Begin typing your search above and press return to search.

జియో జోరుకు టీసీఎస్ బ్రేకులు

By:  Tupaki Desk   |   22 April 2017 11:10 AM GMT
జియో జోరుకు టీసీఎస్ బ్రేకులు
X
టెలికాం రంగంలో జియోతో సంచ‌ల‌నాలు సృష్టించిన రిల‌యెన్స్‌.. ఇటీవ‌ల మ‌రో ఘ‌న‌తను సొంతం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఇండియాలో అత్యంత విలువైన కంపెనీగా రిల‌యెన్స్ ఇండ‌స్ట్రీస్ నిలిచింది. ఇంత‌వ‌ర‌కు తొలి స్థానంలో ఉన్న టీసీఎస్‌ను ముకేశ్ కంపెనీ వెన‌క్కి నెట్టింది. దేశంలో అత్యంత విలువైన కంపెనీల జాబితాలో టీసీఎస్ మళ్లీ అగ్రస్థానంలో నిలిచింది. శుక్రవారంతో ముగిసిన ట్రేడింగ్ తో టాటా గ్రూప్‌న‌కు చెందిన టీసీఎస్ ఈ రికార్డు తిరిగి కైవ‌సం చేసుకుంది.

శుక్ర‌వారం నాటికి టీసీఎస్ మార్కెట్ విలువ రూ.4,55,405.31 కోట్లగా నమోదైంది. అదే స‌మ‌యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ విలువ 4,55,105.33 కోట్లగా ఉంది. అంటే రిల‌య‌న్స్ కంటే టీసీఎస్‌ 299.98 కోట్లు అధికం. కాగా, గ‌త మంగ‌ళ‌వారం రిల‌యెన్స్ షేరు 1.36 శాతం లాభ‌ప‌డి రూ.1410కి చేరింది. దీంతో కంపెనీ మొత్తం విలువ రూ.4.58 ల‌క్ష‌ల కోట్ల‌కు చేరింది. బీఎస్ఈ ఇంట్రాడేలో రిల‌యెన్స్‌కు ఇదే అత్య‌ధిక స్థాయి. మ‌రోవైపు టీసీఎస్ విలువ మాత్రం రూ.4.56 ల‌క్ష‌ల కోట్ల‌కు ప‌డిపోయింది. ఆ కంపెనీ షేరు ధ‌ర 0.25 శాతం ప‌త‌న‌మై రూ.2315కు చేరింది. ఈ మూడు నెల‌ల్లో రిల‌యెన్స్ షేర్లు 35 శాతం పెర‌గ‌గా.. టీసీఎస్ మాత్రం కేవ‌లం 2 శాతం లాభ‌ప‌డింది.

ఏప్రిల్ నుంచి జియోకి చార్జీలు వ‌సూలు చేస్తామ‌ని రిల‌యెన్స్ ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుంచీ ఆ కంపెనీ షేర్ల ధ‌ర పెరుగుతూ వ‌స్తున్న‌ట్లు నిపుణులు చెబుతున్నారు. 2500 కోట్ల డాల‌ర్ల పెట్టుబ‌డి పెట్టినా.. క‌స్ట‌మ‌ర్ల‌కు ఉచితంగా అన్ని సేవ‌లు అందిస్తుండ‌టంతో చాలా కాలం వ‌ర‌కు జియోపై ఇన్వెస్ట‌ర్లు ఆందోళ‌న వ్యక్తంచేశారు. దీంతో కంపెనీ షేర్లు ప‌తన‌మ‌వుతూ వ‌చ్చాయి. అయితే మార్చి 31నాటికి ఏడు కోట్ల‌కుపైగా క‌స్ట‌మ‌ర్లు జియో పెయిడ్ స‌ర్వీసెస్‌కు ఎన్‌రోల్ చేసుకోవ‌డంతో రిల‌యెన్స్ షేర్లు దూసుకెళ్లాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/