Begin typing your search above and press return to search.

టీడీపీ ఖాళీ అవుతుండడం వెనుక ఆయన హ్యాండ్!

By:  Tupaki Desk   |   27 Jun 2019 5:27 AM GMT
టీడీపీ ఖాళీ అవుతుండడం వెనుక ఆయన హ్యాండ్!
X
తెలుగుదేశం పార్టీ అత్యంత గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. నాయకులంతా బీజేపీ బాట పడుతున్నారు. ఇప్పటికే ఎంపీలు నలుగురు బీజేపీ అగ్రనాయకత్వంతో మాట్లాడుకుని ఆ పార్టీలో చేరిపోగా ఏపీలో ఎమ్మెల్యేలు - ఇతర పదవుల్లో ఉన్నవారు - జిల్లా స్థాయి నాయకులను కూడా పెద్ద ఎత్తున బీజేపీలో చేర్చుకునే పనిలో బీజేపీ నిమగ్నమైనట్లుగా తెలుస్తోంది. ఈ బాధ్యతనంతా ఆ పార్టీకి చెందిన కీలక వ్యూహకర్త సునీల్ దేవధర్ భుజాన వేసుకున్నారు. గత ఏడాది కాలంగా ఏపీ బీజేపీ వ్యవహారాలను చూస్తున్నది ఆయనే. 2018 జులై చివరి వారంలో ఏపీ బీజేపీ వ్యవహారాల సహాయ ఇంచార్జిగా ఆయన నియమితులయ్యారు. ఇంచార్జిగా కేరళకు చెందిన మురళీధరన్‌ ను నియమించినా ఆయన పెద్దగా చేసిందేమీ లేదు. సునీల్ కూడా ఎన్నికలకు ముందు ఏపీపై దృష్టిపెట్టలేదు. ఆ స్వల్ప కాలంలో ఏమీ చేయలేం కాబట్టి ... అనవసరంగా అక్కడ తమకు అనుకూలంగా ఉన్న వైసీపీ విజయావకాశాలకు నష్టం రాకుండా బీజేపీ సైలెంటుగా ఉండిపోయింది. అయితే... ఇప్పుడు ఎన్నికల తరువాత బీజేపీ విస్తరణ పనులు మొదలుపెట్టింది. ఇందుకోసం సునీల్ తన గత అనుభవాన్ని పూర్తిగా ఉపయోగించుకుంటున్నారు. ఇంతకుముందు త్రిపురలో బీజేపీని అధికారంలోకి తేవడానికి కారణమైన ఆయన ఇప్పుడు అదే ఫార్ములాను ఏపీలోనూ అమలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మహారాష్ట్రకు చెందిన సునీల్ దేవధర్‌ వ్యూహాలు గతంలో సక్సెస్ కావడంతో ఇప్పుడు టీడీపీని ఆయన ఖాళీ చేసి బీజేపీని బలీయం చేయడం గ్యారంటీ అని వినిపిస్తోంది.

సునీల్... ఇసుకలోంచి నూనె తీసినట్లుగా. ఇతర పార్టీల కంచుకోటల నుంచి కూడా బీజేపీకి ఓట్ల వర్షం కురిపించగల సమర్ధుడు. పైగా వేరే రాష్ట్రంలో పని కదా అని అప్పుడప్పుడు వచ్చి వెళ్లే రకం కాదీయన... ఏకంగా తనకు అప్పగించిన స్టేట్లో తిష్ఠవేసి.. అక్కడి తిండి అలవాటు చేసుకుని - అక్కడి భాషే నేర్చుకుని మరీ అదే మాట్లాడుతూ తన యాక్షన్ ప్లాన్ మొదలుపెడతాడు. అందుకే చంద్రబాబులో భయం మొదలైంది.

సునీల్ దేవధర్ పేరు మొన్నటి త్రిపుర ఎన్నికలతో బాగా పాపులర్ అయింది. దశాబ్దాలుగా సీపీఎం పాలనలో ఉన్న త్రిపురలో అంతకుముందు బీజేపీ డిపాజిట్లు సాధిస్తేనే పెద్ద గొప్పలా ఉండేది. అలాంటిది.. ఏకంగా అక్కడ అధికారం కొల్లగొట్టేలా చేశారు సునీల్. 2013లో త్రిపురలో 50 చోట్ల బీజేపీ పోటీ చేస్తే ఒకే ఒక చోట డిపాజిట్ దక్కింది. కానీ.... 2014కి వచ్చేసరికి మొత్తం త్రిపుర బీజేపీ చేతుల్లోకి వచ్చేసింది. దీని వెనుక ఉన్నది సునీలే. ఎన్నికలకు 500 రోజుల ముందు నుంచి త్రిపురలోనే తిష్ట వేశారాయన. అక్కడి ప్రజలు మాట్లాడే ప్రధాన భాషలతో పాటు గిరిజన భాషలూ నేర్చేసుకున్నారు. స్టెప్ బై స్టెప్ తన ప్లాన్ అమలు చేసి ఎవరూ ఊహించని రీతిలో బీజేపీకి అధికారం అందించారు.

అయితే.. సునీల్ చరిత్ర అక్కడే మొదలవ్వలేదు. అంతకుముందు కూడా అన్నీ అలాంటి టఫ్ టాస్క్‌ లే. 2014లో మోదీ పోటీ చేసిన వారణాసి నియోజకవర్గానికి సునీలే ఇంఛార్జి . మోదీ ఏరికోరి ఆయన్ను పెట్టుకున్నారు.

అంతేకాదు... మహారాష్ట్రలో 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు తొలుత 32 నియోజకవర్గాల బాధ్యత అప్పగించారు. కానీ.. అమిత్ షా ఆ రాష్ట్రంలో పర్యటించినప్పుడు సునీల్ ను ఆ బాధ్యత నుంచి తప్పించి ఏజెన్సీ ప్రాంతమైన పాల్గఢ్ జిల్లాలోని దహానూ నియోజకవర్గంలో బీజేపీ గెలుపుకోసం పనిచేయాలని సూచించారు. మహారాష్ట్రంలో సీపీఎం చేతిలో ఉన్న ఏకైక నియోజకవర్గమది. ఆ ఎస్టీ నియోజకవర్గంలో అంతవరకు బీజేపీ ఎప్పుడూ గెలవలేదు. కాంగ్రెస్ - కమ్యూనిస్టులే గెలుస్తూ వస్తున్నారు. అమిత్ షా సూచనతో అక్కడికి వెళ్లిన సునీల్ దహానూ నియోజకవర్గాన్ని బీజేపీ పరం చేయగలిగారు.

అంతకుముందు 2012లో గుజరాత్‌ లో మోదీ మూడోసారి ముఖ్యమంత్రి పదవిని అందుకునే ప్రయత్నంలో జరుగుతున్న ఎన్నికలు. ప్రభుత్వంపై వ్యతిరేకత కనిపిస్తోంది.. ఎలాగైనా గెలవాలన్నది మోదీ లక్ష్యం. ఆ క్రమంలోనే దహోడ్ జిల్లాను సునీల్ కుఅప్పగించారు. అక్కడ ఆరు నియోజకవర్గాలుంటే కేవలం ఒక్కరే బీజేపీ ఎమ్మెల్యే - మిగతా అయిదుగురూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. కానీ.. సునీల్ ఆ జిల్లాలో సీను మార్చేశారు. ఆరులో మూడు చోట్ల బీజేపీ అభ్యర్థులను గెలిపించారు.

ఇలాంటి స్ట్రాంగ్ ట్రాక్ రికార్డున్న సునీల్ దేవధర్‌ ను ఏపీలో ప్రయోగిస్తుండడంతో ఆయన్ను ఎలా ఎదుర్కోవాలా అని చంద్రబాబు బుర్రకు పదును పెడతున్నారట. ఎన్నికల వ్యూహాల్లో దిట్ట అయిన సునీల్ ఏపీ బీజేపీ నేత రాంమాధవ్ కు సన్నిహితుడు కూడా. అంతేకాదు.. సోషల్ మీడియాలో ఆయన కింగ్. దీంతో సునీల్ దేవధర్ పేరు వినగానే చంద్రబాబు భయపడుతున్నారట.