Begin typing your search above and press return to search.

సింగూరు దెబ్బ.. అమరావతి గుండె గుభేల్‌!

By:  Tupaki Desk   |   31 Aug 2016 2:04 PM GMT
సింగూరు దెబ్బ.. అమరావతి గుండె గుభేల్‌!
X
అమరావతి ప్రాంతంలో రైతుల ఇష్టానికి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం భూములు సేకరించడం అంటూ జరిగి ఉంటే గనుక.. దానికి ఇప్పుడు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందా? అమరావతి ప్రాంత రైతులకు కూడా ఇప్పటికి ఇచ్చిన పరిహారాన్ని కూడా వదిలేసుకుని - మళ్లీ భూముల్ని కూడా తిరిగి అప్పగించాల్సిన ఆవశ్యకత ఏర్పడుతుందా? ఏమో తాజాగా సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో పరిణామాల్ని అంచనా వేసినప్పుడు అలాంటి భయాలే తెలుగుదేశం వారికి రేకెత్తుతున్నాయి. ఇవాళ వెలువడిన సుప్రీం కోర్టు తీర్పు అమరావతి గుండెల్లో బాంబు పేలినట్లేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

టాటాకార్ల సంస్థ నానో కార్ల ఉత్పత్తి కోసం పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం సేకరించి ఇచ్చిన 997 ఎకరాల భూమి విషయంలో బుధవారం సుప్రీం కోర్టు తీర్పు వెలువడింది. సింగూరు భూములను టాటా కార్ల సంస్థకు కేటాయించే వ్యవహారం అప్పట్లో చాలా పెద్ద వివాదంగా మారింది. 2006 లో ఈ భూములు కేటాయించారు. అప్పటినుంచి న్యాయస్థానం వద్ద కేసు నడుస్తోంది.

తాజాగా ఈ విషయంలో సుప్రీం కోర్టు తీర్పు వెలువడింది. మొత్తం 997 ఎకరాలను తిరిగి రైతులకు ఇచ్చేయాల్సిందే అంటూ కోర్టు తీర్పు ఇవ్వడం విశేషం. అలాగే.. అప్పట్లో భూములను ప్రభుత్వం సేకరించినప్పుడు వారికి చెల్లించిన పరిహారాన్ని ఇప్పుడు తిరిగి ముట్టజెప్పవలసిన అవసరం కూడా లేదని సుప్రీం కోర్టు తీర్పులో పేర్కొంది. నిజానికి ప్రభుత్వాలు రైతులనుంచి భూములు సేకరించి కార్పొరేట్‌ కంపెనీలకు కట్టబెట్టే వ్యవహారాలకు ఈ తీర్పు ఒక పెద్ద గుణపాఠం లాగా చెప్పుకోవాలి.

అయితే అమరావతి భూసేకరణకు సంబంధించి రేగుతున్న వివాదాలకు ఈ తీర్పుకు ఏమైనా సంబంధం ఉంటుందా అనేది ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వానికి గుబులెత్తిస్తున్న సంగతి. దీనికి సంబంధించి న్యాయనిపుణుల సలహాలు తీసుకునే పనిలో ఉన్నతాధికారులు ఉన్నట్లుగా తెలుస్తున్నది. అమరావతి భూములను కూడా తిరిగిచ్చేయాలని, పరిహారాలు కూడా వెనక్కు తీసుకోరాదనేలా తీర్పే గనుక వచ్చిందంటే.. ఇక చంద్రబాబు ప్రభుత్వం కంగారెత్తిపోవాల్సిందేనని పలువురు అంచనా వేస్తున్నారు. న్యాయనిపుణుల విశ్లేషణల కోసం ఎదురుచూస్తున్నారు.