Begin typing your search above and press return to search.

కూట‌మి లెక్క తేలింది..ర‌చ్చ మిగిలింది

By:  Tupaki Desk   |   8 Nov 2018 3:47 PM GMT
కూట‌మి లెక్క తేలింది..ర‌చ్చ మిగిలింది
X
డైలీ సీరియ‌ల్‌ను మించిన ఉత్కంఠ‌తో కొన‌సాగిన మ‌హాకూట‌మి సీట్ల పంప‌కం లెక్క తేలింది. అధికార టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కునేందుకు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన కాంగ్రెస్ పార్టీ మిగ‌తా ప‌క్షాల‌తో జ‌ట్టుక‌ట్టి ఏర్పాటుచేసిన ప్ర‌జా కూట‌మి ఎట్ట‌కేల‌కు త‌మ‌న పంప‌కాల ప‌ర్వాన్ని పూర్తి చేసింది. కూట‌మిలోని ఏ పార్టీల్లో ఎవ‌రెవ‌రు పోటీచేయాలో త్వ‌ర‌లో తేల‌నుంది. గురువారం రాహుల్ నివాసంలో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం సుమారు రెండు గంటలపాటు జరిగింది. ఈ భేటీలో కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ మొత్తం 94 స్థానాల్లో పోటీ చేయనుంది. 26 సీట్లను మహాకూటమి భాగస్వామ్య పార్టీలకు కేటాయించింది. ఈ మేరకు ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జ్ ఖుంతియా ప్రకటించారు. 10న ఉదయం తొలి జాబితాను విడుదల చేయాలని కమిటీ నిర్ణయం తీసుకుంది.

టీఆర్ఎస్ పార్టీని ఓడించాలనే ఉమ్మడి ఎజెండాతో జత కట్టిన మహా కూటమి సీట్ల పంపిణీ ఓ కొలిక్కి రాక‌పోవ‌డం, మ‌రోవైపు నామినేషన్ల సమయం దగ్గర పడుతుండటంపై కూటమి భాగస్వామి పార్టీల నేతల్లో గందరగోళం నెలకొంది. ఈ స‌మ‌యంలోనే సీపీఐ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. మహాకూటమిలో సీట్ల సర్దుబాటులో ఆలస్యమవడంతో తాము బరిలోకి దిగే 9 స్థానాలను సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాడా వెంకటరెడ్డి ఇవాళ ప్రకటించారు. మ‌రోవైపు టీజేఎస్ సైతం త‌న‌దారి తాను చూసుకుంటుంద‌నే ప్ర‌చారం జ‌రిగింది. ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్ పార్టీ జాగ్ర‌త్త ప‌డి ఢిల్లీలో స‌మావేశం ఏర్పాటుచేసింది. తాజాగా జ‌రిగిన స‌మావేశం అనంత‌రం వెలువ‌రించిన వివ‌రాల ప్ర‌కారం కాంగ్రెస్ ఎట్ట‌కేల‌కు ఓ నిర్ణ‌యం తీసుకుంది.

మహాకూటమి భాగస్వామ్య పార్టీలకు సీట్ల‌ను కేటాయించింది. దీని ప్ర‌కారం 26 సీట్లలో టీడీపీకి 14 - టీజేఎస్ కి 8 - సీపీఐకి 3 సీట్లను కేటాయించారు. ఒక స్థానం తెలంగాణ ఇంటి పార్టీకి ఇచ్చే అవకాశం ఉంది. ఈ నెల 10న మహాకూటమి మొదటి జాబితా విడుదల కానుంది. 74 మందితో కాంగ్రెస్ తొలి జాబితా విడుదల కానుంది. మిగిలిన 20 మంది జాబితా రెండో జాబితాలో విడుదలవుంది. దీనికోసం ఈ నెల 11 - 12 న మరో విడుత కాంగ్రెస్ సీఈసీ సమావేశం కానుంది సీపీఐకి వైరా, హుస్నాబాద్, బెల్లంపల్లిలను ఖరారు చేసింది. రేపు సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది.