Begin typing your search above and press return to search.

తెలంగాణ ఇంజనీర్లకు అంత గుస్సా ఎందుకంటే..?

By:  Tupaki Desk   |   29 May 2016 4:43 AM GMT
తెలంగాణ ఇంజనీర్లకు అంత గుస్సా ఎందుకంటే..?
X
రాజకీయం అన్నాక విమర్శలు మామూలే. ఈ క్రమంలో నేతలు చేసే వ్యాఖ్యల్లో అవినీతి గురించి ప్రస్తావించటం.. అధికారుల తీరుపై మండిపడటం లాంటివి చేస్తుంటారు. ఇలాంటి ఘటను ఇప్పటికి ఎన్నో జరిగి ఉంటాయి. కానీ ఎప్పుడూ లేని విధంగా తెలంగాణ ఇంజనీర్ల జేఏసీకి ఆగ్రహం వచ్చేసింది. మహానాడు సందర్భంగా తెలుగుదేశం నేతలు తమపై చేసిన ఆరోపణలకు బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ వారు డిమాండ్ చేయటం ఆసక్తికరంగా మారింది.

మిషన్ కాకతీయ.. మిషన్ భగీరత కార్యక్రమాల్లో అవినీతి చోటు చేసుకుందని.. ఈ పథకాల్లో ఇంజనీర్లు అవినీతికి పాల్పడుతున్నారంటూ తెలుగుదేశం నేతలు విమర్శలు చేయటంపై తెలంగాణ ఇంజనీర్ల జేఏసీ ఆగ్రహం వ్యక్తంచేస్తుంది. తమపై అవాకులు చవాకులు పేలితే సహించేది లేదంటూ స్పష్టం చేయటం గమనార్హం. తమ మీద అవినీతి ఆరోపణలు చేయటం వల్ల తమ ఆత్మస్థైర్యం దెబ్బ తింటుందన్న వారు.. తమకు బహిరంగ క్షమాపణలు చెప్పకుంటే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు.

పలు పథకాల్లో అవినీతి చోటు చేసుకుంటుందని.. అధికారులు సరిగా పని చేయటం లేదని రాజకీయ నేతలు ఆగ్రహం చేయటం మామూలే అయినా.. ఎప్పుడూ లేనిది ఇంజనీర్ల జేఏసీ తమ్ముళ్లపై గుస్సా వ్యక్తం చేయటంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ షురూ చేసిన ఇరిగేషన్ ప్రాజెక్టులలో భారీగా అవినీతి చోటు చేసుకుందంటూ నేతలు.. అధికారులపై తీవ్ర ఆరోపణలు చేసినా.. నాడు స్పందించని ‘‘ఇంజనీర్లు’’ ఇప్పుడు మాత్రం రియాక్ట్ కావటం ఏమిటి? అన్న ప్రశ్న ఇప్పుడు అందరి మదిలో మెదులుతోందని చెప్పక తప్పదు.