Begin typing your search above and press return to search.

సుజనా - అశోక్ ఏరీ? ఎక్కడ?

By:  Tupaki Desk   |   24 Feb 2018 6:55 AM GMT
సుజనా - అశోక్ ఏరీ? ఎక్కడ?
X
ఢిల్లీలో ప్రస్తుతం ఏం జరుగుతోంది? పార్లమెంటు లో సమర్పించిన బడ్జెట్ లో రాష్ట్రానికి అన్యాయం జరిగింది. రెండు పార్టీల ఎంపీలూ పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగాను - ఆంధ్రప్రదేశ్ కు న్యాయం జరగాలనే డిమాండ్ తోను పోరాటం సాగించారు. పార్లమెంటు సమావేశాలు ముగిసాయి. తెలుగుదేశం పార్టీ ఎంపీలు సభలో మాట్లాడినందుకు గాను.. పెద్దఎత్తున సన్మానాలు చేయించుకుని - ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి.. రాష్ట్రానికి న్యాయం చేయకుంటే కేంద్ర తాటతీస్తాం అన్నంత రేంజిలో భీషణ ప్రతిజ్ఞలు చేసి ప్రస్తుతం ఇళ్లలో తొంగున్నారు.

మరోవైపు సీఎం చంద్రబాబునాయుడు - మంత్రివర్గం పెద్దలు తదితరులంతా మేం పోరాడేస్తున్నాం.. ప్రత్యేకహోదా తో సహా అన్నీ సాధించేస్తున్నాం కేంద్రాన్ని క్షమించేది లేదు. అన్నీ సాధించేదాకా ఊరుకునేది లేదు లాంటి అనేక మాటలు మాట్లాడుతున్నారు. లోకల్ గా భాజపాను - వైకాపాను కలిపి తిట్టడం తప్ప వారు చేస్తున్నది ఏమీలేదు.

మరి ఢిల్లీలో ఏం జరుగుతోంది. పార్లమెంటు సమావేశాలు ముగిసిన సందర్భంలో.. మీ రాష్ట్రానికి చేయాల్సిందెల్లా లెక్కతేల్చి చెప్పేస్తాం.. రెండు మూడు రోజుల్లో ఏ సంగతి తేలుస్తాం.. అని కేంద్ర ప్రభుత్వంలోని పెద్ద మంత్రులు ప్రకటించారు. కానీ రెండు వారాలకు పైగా గడచిపోయాయి గానీ.. ఇప్పటిదాకా వీసమెత్తు ఫైల్ కదిలినట్లుగా లేదు. ఢిల్లీనుంచి ఎలాంటి సమాచారం లేదు. అక్కడ కేంద్రంలో మన రాష్ట్రం మరియు కేటాయింపులు - బడ్జెట్ అన్యాయం అనే అంశాల గురించి అసలు ఎవరైనా పట్టించుకుంటున్నారో లేదో తెలియదు.

కేంద్రంల నిర్ణయాల వెనుక కీలక పాత్ర పోషించే మోడీ - అమిత్ షాలు ఖాళీగా లేరు. వారు గంట కూడా తీరిక లేనంత బిజీగా ఎన్నికల ప్రచారంలో రోజుకో రాష్ట్రానికి తిరుగుతున్నారు. ఇంత ఒత్తిడి మధ్య వారు ఏపీ గురించి పట్టించుకుంటారనుకోవడం భ్రమ.

తెదేపా కేంద్ర మంత్రుల సంగతేంటి..

ఎంపీలంటే.. పార్లమెంటు ఉన్నప్పుడు ఢిల్లీ వెళ్తారని అనుకుందాం. మరి తెదేపాకు చెందిన కేంద్రమంత్రులు ఏం చేస్తున్నారు. అశోక్ గజపతి - సుజనా ఇద్దరూ ఢిల్లీలో ఉండి ఏం చేస్తున్నట్లు? ఏపీకి సంబంధించిన పరిణామాలు ఏమైనా కదులుతున్నాయో లేదో.. రాష్ట్రప్రజలకు అప్ డేట్ చెప్పవలసిన బాధ్యత తమకుందని వారు అనుకుంటున్నారా? లేదా? అనేది పెద్ద ప్రశ్నగా మారుతోంది. ఈ ఇద్దరు మంత్రులు క్రియాశీలంగా ప్రతి శాఖా మంత్రి వద్దకు వెళ్లి ఎన్నికల ప్రచారానికి వెళ్లే పనిలేకుండా ఢిల్లీలో కూర్చుని ఉండే.. అరుణ్ జైట్లీ వద్దకైనా తరచూ వెళ్లి.. రాష్ట్రం కోసం న్యాయం జరగడానికి ప్రయత్నించాలని ప్రజలు కోరుకుంటున్నారు.