Begin typing your search above and press return to search.

వినండ‌హో..ఏపీలో 3ఏళ్ల‌లో అవినీతే లేదట‌!

By:  Tupaki Desk   |   10 May 2017 5:45 AM GMT
వినండ‌హో..ఏపీలో 3ఏళ్ల‌లో అవినీతే లేదట‌!
X
జాతీయ స్థాయిలో ఇటీవ‌ల ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌రువును గంగ‌పాలు చేసిన ఘ‌ట‌న ఏదైనా ఉందా అంటే అది `అవినీతిలో ఏపీ నంబ‌ర్ వ‌న్` స్థానంలో నిల‌వ‌డం. సుదీర్ఘ‌, స‌మ‌గ్ర విశ్లేష‌ణ చేసిన అనంత‌రమే ఓ సంస్థ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇంత అధ్వాన‌మైన ప‌రిస్థితి ఉంద‌ని తేల్చింది. విప‌క్షాలు అయితే అమ‌రావ‌తి భూ కుంభ‌కోణం, స‌దావర్తి భూముల‌, అగ్రిగోల్డ్ ఆస్తులు, ప్రాజెక్టుల అంచ‌నాల పెంపు, కంపెనీల‌కు భూముల కేటాయింపు...ఇలా ఎన్నో అవినీతి ఉదంతాల‌ను ఆధారాల‌తో స‌హా బ‌ట్ట‌బ‌య‌లు చేశాయి. అయితే వినేవారు ఉంటారు కాబ‌ట్టి ప‌చ్చినిజాన్ని అయినా ప‌క్క‌న పెట్టేయ‌డంలో ఆరితేరిన తెలుగుదేశం పార్టీ నేత‌లు అనూహ్య‌మైన రీతిలో త‌మ స‌ర్కారుకు ప్ర‌చారం చేసేస్తున్నారు. కేంద్ర శాస్త్ర, సాంకేతికశాఖ సహాయమంత్రి సుజనా చౌదరి తాజాగా ఇదే రీతిలో షాకింగ్ వార్త ఒక‌టి చెప్పారు.

కర్నూలు పార్లమెంటు నియోజకవర్గం ఇన్‌ చార్జిగా నియమితులైన సుజ‌నాచౌద‌రి కర్నూలులో విలేఖరులతో మాట్లాడుతూ నిజాయితీతో కూడిన పాలన అందించాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కఠినంగా వ్యవహరిస్తూ అభివృద్ధి కోసం అహర్నిశలు పనిచేస్తున్నారని తెలిపారు. గత మూడేళ్ల కాలంలో ఎక్కడా ఒక్క అవినీతి ఆరోపణ కూడా రాలేద‌ని సుజ‌నా సెల‌విచ్చారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు, మంత్రి లోకేష్ పనితీరు బాగుంద‌ని పొగ‌డ్త‌ల్లో ముంచెత్తారు. ఇలా అద్భుత‌మైన పాల‌నతో ముందుకు సాగుతుండ‌టాన్ని ఓర్చుకోలేక ప్ర‌తిప‌క్ష వైసీపీ వ్యక్తిగత విమర్శలు, అసభ్యకర ప్రచారానికి తెర లేపిందని సుజ‌నా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవ‌ల సీఎం చంద్ర‌బాబు పనితీరుపై వైసీపీ స‌ర్వే నిర్వహించింద‌ని చెప్పిన సుజ‌నా...సర్వేలో ప్రజల నుంచి సంతృప్తికర సమాధానం రావడంతో జగన్ దిక్కుతోచని స్థితిలో పడ్డారన్నారు. దీంతో ఏం చేయాలో తెలియక తన కిరాయిమూకలతో చంద్రబాబు - లోకేష్‌ పై అభ్యంతరకర - అసభ్య పదజాలంతో సాంఘిక మాధ్యమాల ద్వారా దుష్ప్రచారాన్ని ప్రారంభించారని ఆరోపించారు.

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అమెరికా ప‌ర్య‌ట‌న‌ను సైతం వైసీపీ ఓర్చుకోలేక‌పోతోంద‌ని సుజ‌నా వ్యాఖ్యానించారు. అమెరికా పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చి దేశాన్ని, రాష్ట్రాన్ని అభాసుపాలు చేయడానికి కుట్ర పన్నారని ఆరోపించారు. అయితే వాస్తవాలు తెలుసుకున్న అమెరికా అధికారులు చంద్రబాబుకు భద్రత పెంచుతూ ఆయన కార్యక్రమాలు నిర్విఘ్నంగా నిర్వహించుకోవడానికి అవసరమైన సహాయం అందించారన్నారు. అమెరికా నుంచి భారీ పెట్టుబ‌డుల‌తో బాబు రాష్ర్టానికి తిరిగి వ‌స్తార‌ని ధీమా వ్య‌క్తం చేశారు.