెలిసినా కొంద‌రు నేత‌ల తీరు మార‌డం లేదంటూ స‌ద‌రు మీడియానే హెచ్చ‌రించ‌డం విశేషం.

1983 నుండి రాజ‌కీయాల్లో ఉన్న ప్ర‌తిభా భార‌తి త‌న కూతురు గ్రీష్మ‌ను త‌న వార‌సురాలిగా తీసుకువ‌చ్చేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తుంది. 2019లో ఆమెకు టికెట్ ఇవ్వ‌డం ఇష్టంలేని టీడీపీ అధిష్టానం అనుకూల మీడియాతో ఆమె పార్టీ బ‌లోపేతానికి కృషి చేయ‌డం లేద‌ని ప్ర‌చారం చేయిస్తుంద‌ని భావిస్తున్నారు. సీనియ‌ర్ల‌ను వ‌దిలేసి ప్ర‌తిభా భార‌తి త‌న కూతురు భ‌విష్య‌త్ గురించే ఆలోచిస్తుందంటూ క‌థ‌నంలో పేర్కొన్నారు. పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు కుమారుడు లోకేష్ ఎక్క‌డా పోటీ చేయ‌కుండా ఎమ్మెల్సీగా ఎన్నికై మంత్రి ప‌ద‌వి అందుకుని పార్టీలో పెత్త‌నం చ‌లాయిస్తున్నాడు. అలాంటిది ప్ర‌త్య‌క్ష్య ఎన్నిక‌ల్లో పోటీ చేసి అసెంబ్లీలో అడుగు పెట్టాల‌ని భావిస్తున్న ప్ర‌తిభా భార‌తి కూతురును అడ్డుకునేందుకు ఇలా మీడియా మొహంతో దాడికి టీడీపీ అధిష్టానం దిగ‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చానీయాంశంగా మారింది.