Begin typing your search above and press return to search.

కేసీఆర్‌ దే పీఠం...తేల్చిన ప్ర‌తిష్టాత్మ‌క స‌ర్వే

By:  Tupaki Desk   |   9 Nov 2018 5:51 AM GMT
కేసీఆర్‌ దే పీఠం...తేల్చిన ప్ర‌తిష్టాత్మ‌క స‌ర్వే
X
అప‌ద్ద‌ర్మ స‌ర్కారుకు సార‌థ్యం వ‌హిస్తున్న టీఆర్‌ ఎస్ పార్టీకి ఊహించ‌ని భ‌రోసా ద‌క్కిందింది. తెలంగాణలో గులాబీ పార్టీదే ప్రభంజనమని ఇండియా టుడే ప్రసారం చేసిన తాజా సర్వే తేల్చిచెప్పింది. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా.. అధికారపార్టీకి భారీ సానుకూలత కనిపిస్తున్నదని సర్వే వెల్లడించింది. అక్టోబర్ 22 నుంచి నవంబర్ 6వ తేదీ మధ్య తెలంగాణలోని 17 లోక్‌ సభ స్థానాల పరిధిలో పొలిటికల్ స్టాక్ ఎక్స్ చేంజ్ (పీఎస్‌ ఈ) సంస్థ ఈ శాంపిల్ సర్వే నిర్వహించింది. 6,877మంది ఓటర్ల నుంచి ఫోన్ ద్వారా వివరాలు సేకరించింది. ఈ సర్వే వివరాలను గురువారం విడుదల చేశారు. ఏకంగా 75శాతం మంది ప్రజలు టీఆర్‌ ఎస్ వైపే ఉన్నారని - గులాబీ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని వారంతా నమ్ముతున్నారని అందులో స్పష్టమైంది. 44శాతం ఓట్లతో టీఆర్‌ ఎస్ ఘనవిజయం సాధిస్తుందని.. 46శాతం మంది ప్రజలు కే చంద్రశేఖర్‌ రావు మళ్లీ ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నారని సర్వే వెల్లడించింది. మరోవైపు శాసనసభ ఎన్నికలు జరుగుతున్న రాజస్థాన్‌ లో బీజేపీకి గడ్డుపరిస్థితులు నెలకొన్నాయని సర్వేసంస్థ వివరించింది. మధ్యప్రదేశ్ - ఛత్తీస్‌ గఢ్ రాష్ర్టాల్లో బీజేపీ - కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు నెలకొన్నదని పేర్కొన్నది.

డిసెంబర్ 7న జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రసమితి క్లీన్‌ స్వీప్ చేసే అవకాశముందని సర్వే తేల్చింది. 75శాతం మంది ఓటర్లు టీఆర్‌ ఎస్‌ పట్ల సానుకూలంగా ఉన్నారని వెల్లడించింది. కూటమి కట్టినా విపక్షాలను ఓటరు కనీసం ఊసులోకైనా తీసుకోవడం లేదని ఈ శాంపిల్ సర్వే ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణలో టీఆర్‌ ఎస్‌ కు మద్దతుగా బలమైన సానుకూల పవనాలు వీస్తున్నాయి. సామాజిక- సంక్షేమ కార్యక్రమాలకు తోడు అన్నివర్గాల ప్రజల్లో కేసీఆర్ పట్ల ఉన్న విశేష ఆదరణ అధికారపార్టీకి ఉపయోగపడుతున్నది. 75శాతం మంది ఓటర్లు గులాబీ పార్టీ పట్ల సానుకూలంగా ఉన్నారు అని సర్వే పేర్కొన్నది. రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలన్న కేసీఆర్ నిర్ణ యం.. విపక్షాలపై కోలుకోలేని దెబ్బ కొట్టిందని, ఆ శరాఘాతం నుంచి ప్రతిపక్ష పార్టీలు ఇంకా పూర్తిగా తేరుకోలేకపోయాయని సర్వే సంస్థ వ్యాఖ్యానించింది.

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. 44 శాతం ఓటర్లు టీఆర్‌ ఎస్ ఘన విజయం సాధిస్తుం దని అభిప్రాయపడగా, 22శాతం మంది ఓటర్లు ఎవరికి ఓటేయాలో ఇంకా ఒక నిర్ణయానికి రాలేదని తెలిపారు.

మ‌రోవైపు విప‌క్షాల‌కు ఊహించ‌ని చేదు వార్త‌ను అందించింది. తెలంగాణలో విపక్షాలు కూటమిగా ఏర్పడినా పెద్దగా ప్రయోజనం లేదని సర్వే వెల్లడించింది. తెలుగుదేశం పార్టీతో పొత్తు ఎలాంటి అదనపు ఓట్లను రాబట్టకపోగా - అది కాంగ్రెస్‌ కు నష్టం చేకూరుస్తుందని పేర్కొన్నది. టీడీపీ అధినేత చంద్రబాబును ఇప్పటికీ కుట్రదారుగానే తెలంగాణ ప్రజలు చూస్తున్నందున, ఆ పార్టీతో కలయిక కారణంగా కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజల తిరస్కరణకు గురయ్యే ప్రమాదముందని అత్యధికులు అభిప్రాయపడినట్లు పీఎస్‌ ఈ తెలిపింది. హైదరాబాద్‌ లో కాస్తో కూస్తో ఉన్న కాంగ్రెస్ విజయావకాశాలకు అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐ ఎం పార్టీ గండికొట్టే అవకాశముందని పేర్కొన్నది. కాగా, ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి - సంక్షేమ కార్యక్రమాలు ఎట్టిపరిస్థితుల్లోనూ ఆగిపోకూడదని కోరుకుంటున్న ఓటర్లు.. సీట్ల కుంపట్లలో కొట్టుమిట్టాడుతున్న మహాకూటమిని తిరస్కరిస్తున్నారని టీఆర్ ఎస్ వ‌ర్గాలు ఈ స‌ర్వేను విశ్లేషిస్తున్నారు.