Begin typing your search above and press return to search.

హెచ్‌1బీ వీసాల‌పై కేంద్రం ఇంకో అడుగు వేసింది

By:  Tupaki Desk   |   19 Oct 2017 4:32 AM GMT
హెచ్‌1బీ వీసాల‌పై కేంద్రం ఇంకో అడుగు వేసింది
X
హెచ్‌1బీ వీసాల విష‌యంలో ఇటీవ‌లి కాలంలో నెల‌కొన్న ప‌రిణామాలు ఇబ్బందిక‌రంగా మారిన నేప‌థ్యంలో మ‌న టెకీల‌కు న‌ష్టం జ‌ర‌గ‌కుండా చూసేందుకు కేంద్ర ప్ర‌భుత్వం మ‌రో ముంద‌డుగు వేసింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారుల‌తో క‌లిసి అమెరికాలో వారం రోజుల ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన మంత్రి ఈ సంద‌ర్భంగా అమెరికా ప్ర‌జాప్ర‌తినిధుల‌తో హెచ్‌1బీ వీసాల‌పై ఆర్థిక‌మంత్రి అరుణ్ జైట్లీ చ‌ర్చించిన సంగ‌తి తెలిసిందే. `హెచ్1బీ - ఎల్‌1 వీసాల్లో సంస్క‌ర‌ణ‌లు రావాల్సిందేన‌ని జైట్లీ స్ప‌ష్టం చేశారు. అమెరికా అభివృద్ధికి వాళ్లు చేస్తున్న సేవ‌లు విస్మ‌రించ‌లేనివి. అమెరికా అభివృద్ధికి విశేష కృషి చేసిన ఈ వృత్తి నిపుణుల భాగ‌స్వామ్యాన్ని అమెరికా గుర్తించాలి`` అని కేంద్ర ఆర్థిక మంత్రి నొక్కిచెప్పారు.

దీనికి కొన‌సాగింపుగా విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ మ‌రో ముంద‌డుగు వేశారు. అమెరికా కాంగ్రెస్‌ కు చెందిన చట్టసభ సభ్యుల బృందం భారత్‌ కు రావడంతో వారితో కేంద్ర మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హెచ్‌ 1బీ వీసా అంశం గురించి వారితో ప్రస్తావించారు. వీసాల జారీ విషయంలో అమెరికా వ్యవహరిస్తున్న తీరు పట్ల ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విధానంలో మార్పు రావాలని ఆమె అభిప్రాయపడ్డారని విదేశంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి రవీష్‌ కుమార్‌ ట్విటర్‌ ద్వారా తెలిపారు. కాగా అమెరికా చట్టసభ సభ్యుడు లామర్‌ స్మిత్‌ తొమ్మిది మందితో కూడిన శాస్త్ర - సాంకేతిక - అంతరిక్ష నిపుణుల బృందం భారత్‌ పర్యటనకు వచ్చింది. ఈ సందర్భంగా ఆర్థిక - అంతరిక్ష - శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఇరుదేశాల మధ్య సహాయ సహకారాలు బలపడాలని ఆకాంక్షించినట్లు ఆయన తెలిపారు. కాగా భారత్‌- అమెరికా వ్యూహాత్మక సంబంధాలు మెరుగు పడటంలో అమెరికా సానుకూలంగా స్పందించడాన్ని సుష్మాస్వరాజ్ ప్రశంసించినట్లు ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు.