Begin typing your search above and press return to search.

ఏపీ మంత్రుల్లో తోపులే లేరా?

By:  Tupaki Desk   |   3 Aug 2015 10:15 AM GMT
ఏపీ మంత్రుల్లో తోపులే లేరా?
X
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పనితీరుపై తెలుగుదేశం పార్టీ అంతర్గతంగా చేయించిన సర్వేలో ఘోరమైన ఫలితాలు వచ్చాయి. దీంతో మంత్రుల గుండెల్లో ప్రమాధ ఘంటికలు మోగుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దీన్ని ఎలా తీసుకుంటారో... తమ పదవుల పరిస్థితి ఏమిటో అని వారంతా ఆందోళన చెందుతున్నారు.

ముఖ్యంగా మంత్రుల పనితీరు శాసనభ్యుల పనితీరు కంటే ఏమాత్రం మెరుగ్గా లేదని.... శాసనసభ్యులు ఎలా అయితే తమ నియోజకవర్గానికే పరిమితం అవుతారో మంత్రులూ అదేవిధంగా తమ నియోజకవర్గ స్థాయి దాటి ప్రభావం చూపించలేకపోతున్నారని తేలింది. సంక్షేమ పథకాల అమలులో మంత్రుల నియోజకవర్గాలు దిగదుడుపుగానే ఉన్నాయని సర్వే ఫలితాలు తేల్చినట్లు చెబుతున్నారు.

ప్రతి శాసనసభా నియోజకవర్గంలో 150 నుంచి 200 మందితో మాట్లాడి ఈ సర్వే చేశారు. ఏపీలోని పది జిల్లాల్లోనూ ఈ సర్వే జరిగింది. సర్వే ఫలితాలు కొందరికి పదవీ యోగం తేవొచ్చు... ఇంకొందరికి పదవీ గండంగా మారొచ్చని వినిపిస్తోంది. కీలకమైన మంత్రులు దేవినేని ఉమామహేశ్వర రావు, పత్తిపాటి పుల్లారావు, కె. అచ్చెన్నాయుడుల పరిస్థితి కూడా ఏ మాత్రం బాగా లేదని సర్వేలో తేలినట్లు చెబుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన బావమరిది హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణలకు చాలామంది మంత్రుల కంటే ఎక్కువ మార్కులు వచ్చాయట. కృష్ణా జిల్లాలో ఆబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అక్కడి సీనియర్ మంత్రి దేవినేని ఉమ కన్నా ఎక్కువ మార్కులు కొట్టేసినట్లు చెబుతున్నారు.

పలు జిల్లాలకు సంబంధించి మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై సమాచారం 'తుపాకీ' పాఠకుల కోసం

ఎక్కడ ఎవరు టాప్...

కృష్ణా జిల్లాలో: ఈ జిల్లాలో జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య టాప్ లో ఉండగా కొల్లు రవీంద్ర రెండో స్థానంలో నిలిచారు. దేవినేని ఉమ ఏడో స్థానంలో ఉన్నట్లు సమాచారం.

గుంటూరు జిల్లాలో: ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, శాసనసభ్యుడు ధూళిపాళ్ల నరేంద్ర చౌదరి మంత్రి పత్తిపాటి పుల్లారావు కన్నా మెరుగ్గా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడైన రావెల కిశోర్ బాబు ఆరో స్థానంలో ఉండగా పత్తిపాటి పుల్లారావు పదో స్థానంలో ఉన్నట్లు సమాచారం.

పశ్చిమ గోదావరి జిల్లాలో: ఇక్కడ 15 మంది శాసనసభ్యుల్లో మంత్రి పీతల సుజాత 13వ స్థానం పొందారు.

శ్రీకాకుళం జిల్లాలో: శ్రీకాకుళం శాసనసభ్యురాలు గుండ లక్ష్మీదేవి అగ్రస్థానంలో ఉన్నారు.

కర్నూలు జిల్లాలో: బనగానపల్లె శాసనసబ్యుడు బిసి జనార్దన్ రెడ్డి అగ్రస్థానంలో నిలిచారు.

ప్రకాశం జిల్లాలో : పరుచూరు శాసనసభ్యుడు ఏలూరి సాంబశివ రావు టాప్ లో నిలిచారు.

అనంతపురం జిల్లాలో: హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అగ్రస్థానంలో నిలిచారు.

మొత్తానికి మంత్రుల కంటే ఎమ్మెల్యేలే బాగా పనిచేస్తున్నట్లు ఈ సర్వేలో తేలింది. మంత్రివర్గంలో మార్పులు చేర్పులకు ఈ సర్వే నివేదికను పరిగణనలోకి తీసుకుంటారని సమాచారం. పార్టీలోనూ ఇదే ప్రచారమవుతుండడంతో సీనియర్ మంత్రులు కూడా కాస్త ఆందోళనగానే ఉన్నట్లు తెలుస్తోంది.