Begin typing your search above and press return to search.

సుజనాచౌదరిపై స్వామీజీ ఫైర్

By:  Tupaki Desk   |   23 May 2016 11:10 AM GMT
సుజనాచౌదరిపై స్వామీజీ ఫైర్
X
కేంద్రమంత్రి సుజనాచౌదరిపై ఒక స్వామీజీ తన ఆగ్రహాన్నంతా చూపించారు. కేంద్ర మంత్రి స్వాహాపర్వాన్నిబట్టబయలు చేస్తూ విమర్శల వర్షం కురిపించారు. బ్రాహ్మణ వర్గానికి కేటాయించిన నిధులను సుజనా భోంచేసేశారంటూ ఆయన మండిపడ్డారు.

విశాక శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి అంటేనే ఫైర్ బ్రాండ్ అని పేరు. తరచూ రాజకీయాల్లో తలదూర్చి వివాదాస్పదమయ్యే ఆయన ఈసారి కేంద్ర మంత్రి సుజనాపై గురిపెట్టారు. బ్రాహ్మణులకు కేటాయించిన నిధులను మంత్రి - తెదేపా నేతలు - కార్యకర్తలు గుటకాయస్వాహా చేస్తున్నారని ఆయన తీవ్ర ఆరోపణలు గుప్పించారు. అడుగడుగునా బ్రాహ్మణులను వాడుకుని కరివేపాకు మాదిరిగా పారవేస్తున్నారని మండిపడ్డారు. ఓడ ఎక్కేవరకు ఓడ మల్లన్న ఒడ్డుకు చేరాక బోడిమల్లన్న అనే చందంగా కేంద్రమంత్రి సుజనా వ్యవహారిస్తున్న తీరు ఏమీ బాగాలేదని ఆయన డైరెక్టుగా ఎండగట్టేశారు.

500 కోట్లతో బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని టీడీపీ ప్రభుత్వం చెప్పినా ఆ తరువాత హ్యాండిచ్చిందని మండిపడిన ఆయన నామమాత్రపు నిదులతో బ్రాహ్మణులను చిన్నచూపు చూశారని ఆరోపించారు. ఇచ్చిన కొద్దిపాటి నిదులను కూడా కేంద్ర మంత్రి సుజనా మింగేశారని అంటున్నారు.

అక్కడితో ఆగని స్వామీజీ బ్రాహ్మణులపై టీడీపీ ప్రభుత్వం కత్తికట్టింన్నట్లుగా మాట్లాడారు. బ్రాహ్మణులపై టీడీపీ ప్రభుత్వానికి, చంద్రబాబుకు ఎందుకంత వ్యతిరేకత అని ప్రశ్నించారు. ఆలయాల్లో అర్చకులతో గొడ్డు చాకిరీ చేయించుకుంటున్నారని... జీతాలు మాత్రం సక్రమంగా ఇవ్వడం లేదని ఆరోపించారు. ఏపీలోని మున్ముందు ఇదే పరిస్థితి కొనసాగి బతకలేని పరిస్థితులు వస్తే తాను హిమాలయాలకు వెళ్లిపోతానని అన్నారు.