Begin typing your search above and press return to search.

కిరణ్ కుమార్ రెడ్డి నిర్ణయం కంప్లీట్ రాంగ్: సుప్రీం

By:  Tupaki Desk   |   21 April 2017 7:18 AM GMT
కిరణ్ కుమార్ రెడ్డి నిర్ణయం కంప్లీట్ రాంగ్: సుప్రీం
X
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో అప్పటి ప్రభుత్వం చేపట్టిన నలుగురు సమాచార కమిషనర్ల నియామకం చెల్లదంటూ సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఆ నలుగురు విధుల నుంచి వెంటనే తప్పుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. వర్రి వెంకటేశ్వర్లు - ఇంతియాజ్‌ అహ్మద్‌ - తాంతియా కుమారి - విజయ నిర్మల లను సమాచార కమిషనర్లుగా నియమిస్తూ అప్పటి కిరణ్‌ కుమార్‌ రెడ్డి ప్రభుత్వం 2013 ఫిబ్రవరి 6న జీవో నెంబర్‌ 75 జారీ చేసింది. ఆ నియామకాల్ని సవాల్‌ చేస్తూ పద్మనాభయ్య - పద్మనాభ రెడ్డి - డాక్టర్‌ రావు చెలకాని 2013 మార్చ్‌ 25న హైకోర్టు ను ఆశ్రయించారు. 2013 సెప్టెంబర్‌ లో జీవో ను రద్దు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ నలుగురు కమిషనర్లు సుప్రీంకోర్టులో ప్రత్యేక సెలవు పిటిషన్లు దాఖలు చేశారు. 2013 అక్టోబర్‌ లో సుప్రీంకోర్టులో జరిగిన విచారణలో సుప్రీంకోర్టు హైకోర్టు ఆదేశాలపై స్టే విధించింది. అప్పటి నుంచి సుప్రీంకోర్టులో విచారణ ఉన్న నేపథ్యంలో …. తాజాగా జరిగిన తుది విచారణలో నలుగురు కమిషనర్లు రాజకీయ పార్టీలతో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉన్నారని విజయ నిర్మల మినహా మిగతా ముగ్గురు బార్‌ కౌన్సిల్‌ లో సభ్యులుగా ఉన్నారని అది ఆర్టీఐ చట్టానికి విరుద్ధమని పిటిషనర్లు తరఫు న్యాయవాది రామవరం చంద్ర శేఖర్‌ రెడ్డి వాదించారు. ఈ వాదనలతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జగదీశ్‌ సింగ్‌ కెహర్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఏకీభవించింది. 2013 లో చేపట్టిన నియామకాలకు మరో పది నెలల్లో పదవీ కాలం ముగియనుందని అందువల్ల వారిని కొనసాగేందుకు అనుమతివ్వాలని కమిషనర్ల తరఫున వాదనలు వినిపించిన గురు క్రిష్ణస్‌ కుమార్‌ చేసిన అభ్యర్థనను ధర్మాసనం తోసి పుచ్చింది. నలుగురు సమాచార హక్కు కమిషనర్లు వెంటనే విధుల నుంచి తప్పుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.

సుప్రీంకోర్టు వెంటనే విధులనుంచి తప్పుకోవాలని ఆదేశించిన నలుగురు కమిషనర్లకు రాజకీయ సంబంధాలున్నాయి. విజయ నిర్మల నూజివీడు నియోజకవర్గం నుంచి 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కాగా ఇంతియాజ్‌ అహ్మద్‌ చిత్తూరు జిల్లా పీలేరు నుంచి 2009లో కిరణ్ రెడ్డిపైనే పోటీ చేసి ఓడిపోయారు. మిగిలిన ఇద్దరు కాంగ్రెస్‌ పార్టీలో చాలా కాలంగా పనిచేస్తున్నారు. 2011 డిసెంబర్‌ లో ప్రిన్సిపల్‌ సెక్రటరీ జన్నత్‌ హుస్సేన్‌ ఎనిమిది మంది పేర్లను కమిషనర్లుగా అప్పాయింట్‌ చేయమని గవర్నర్‌ కి ప్రతిపాదనలు పంపారు. ఎనిమిది మందిలో నలుగుర్ని నియమించి, ఈ నలుగురు పేర్లను వెనక్కి తిప్పి పంపారు. ఆర్టీఐ చట్టం ప్రకారం వారి అర్హత సందేహముందని గవర్నర్‌ కార్యాలయం సైతం అభిప్రాయపడింది.

అయితే... ప్రభుత్వం ఆరు నెలల తర్వాత ఇవే నలుగురు పేర్ల జాబితా గవర్నర్‌ కి పంపింది. గవర్నర్‌ నలుగుర్ని నియమిస్తూ జీవో విడుదల చేశారు. కమిటీ సమావేశం కాకుండా పత్రికల్లో ప్రకటన ఇవ్వకుండా నలుగురి నియామకం చేపట్టడం చట్ట విరుద్దమని వాటిని సవాల్‌ చేసిన పిటిషనర్లు వాదించారు. ఆర్టీఐ చట్టం ప్రకారం రాజకీయ సంబందాలు ఉన్న వారు కమిషనర్లుగా అనర్హులని వాదించారు. విజయ నిర్మల మినహా ముగ్గురు బార్‌ కౌన్సిల్‌ లో సభ్యులుగా ఉన్నారు. బార్‌ కౌన్సిల్‌ లో సభ్యత్వాన్ని రద్దు చేసుకోవాలని హైకోర్టు ఇచ్చిన తీర్పులోనూ పేర్కొంది. రాజకీయ పార్టీలకు రాజీనామా చేసినట్లుగానీ, బార్‌ కౌన్సిల్‌ సభ్యత్యం రద్దు చేసుకున్నట్లు ఆధారాలు చూపాల్సి ఉంటుంది. ”పార్టీలకు రాజీనామా చేసినట్లు , బార్‌ కౌన్సిల్‌ రద్దు చేసుకున్నట్లు సాక్ష్యాలు ఉన్నాయా” అని ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు. వెంటనే పదవుల నుంచి తప్పుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/