Begin typing your search above and press return to search.

తెలుగు ప్రజలు ‘భూతాన్ని’ పూజిస్తున్నారా?

By:  Tupaki Desk   |   24 Oct 2016 5:07 AM GMT
తెలుగు ప్రజలు ‘భూతాన్ని’ పూజిస్తున్నారా?
X
ఒక్కొక్కరు ఒక్కొక్క విషయాన్ని అమితంగా నమ్ముతుంటారు. అయితే.. ఇలాంటి నమ్మకాలపై దారుణ వ్యాఖ్యలు చేస్తూ కొత్త అలజడిని సృష్టిస్తున్నారు ద్వారక పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి. షిర్డీ సాయి పేరు చెబితేనే ఆగమాగం చేసే ఈ స్వామి.. ఇప్పటివరకూ ఏ స్వామీజీ చేయనంత దారుణమైన వ్యాఖ్యల్ని షిర్డీ సాయిబాబా పేరుతో చేస్తున్నారు. పేరుకు ముస్లిం అయినా.. సాయిబాబాను తమ ఇష్టదైవంగా హిందువులు కొలుస్తుంటారు. షిర్డీకి వెళ్లి పూజించే వారంతా హిందువులే.

అయితే.. సాయిబాబాను ఉద్దేశించి పదే పదే వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లోకి ఎక్కుతున్న స్వరూపానంద సరస్వతి తాజాగా మరోసారి తనదైన వ్యాఖ్యలతో తెగబడ్డారు. ఇటీవల కాలంలో ఆయన చేసిన వ్యాఖ్యలతో షిర్డీ సాయిని పూజించే వారు చాలామంది అభ్యంతరాలు వ్యక్తం చేయటమే కాదు.. ప్రజల నమ్మకాలపై స్వామీజీ చేస్తున్న వ్యాఖ్యల్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు.

ఇప్పటికే అనంతపురం.. కడపలలో ఏర్పాటు చేసిన సభల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన స్వరూపానంద సరస్వతి ఆదివారం హైదరాబాద్ లోని పబ్లిక్ గార్డెన్స్ లో ‘‘గురు వందనం’’ పేరిట ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. షిర్డీ సాయిపై మరోసారి తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఇంట్లో ఒక భూతాన్ని పూజిస్తున్నారని.. సాయి పేరుతో ఒక భూతాన్ని కొలుస్తున్నట్లుగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాము నమ్మిన సాయిబాబా మీద స్వాములోరు చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలపై సాయిబాబా భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వ్యవహారాల మీద మిగిలిన స్వామీజీలు స్పష్టంగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయాల్సిన అవసరం ఏర్పడిందని చెప్పకతప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/