Begin typing your search above and press return to search.

అప్ఝ‌ల్ గురుకు వ‌ర్సిటీ నివాళి..ఘ‌ర్ష‌ణ‌లు

By:  Tupaki Desk   |   12 Feb 2016 1:26 PM GMT
అప్ఝ‌ల్ గురుకు వ‌ర్సిటీ నివాళి..ఘ‌ర్ష‌ణ‌లు
X
అప్ఝల్ గురు...భార‌త సార్వభౌమ‌త్వానికి ప్ర‌తీక‌గా నిలిచే పార్ల‌మెంటుపై దాడిచేసిన ఉగ్ర‌వాది. పార్లమెంటుపై దాడి కేసులో నేరం రుజువైన అప్ఝల్ గురును ఉరితీసిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇటీవ‌ల ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో తిరిగి అప్ఝ‌ల్‌ గురు తెర‌మీద‌కు వ‌చ్చారు! ఆయ‌న‌ను ఉరితీసిన రోజును పురస్కరించుకుని ఢిల్లీ నెహ్రూ యూనివర్సిటీ క్యాంపస్‌ లో ఈ నెల 9న ఓ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. వర్సిటీలో ఏఐఎస్ ఎఫ్ విద్యార్థి విభాగం విద్యార్థులు నిర్వహించిన కార్యక్రమంలో అప్ఝల్ గురు - మక్బూల్ భట్ ల ఉరితీతను న్యాయపరమైన హత్యగా (జ్యుడిషియల్ కిల్లింగ్)గా అభివర్ణించారు. ఇంతే కాకుండా భార‌త ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ పాకిస్థాన్‌ కు అనుకూలంగా పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. అంతేకాకుండా క్యాంపస్ లో అప్ఝల్ గురు చిత్రపటాలను ఉంచారు.

ఈ ఘ‌ట‌న‌పై ఏబీవీపీ ఆందోళ‌న చేసింది. దేశాన్ని వ్యతిరేకిస్తూ పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసిన కేసులో జేఎన్‌ యూ స్టూడెంట్స్ యూనియన్ నాయకులు కనిష్య కుమార్‌ ను అరెస్టు చేయాల‌ని డిమాండ్ చేశారు. దీంతో యూనివర్సిటీ విద్యార్ధి సంఘం అధ్యక్షుడు కనిష్య‌కుమార్‌ ను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. జేఎన్‌ యూలో సోదాలు నిర్వ‌హిస్తున్నారు.

ఇదిలాఉండ‌గా వ‌ర్సిటీవిద్యార్థుల‌కు ఊహించ‌ని మ‌ద్ద‌తు ద‌క్కింది. జవహార్‌ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ విద్యార్థులపై చర్యలు తీసుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని వేర్పాటు వాద నాయకుడు సయ్యద్ అలీ షా గిలానీ హెచ్చరించారు. శ్రీనగర్ లో ఆయన మాట్లాడుతూ.. అప్ఝల్ గురును ఉరి తీసిన రోజు పురస్కరించుకుని ఆ ఉరితీతకు వ్యతిరేకంగా జేఎన్‌ యూలో "శాంతియుతంగా" సభ నిర్వహించుకున్న విద్యార్థులపై "అక్రమంగా కేసులు బనాయిస్తే సహించబోం" అని హెచ్చరించారు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకునే భారత్ లో ప్రజలు తమ హక్కుల గురించి నోరెత్తే స్వేచ్ఛ లేకపోవడం దారుణమన్నారు. ఢిల్లీ జేఎన్ యూలోని కాశ్మీరీ విద్యార్థులపై ఎటువంటి చర్యలు తీసుకున్నా జమ్మూ కాశ్మీర్ లో తీవ్ర పరిణామాలు ఎదుర్కొనవలసి వస్తుందని గిలానీ హెచ్చరించారు.