Begin typing your search above and press return to search.

రాత్రికి చేరుకోనున్న శ్రీనివాస్ మృతదేహం

By:  Tupaki Desk   |   27 Feb 2017 8:18 AM GMT
రాత్రికి చేరుకోనున్న శ్రీనివాస్ మృతదేహం
X
అమెరికాలో హత్యకు గురైన కూచిభొట్ల శ్రీనివాస్‌ మృతదేహం ఈ రోజు రాత్రికి శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకోనుంది. శ్రీనివాస్‌ భౌతికకాయానికి మంగళవారం అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. గత బుధవారం రాత్రి అమెరికాలోని కన్సాస్‌ సిటీలో దుండగుడి కాల్పుల్లో శ్రీనివాస్‌ మృతిచెందిన విషయం తెలిసిందే.

శ్రీనివాస్ కూచిభొట్ల మృతదేహాన్ని కార్గో విమానంలో తీసుకొస్తున్నారు.. డెడ్ బాడీతో పాటూ శ్రీనివాస్ భార్య, అతని సోదరుడు, సోదరుడి భార్య, మరో మిత్రుడు రానున్నారు. మంగళవారం ఉదయం 11.30 గంటలకు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. శ్రీనివాస్ తల్లిదండ్రులు నగర శివారులోని బౌరం పేటలోని ప్రణీత్ బౌంటీలో నివాసం ఉంటున్నారు. ఆ ప్రాంతమంతా తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. జూన్ లో ఆనందంగా నగరానికి రావాల్సిన కొడుకు ఇలా విగతజీవిగా రావడం అతని తల్లిదండ్రుల్ని మానసికంగా కుంగదీసింది. వారి కన్నీరును ఆపడం ఎవరి తరం కావడం లేదు. శ్రీనివాస్ సోదరుడు కూడా అమెరికాలోనే ఉంటున్నాడు. ఒక కొడుకుని పోగొట్టుకున్న ఆ వృద్ధ దంపతులు తమ రెండో కొడుకుని అమెరికా వదిలి రమ్మని కోరుతున్నారు.

కాగా శ్రీనివాస్‌ మృతదేహం తరలింపు వివరాలను గోప్యంగా ఉంచాలని ఆయన కుటుంబసభ్యులు కోరినట్లు విదేశాంగ వ్యవహారాల శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఆ కారణంగానే వివరాలు అధికారికంగా బహిర్గత పరచలేదు. అయితే.. విదేశాంగ వ్యవహారాల శాఖతో పాటు, తెలంగాణ ప్రభుత్వం కూడా చొరవ చూపడంతో అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని మృతదేహాన్ని అయిదు రోజుల్లోనే స్వదేశానికి తేవడం సాధ్యమైంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/