Begin typing your search above and press return to search.

సొంత పార్టీ పెట్టుకుంటానంటున్న టీడీపీ ఎమ్మెల్యే

By:  Tupaki Desk   |   20 Sep 2017 1:18 PM GMT
సొంత పార్టీ పెట్టుకుంటానంటున్న టీడీపీ ఎమ్మెల్యే
X
ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిగా ప్ర‌చారం పొంది....టీడీపీ త‌ర‌ఫున గెలిచిన‌ప్ప‌టికీ ఆ పార్టీ ఆయ‌న్ను గుర్తించ‌క..పార్టీని ఆయ‌న గుర్తించ‌క విభిన్న‌మైన ఎజెండాతో ముందుకు సాగుతున్న ఎల్బీన‌గ‌ర్ ఎమ్మెల్యే, ప్ర‌ముఖ బీసీ నేత ఆర్‌.కృష్ణ‌య్య ఒకింత గ్యాప్ త‌ర్వాత వెలుగులోకి వ‌చ్చారు. తెలంగాణ‌లో టీడీపీ ప్ర‌భావం త‌గ్గిపోవ‌డం, ఏపీ సీఎం చంద్ర‌బాబుతో స‌ఖ్య‌త దూర‌మ‌యిన నేప‌థ్యంలో కృష్ణ‌య్య త‌నదారి తాను చూసుకుంటున్నార‌నే ప్ర‌చారం సాగుతోంది. తాజాగా కృష్ణ‌య్య చేసిన ప్ర‌క‌ట‌న సైతం ఇందుకు ఆజ్యం పోస్తోంది.

తిరుప‌తిలో జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం పొలిట్ బ్యూరో సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజ‌రైన జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణ‌య్య‌...ఆ సమావేశం ముగిసిన తర్వాత ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కృష్ణయ్య మాట్లాడుతూ ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. జనాభాలో 50 శాతం పైగా ఉన్న బీసీల డిమాండ్లను ప్రస్తుత రాజకీయ పార్టీలు పట్టించుకోవ‌డం లేద‌ని అన్నారు. అందుకే బీసీల సంక్షేమం కోసం ప్రత్యేకంగా ఒక పార్టీ ఏర్పాటు చేయాలనే అంశాన్ని పరిశీలిస్తున్నామని ఆర్ కృష్ణయ్య వెల్లడించారు. దేశవ్యాప్తంగా 58 శాతం ఉన్న బీసీల రాజ్యాంగపరమైన రాజ్యాధికారం కోసం ఉద్యమించడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో బీసీల సంక్షేమ సంఘాన్ని విస్తరించడం, గ్రామస్థాయి నుంచి జిల్లాల స్థాయి వరకు బీసీ సంఘాలన్నింటినీ ఐక్యం చేయడం వంటి కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించామన్నారు. ఈ నెలాఖరులో కానీ, వచ్చే నెల మొదటివారంలో కానీ అన్ని జిల్లాల్లో బీసీల గర్జన పేరుతో సదస్సులు నిర్వహించాలని, అక్టోబర్ 22న తమ డిమాండ్లపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమం నిర్వహించాలని నిర్ణ‌యించామన్నారు.

జాతీయ సాయిలో 56 శాతం రాజ‌కీయ పరమైన రిజర్వేషన్లు కల్పిం చడానికి రాజ్యాంగపరమైన సవరణలు చేయాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. అన్ని రాజకీయ పార్టీలు బీసీల సంక్షేమం విషయంలో నిర్లక్ష్యంచేస్తూ బీసీలను తమ తమ రాజకీయ అవసరాలకు వినియోగించుకుంటున్నాయ‌ని మండిప‌డ్డారు. తమకు నియోజకవర్గాల వారీగా జనాభా ప్రాతిపదికన సీట్ల కేటాయింపులు చేయని పార్టీలను బీసీల వ్యతిరేక పార్టీలుగా ప్రకటిస్తామన్నారు. అన్నింటినీ మించి తమ సమావేశంలో బీసీల కోసం ప్రత్యేకంగా రాజకీయపార్టీని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన కూడా వచ్చిందని పేర్కొంటూ ఈ అంశంపై విస్తృత స్థాయిలో చర్చిస్తామని, అందరి అభిప్రాయాల ఆధారంగా త్వరలో తగు నిర్ణయం తీసుకుంటామని కృష్ణయ్య స్పష్టంచేశారు.