Begin typing your search above and press return to search.

టీసీఎస్, ఇన్ఫీపై అమెరికా ఆగ్ర‌హం

By:  Tupaki Desk   |   24 April 2017 4:35 AM GMT
టీసీఎస్, ఇన్ఫీపై అమెరికా ఆగ్ర‌హం
X
భార‌తీయ ఐటీ దిగ్గ‌జ సంస్థ‌ల‌పై అమెరికా త‌న దాడిని మ‌రింత‌గా పెంచింది. దేశీయ సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థలు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) - ఇన్ఫోసిస్‌ లు హెచ్1బీ వీసా నిబంధనలు ఉల్లంఘించాలయని అమెరికా ప్రభుత్వం ఆరోపించింది. హెచ్1బీ వీసాల జారీని లాటరీ విధానం నుంచి మెరిట్ ఆధారిత పద్ధతికి మారుస్తున్న తరుణంలో ట్రంప్ ప్రభుత్వ యంత్రాంగం ఈ ఆరోపణలు చేసింది. ప్రస్తుత లాటరీ విధానంలో అధిక వీసాలు పొందేందుకు కొన్ని ఐటీ ఔట్‌ సోర్సింగ్ కంపెనీలు కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు దాఖలు చేస్తున్నాయని, తద్వారా డ్రాలో వీసాలు దక్కించుకునే అవకాశాలను భారీగా పెంచుకుంటున్నాయని గతవారం జరిగిన సమావేశంలో ట్రంప్ ప్రభుత్వ అధికారి ఒకరు పేర్కొన్నట్లుగా శ్వేతసౌధం (వైట్‌ హౌజ్) అధికారిక వెబ్‌ సైట్ వెల్లడించింది.

``హెచ్‌-1బీ వీసాలు పొందే టాటా - ఇన్ఫోసిస్‌ - కాగ్నిజెంట్‌ మొదలైన సంస్థల నుంచి వీసాల కోసం అధిక సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. సాధారణంగా ఆ కంపెనీలు పొందాల్సిన దాని కన్నా ఎక్కువ. లాటరీ విధానంలో ఎక్కువ టికెట్లను ఉంచాయి. తద్వారా వీసాల మంజూరులో అగ్రభాగం వాటాను దక్కించుకునేలా వ్యూహం పన్నాయి``అని వైట్‌ హౌస్‌ అధికార వెబ్‌ సైట్‌ లో పోస్ట్‌ చేసింది. కేవలం భారతీయ కంపెనీలనే ప్రస్తావించడంపై కూడా వైట్‌ హౌస్‌ స్పందించింది. హెచ్‌-1బీ వీసాలు పొందే వారిలో టీసీఎస్‌ - ఇన్ఫోసిస్‌ - కాగ్నిజెంట్‌ సంస్థలే మొదటి స్థానంలో ఉన్నాయని అందుకే వాటి పేరునే ప్రస్తావించినట్లు వివరణ ఇచ్చింది. అధిక సంఖ్యలో హెచ్1బీ వీసాలు పొందుతున్న సంస్థల్లో టీసీఎస్ - ఇన్ఫోసిస్ - కాగ్నిజెంట్‌ లదే మెజారిటీ వాటా అని వైట్‌ హౌజ్ పేర్కొంది.

సిలికాన్ వ్యాలీలో పనిచేసే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల సరాసరి వార్షిక వేతనం 1.50 లక్షల డాలర్ల స్థాయిలో ఉండగా.. ఈ మూడు సంస్థలు హెచ్1బీ వీసాపై పనిచేసే వారికి ఏటా 60-65 వేల డాలర్లు మాత్రమే చెల్లిస్తున్నాయని తెలిపింది. శ్వేతసౌధం ఆరోపణలపై స్పందించేందుకు మూడు సంస్థలు తిరస్కరించాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/