Begin typing your search above and press return to search.

ప్రభు దయతో ఏపీకి మూడు కొత్త రైళ్లు

By:  Tupaki Desk   |   30 Jun 2016 7:04 AM GMT
ప్రభు దయతో ఏపీకి మూడు కొత్త రైళ్లు
X
కొన్ని నిర్ణయాలు ఎంతగా లాభిస్తాయన్నది కాలమే సమాధానం చెబుతుంది. రాజ్యసభ సీటును రైల్వే మంత్రి సురేశ్ ప్రభుకు కేటాయించిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దూరదృష్టి ఏపీకి ఎంత లాభంగా మారిందన్నది తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. మొన్నటికి మొన్న.. సికింద్రాబాద్ నుంచి ఏపీ రాజధాని విజయవాడకు సూపర్ ఫాస్ట్ ట్రైన్ ను వాయువేగంతో పట్టాల మీదకు తీసుకొచ్చిన రైల్వే మంత్రి తాజాగా ఏపీకి మరో మూడు కొత్త రైళ్లను కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవటం విశేషం.

ఏపీ రాజధానికి రాయలసీమ ప్రజలు రావటానికి వీలుగా ఒక రైలు ఏర్పాటు చేయాలన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వినతిని రైల్వే మంత్రి ఓకే అనటమే కాదు.. ఆ దిశగా రైల్వే అధికారులు యుద్ధ ప్రాతిపదికన పనులుచేస్తునారు. ప్రస్తుతానికి వారంలో మూడుసార్లు నడిచే ఈ రైలు విజయవాడ – ధర్మవరం మధ్యన నడవనుంది. త్వరలోనే ఈ ట్రైన్ ను స్టార్ట్ చేస్తున్నట్లు చెబుతున్నారు.

దీంతో పాటు.. ఏపీ రాజధాని నుంచి దేశ రాజధాని న్యూఢిల్లీకి ఒక ట్రైన్ ను ఏర్పాటు చేయాలన్న డిమాండ్ పైనా రైల్వే మంత్రి సానుకూలంగా స్పందించి.. ఓకే చేసేశారు. వారంలో ఒక్కరోజు మాత్రమే నడిచే ఈ రాజధాని ఎక్స్ ప్రెస్ త్వరలోనే పట్టాల మీదకు ఎక్కనుంది.

ఇదిలా ఉంటే.. విశాఖపట్నం నుంచి విజయవాడకు నిరంతరం రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు వీలుగా డబుల్ డెక్కర్ రైలును నడపాలన్న నిర్ణయాన్ని రైల్వే శాఖ తీసుకుంది. ఇప్పటికే ట్రయల్ రన్ పూర్తి చేసిన నేపథ్యంలో.. మరికొన్ని అనుమతులు వచ్చిన వెంటనే.. ఈ రైలు కూడా నడుస్తుందని చెబుతున్నారు. రానున్న కొద్ది రోజుల్లోనే ఈ మూడు రైళ్లు ఏపీ రాజధాని విజయవాడ నుంచి పట్టాల మీద పరుగులు పెట్టనున్నాయ్. రాజ్యసభ సభ్యత్వం ఏమో కానీ.. ఏపీ మీద ప్రభు దయ బాగానే ఉందని చెప్పక తప్పదు.