Begin typing your search above and press return to search.

జంట హత్యలపై కరణం బలరాం తీవ్ర వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   20 May 2017 4:26 AM GMT
జంట హత్యలపై కరణం బలరాం తీవ్ర వ్యాఖ్యలు
X
తెలుగుదేశం పార్టీలో వ్య‌క్తిగ‌త విబేధాలు హ‌త్య‌ రాజ‌కీయాల స్థాయికి చేరాయి. ఇద్ద‌రు ఒకే పార్టీలో ఉన్న‌ప్ప‌టికీ ఆదిప‌త్య పోరు కార‌ణంగా ప్రకాశం జిల్లాలో ఉప్పు నిప్పుగా ఉన్న తెలుగుదేశం ఎమ్మెల్సీ కరణం బలరాం - అదే పార్టీకి చెందిన అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ వర్గాల మధ్య కొనసాగుతున్న ఆధిపత్య పోరు పరాకాష్ఠకు చేరింది. ఫలితంగా శుక్రవారం రాత్రి కరణం బలరాం వర్గానికి చెందిన ఆరుగురిపై ఎమ్మెల్యే గొట్టిపాటి వర్గీయులుగా భావిస్తోన్న 40మంది కాపుకాసి దాడికి పాల్పడ్డారు. దాడిలో ఇద్దరు మృతి చెందగా, నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో ఫిరాయింపు రాజకీయాలు మనుషుల ప్రాణాలు తీస్తున్నాయని తెలుగుత‌మ్ముళ్లే ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

మాజీ ఎమ్మెల్యే కరణం బ‌ల‌రాం వర్గీయుల సమాచారం ప్రకారం తాజాగా కరణం బలరాం వర్గానికి చెందిన గోరంట్ల వెంకటేశ్వర్లు - గోరంట్ల పేరయ్య - గోరంట్ల పెద అంజయ్య - ఏగినాకి ముత్యాలరావు - వీరరాఘవయ్య - ఏగినాకి రామకోటయ్య ఒక పెళ్లికి వెళ్లి తిరిగివస్తుండగా, బల్లికురువ మండలం వేమవరం గ్రామం స్పీడ్‌ బ్రేకర్ వద్ద గొట్టిపాటి వర్గీయులుగా భావిస్తోన్న 40మంది కాపు కాసి కళ్లలో కారం చల్లి మారణాయుధాలతో దాడి చేసి పరారయ్యారు అని కరణం బ‌ల‌రాం వర్గీయులు అంటున్నారు . వీరిలో గోరంట్ల పెద అంజయ్య - ఏగినాకి కోటయ్యలు మృతి చెందగా, మిగిలిన వారి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా దాడిలో తీవ్రంగా గాయపడిన ముత్యాలరావు గతంలో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికి చెందిన క్వారీని అడ్డుకున్నట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. 2004 ఎన్నికల్లో తెదేపా కంచుకోట - బలరాంకు బలమున్న వేమవరం గ్రామంలో పోలింగ్ బూత్‌ కు వచ్చిన గొట్టిపాటి రవిని అడ్డుకుని బయటకు లాగేసిన వారిలో మృతుడు అంజయ్య కూడా ఉన్నారు.

కాగా ఈ ఘ‌ట‌న‌పై క‌ర‌ణం బ‌ల‌రాం తీవ్ర‌స్థాయిలో అసంతృప్తి వ్య‌క్తం చేశారు. తన వర్గీయులపై గొట్టిపాటి వర్గీయులు దాడి చేసిన వైనంపై పార్టీ నాయకత్వ తీరుపై విరుచుకుపడ్డారు. చిలకలూరిపేట ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న తన వర్గీయులను పరామర్శించేందుకు వచ్చిన బలరాం పార్టీ అధినేత - సీఎం చంద్రబాబుకు నేరుగా ప్రశ్నలు సంధించారు. ‘ప్రశాంతంగా ఉన్న మాపై వైకాపా వాళ్లను తీసుకొచ్చి బలవంతంగా రుద్దారు. పార్టీకి పనిచేసిన కార్యకర్తలను వాళ్లు హత్య చేశారు. దీనికి చంద్రబాబు సమాధానం చెప్పాలి. దీనిపై ఆయన ఏమంటారో బాబునే అడుగుతా. చాలాకాలంగా వాళ్లు ఇక్కడ పెత్తనం చేస్తున్నారు. ఈ హత్యాకాండను తీవ్రంగా ఖండిస్తున్నా’ అన్నారు. మ‌రోవైపు అద్దంకి నియోజకవర్గంలో జరిగిన హత్యలు, దాడిపై పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టాన్ని ఎవరు చేతులోకి తీసుకున్నా సహించేది లేదని హెచ్చరించారు.

కాగా, అద్దంకి కేంద్రంగా క‌ర‌ణం బ‌ల‌రాం- గొట్టిపాటి ర‌వికుమార్ వీరిద్దరి మధ్య కొనసాగుతున్న అధిపత్యపోరు అనేకమార్లు టీడీపీ నాయకత్వం దృష్టికెళ్లినా ఫలితం కనిపించలేదు. నాయకత్వం ఎవరినీ నియంత్రించలేకపోయింది. ఫలితంగా వారిద్దరి మధ్య వివాదం కొనసాగుతోంది. వైకాపా నుంచి ఫిరాయించిన గొట్టిపాటి తెదేపాలో చేరి, తమ కార్యకర్తలపై పెత్తనం చేస్తున్నారని కరణం వర్గీయులు కొంతకాలంగా ఆగ్రహంతో ఉన్నారు. జిల్లాస్థాయి పార్టీ సమావేశంలో బహిరంగ వేదికపైనే రెండు వర్గాలు ఘర్షణకు దిగిన విషయం తెలిసిందే. మ‌రోవైపు తాజా పరిణామాలపై అద్దంకిలో భయాందోళన నెలకొంది. కరణం బలరాం వర్గీయులు ప్రతీకారదాడులకు దిగొచ్చన్న ముందస్తు యోచనతో పోలీసులు బందోబస్తు పెంచారు. ప్రధానంగా హత్య జరిగిన వేమవరం గ్రామం వద్ద భారీ పికెట్ ఏర్పాటు చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/