Begin typing your search above and press return to search.

కోర్టులో కేసు..20ల‌క్ష‌ల‌ మందికి కేసీఆర్ న‌ష్టం

By:  Tupaki Desk   |   19 Sep 2018 4:30 PM GMT
కోర్టులో కేసు..20ల‌క్ష‌ల‌ మందికి కేసీఆర్ న‌ష్టం
X
తెలంగాణ అప‌ద్ద‌ర్మ ముఖ్య‌మంత్రి - టీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌ కు ముంద‌స్తు ఎన్నిక‌ల ద్వారా వ‌చ్చిప‌డిన చిక్కుముడుల ప‌రంప‌ర కొన‌సాగుతోంది. ఓవైపు పార్టీలో టికెట్ల కేటాయింపుతో గులాబీ పార్టీకి ముళ్లు గుచ్చుకుంటుంటే...మ‌రోవైపు ఈ ప్ర‌క్రియ‌పై విప‌క్షాలు ఎదురుదాడిని ష‌రామామూలుగానే కొన‌సాగిస్తున్నాయి. ఇది చాలద‌న్న‌ట్లుగా...కోర్టు కేసులు కూడా వ‌చ్చి చేరుతున్నాయి. తాజాగా ముంద‌స్తుతో లింక్ ఉన్న ఓ కేసు ఏకంగా దేశ స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానానికి చేరింది. రాష్ట్రంలో గడువు కంటే ముందే ఎన్నికలు నిర్వహించడం వల్ల పౌరులకు నష్టమని పేర్కొంటూ సిద్ధిపేటకు చెందిన పోతుగంటి శశాంక్‌ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. రాష్ట్రంలో అత్యవసర పరిస్థితి - రాజకీయ సంక్షోభం లేకపోయినా... కేవలం రాజకీయ పరమైన లబ్ధి కోసమే రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు సిద్ధమైందని పిటిషనర్‌ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశాలను దృష్టిలోకి తీసుకుని తెలంగాణలో గవర్నర్‌ పాలన విధించాలని కోరారు.

ముంద‌స్తు ఎన్నిక‌ల‌పై హైకోర్టులో పిటిష‌న్ వేసిన మ‌రుస‌టి రోజే సుప్రీంకోర్టును సైతం ఇదే వివాదంతో మ‌రో వ్య‌క్తి ఆశ్ర‌యించారు. తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఓటర్ల జాబితా సవరణలు పూర్తికాలేదని - అర్హులైన లక్షలాది మంది ఓటర్ల పేర్లు గల్లంతయ్యాయని - అందుకే ముందస్తు ఎన్నికలను నిలపాలని కొమ్మిరెడ్డి విజయ్ వ్యక్తి హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు పిటిషన్‌ ను కొట్టేసింది. ఎన్నికల కమిషన్‌ కు విశేష అధికారాలు ఉంటాయని - ఎన్నికలు ఎలా నిర్వహించాలో ఎన్నికల సంఘం చూసుకుంటుందని - ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు పేర్కొంది. అయితే హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ శ‌శాంక్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. తెలంగాణలో సాధారణ ఎన్నికల సమయానికి దాదాపు 20లక్షల మందికి పైగా యువత ఓటుహక్కు పొందేందుకు అవకాశముంటుందని... ముందస్తు ఎన్నికల వల్ల వారంతా ఓటుహక్కు కోల్పోయే ప్రమాదం ఉందని పిటిషనర్‌ పేర్కొన్నారు. ఇది రాజ్యాంగం కల్పించిన హక్కును కాలరాసే విధంగా ఉందన్నారు.

టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌ల‌ను పేర్కొంటూ పిటిష‌న‌ర్ త‌న త‌ర‌ఫున వాద‌న‌లు వినిపించారు. స్వయంగా ముఖ్యమంత్రే.. ఎన్నికల సంఘంతో మాట్లాడిన తర్వాతే ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నామని చెప్పడం అర్థరహితమన్నారు. ఫలానా సమయంలో ఎన్నికలు జరుగుతాయని, మళ్లీ తానే ముఖ్యమంత్రి అవుతానని చెప్పడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని పిటిషన్‌ లో పేర్కొన్నారు. దీనికి తోడుగా తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం లేదని - పూర్తిస్థాయి మెజార్టీ ఉన్న ప్రభుత్వమే అధికారంలో ఉందని సుప్రీం దృష్టికి తీసుకెళ్లారు. అందుకే సార్వత్రిక ఎన్నికలతో పాటే తెలంగాణలో ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని.. అప్పటివరకు గవర్నర్‌ పాలన అమల్లో ఉండటం వల్ల ఎన్నికల ప్రక్రియ సజావుగా జరుగుతుందని పిటిషనర్‌ అభిప్రాయపడ్డారు.